Friday, May 2, 2014

హనుమద్రక్షాయాగం - 6

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
 
హనుమాన్ చాలీసా. తులసీదాసు గారు ప్రపంచానికి అందించిన సంజీవని. రాముని మీద తనకున్న నమ్మకాన్ని భక్తిని  పరిహసించి కేవల వినోదంగా భావించిన పాదుషాలను కోట వదిలి పారిపోయేలా చేసిన మహా మంత్రం. స్వామి మహిమనీ, చరిత్రనీ, భక్తినీ, వినయాన్నీ, శక్తినీ అన్నింటిని నలభై లైన్లలో చెప్పిన మహా మంత్రం. బాపు గారు తీసిన శ్రీరామాంజనేయ యుద్ధం సినిమాలో ఒక సన్నివేశం ఉంటుంది. రాముని భక్తుడైన యయాతి రాముని పూజ చేస్తూ ఉండగా పార్వతీదేవి పంపిన మాయ ఆ నగరం మీదకు రాబోతుంది. అప్పుడు ముకులిత హస్తాలతో రామ చంద్ర స్వామి ముందు కూర్చుని ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం లోనుండి ఒక జ్యోతి వెలువడి గోపురం మీదకి చేరుతుంది. ఆ జ్యోతి హనుమగా మారి మాయని గదతో తరిమేస్తుంది. పసిపిల్లలు శ్రీకరమౌ శ్రీరామ నామం  అని పాడుతూ ఉండగా స్వామి ముందు కూర్చుని ఉన్న హనుమయ్య విగ్రహం చూస్తే ఎంతో ముచ్చటగా ఉంటుంది. కోతి నైన జ్ఞానిని చేసే నీ దివ్యనామం అని హనుమ పాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో. హనుమ ఉండగా రామభక్తులని కొనగోటితోనైనా అశుభం స్పృశించలేదు.
 
అలా హనుమ రక్షణ, కరుణ పొందిన వారిలో తులసీదాసు ఒకరు. స్వామి దయచేత రాములవారి దర్శనం చేసారు తులసీదాసు. ఆయన మహిమ చేత నిండు పేరోలగంలో రక్షింపబడ్డారు. అప్పుడు తులసీదాసు గారు చేసినదే హనుమాన్ చాలీసా. నేటికీ భక్తుల కొంగు బంగారమై కాపాడుతున్నది. నా అదృష్టం చేత ఐదు సార్లు హనుమద్రక్షాయాగంలో పాల్గొన్నాను. నా చేతులతో స్వామిని అభిషేకించాను. నా చేతులతో స్వామిని తాకుతూ ఆయనకు గజమాల వెయ్యగలిగాను. అభిషేకం సమయంలో సుందరకాండలో స్వామి చెట్లచాటున ఎలా దాక్కున్నారో అలానే మామిడాకుల కింద కనపడ్డారు. అశోకవనంలో వెతికేటప్పుడు పూలతో నిండిన కొండా  అన్నట్టు ఉన్నారు హనుమ అంటే ఓహో అనుకున్నాను. స్వయంగా అలాగే దర్శనమిచ్చారు హనుమ అభిషేకం చేసాక. పచ్చటి పసుపు, ఎర్రటి కుంకుమ, రంగు రంగుల పూలు, తెల్లటి కొబ్బరి చిప్పలు మధ్యలో సింధూర వర్ణంలో స్వామి చిద్విలాసంగా చిరునవ్వులు చిందిస్తూ ఎంత అందంగా ఉన్నారో. ఎంత చెప్పినా తనివితీరదు చూసి తీరవలసిందే.  అలాగే ఆ చాలీసా పుణ్యమా అని తమ కష్టాల నుండి బయటపడ్డ ఎంతో మంది చాలా దగ్గరగా చూసాను. నా స్నేహితులు కొంతమంది నా మీద నమ్మకంతో మొదలుపెట్టి చాలీసా పారాయణ చేసి కొన్ని గడ్డు సమస్యలనుండి బయటపడి స్వామి అనుగ్రహాన్ని స్వయంగా పొందారు. 
 

ఈ సారి మే ఇరవై మూడు హనుమజ్జయంతి. శుక్రవారం రావడం చేత ఇరవైనాలుగు పూర్ణాహుతి జరుగుతోంది. ఈ ఇరవై రోజులూ ఎంత త్వరగా అయిపోతాయా అని ఆత్రంగా చూస్తున్నాను. రాదలచుకున్న వారు దుర్గేశ్వరమాస్టరుగారిని (durgeswara@gmail.com cell 9948235641, durgeswara.blogspot.in ) గానీ, నన్ను కానీ సంప్రదింఛగలరు.
 
మనోహర్ చెనికల  

No comments: