Monday, July 7, 2014

రామ నామమె చాలు, రామ చింతనే మేలు.

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

ఇది ఆరవ సారి హనుమద్రక్షాయాగంలో పాల్గొనడం. ప్రతీసారీ స్వామి చిత్రాతిచిత్రంగా దర్శనమిస్తూనే ఉన్నారు. ఓ మారు శింశుపా వృక్షశాఖల మాటున దాక్కుని చూస్తున్నట్టు, ఓమారు సుందరకాండ లో చెప్పినట్టు పూలతో నిండిన కొండా అన్నట్టు, ఓ మారు కొంచెం కోపంగా, ఓ మారు ప్రసన్నంగా ఇలా రకరకాలుగా కనిపించారు. ఈ సారి నా భార్యా బిడ్డలతో వచ్చేలా అనుగ్రహించారు. చిట్టి చిట్టి చేతులతో నాకూతురు స్వామికి పూర్ణాహుతి కలశాలు తీసుకుని అభిషేకం చేసింది. మూడు రోజులు సామి సామి అని స్వామి చుట్టూనే తిరిగింది. ఏ పని చెప్తే ఆ పని చేసింది. శివపార్వతుల కళ్యాణ విగ్రహాలను శుభ్రం చేస్తుంటే, నాన్నా స్నానం చేయించద్దు, సబ్బు రుద్దితే అమ్మకి కళ్ళు మంట పుడతాయి అని నాతో పాటే కూర్చుంది. పూర్ణాహుతి తర్వాత కలశాలు పైన పేరుస్తుంటే ఒక్కొక్కటి అందించింది. ప్రసాదాలు పాకింగ్ చేస్తుంటే ఒక్కొక్క పాకెట్ తీసి ఖర్జూరం పెట్టి ఇచ్చింది. ఇలా ఈ సారి చాలా ప్రత్యేకంగా జరిగింది.

ఇక ఈసారి జరిగిన సంకీర్తన అన్నింటికంటే ప్రత్యేకం. త్రినాధ శర్మ గారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుతూ ఉంటే ఏదో తెలియని ఉద్విగ్నత,
ఆ ప్రహ్లాదుడు,
ఆయన పడ్డ బాధలు,
ఆయనకోసం నానా జంగమ స్థావరాలలో నరసింహస్వరూపంతో నిండి పోయిన స్వామి.

వెతికితే ఎక్కడైనా కనిపిస్తాడని చెప్పిన ఐదేళ్ళ పిల్లవాడి నమ్మకం, 
చెటిల్లు చెటిల్లు, ఫెటిళ్ళు ఫెటిళ్ళు మని శబ్దాలతో స్థంబంలోనుంది వెలవడిన స్వామి,
ఇలా మనసంతా ఆయనే నిండిపోయినట్టనిపించింది. దానికితోడు, నాకు కులదైవం కూడా కావడం, ప్రతీ సంవత్సరం మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం వల్లనేమో ఆ నిమిషం అలా ఆగిపోతే బాగుండనిపించింది.
మొదటి సారి ఆ స్తోత్రం అలాగే యుగాలు పాడగలంత పెద్దదై ఉంటే బాగుండనిపించింది.

ఇక చివరి ఘట్టం, ఇరవైనాలుగు కోట్ల రామనామాన్ని భద్రాచలం చేర్చి, ఇదిగోనయ్యా నీ భక్తుల చేత నువ్వు రాయించుకున్న రామనామం అని ఆయనకి లెక్క చెప్పడం.
వెళ్ళలేకపోయాను కానీ మనసంతా అక్కడే ఉంది. ఇప్పుడు గోశాలకి వెళ్ళుంటారు, ఆవులకి కడుపునిండా భోజనం పెట్టుంటారు, ఇక సంకీర్తనతో స్వామి వారి దగ్గరికి వెళ్ళుంటారు ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను ఈ రెండు రోజులు.

ఇందాకే మాస్టరు గారు ఫోన్ చేసారు. మనోహరూ, కార్యక్రమం అద్భుతంగా జరిగింది, నువ్వుకూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని అన్నారు. కార్యక్రమం మొత్తం ఇలా జరిగింది అని చెప్పారు.

ఎంతో సంతోషంగా ఉంది.

అందుకేనేమో పెద్దలు నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పారు,
పలకండీ, పలకండీ, రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము అని.....


జై శ్రీరాం.










Wednesday, July 2, 2014

రండీ పుణ్యాత్ములారా ! శ్రీరంగని భజనకు !రాండీ ధర్మాత్ములారా! రండీ! మనమందరము,.కోదండరాముల భజనచేద్దాము

భగవద్భక్తులందరకూ ! నమస్కారములు

ఈనెల ఐదవతారీఖు[శనివారం} భద్రాచలంలో శ్రీరాములవారికి భక్తులందరి తరపున రామకోటినామలేఖనప్రతులను సమర్పించు కార్యక్రమము రామదండు నిర్వహించు చున్నది. శ్రీవేంకటేశ్వర జగన్మాతపీఠం [రవ్వవరం] లో ఈసంవత్సరం జరిగిన హనుమత్ రక్షాయాగ మునకు అనుసంధానంగా ఇరవై నాలుగు కోట్ల రామనామములను సామూహికంగా లిఖింపజేయు
కార్యక్రమం చేపట్టడం జరిగినది. స్వామి అనుగ్రహము వలన కార్యక్రమము చక్కగా సాగినది. లిఖిమ్చిన ప్రతులను పీఠమునకు చేరుస్తున్నారు రామభక్తులు. ఈప్రతులను తీసుకువెళ్ళి స్వామివారికి సమర్పించటం జరుగుతున్నది. శనివారంఉదయం నుండి రాత్రివరకు భద్రాచలం లో ఈకార్యక్రమం జరుగుతున్నది. ఇందులో ప్రత్యక్షంగా పాల్గొను భక్తులకొరకై అంబాసత్రంలో వసతి,భోజన సౌకర్యములను ఏర్పాటుచేయటం జరిగినది .

కార్యక్రమ వివరాలు

ఉదయం
నదీస్నానం
గోపూజ ః [గోవులకు ఆనందం కలిగించే గోవిందనామసంకీర్తనతో గోవులకు గ్రాసం,ఫలములనుతినిపించి,హారతి నివ్వటం.]

గణపతి పూజతో మొదలై స్వామివారికి అమ్మవారికి షోడశోపచార పూజ [అంబా సత్రంలో]
తదనంతరం సంకీర్తన [ధ్యానమందిరంలో]
మధ్యాహ్నం అన్నప్రసాదస్వీకరణ [అంబా సత్రంలో]
కొద్ది విశ్రాంతి అనంతరం అంబా సత్రంలో సంకీర్తన
సాయంకాలం
భద్రాగిరిప్రదక్షిణ, రామనామప్రతుల సమర్పణ. రాత్రి తొమ్మిదిన్నరవరకు భద్రగిరీశుని సన్నిధిలో సంకీర్తన.

ఈకార్యక్రమంలో పాల్గొనదలచిన భక్తులు శనివారం ఉదయానికల్లా భద్రాచలం చేరుకోవాలి
గురువారం నాటికి వారెంతమంది వస్తున్నారో ఫోన్ ద్వారా తెలుపవలసిఉంది

కలౌ నామస్మరణ అన్నారు పెద్దలు. మనపాపాలను,తాపాలను బాపుకొనుటకై ఈసంకీర్తనలో పాల్గొందాం , సీతాలక్ష్మణ,భరతశత్రుఘ్న,హనుమత్సమేత శ్రీరామచంద్రప్రభువుల కృపను వేడుకుందాం . జైశ్రీరాం

durgeswara@gmail.com
9948235641