Thursday, April 14, 2011

హనుమద్రక్షాయాగం-౨(2)

హనుమద్రక్షాయాగం-౨(2)
“సకలప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతియై యుండు సూక్ష్మకళుండచ్యుతుడయ్యెడన్ విరటజా గర్భంబు దా జక్ర హస్తకుడై వైష్ణవమాయ గప్పి కురు సంతానార్ధియై యడ్డమై ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్” అని పోతన గారిచే కీర్తించబడ్డ స్వామి కదా ఆయన, నా మనసులోని విషయం తెలుసుకొని ఇలా చూపించారేమో అని అనిపించింది.
http://newjings.blogspot.com/2011/04/blog-post.html
(కొనసాగింపు)
జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!



దక్షిణదిశగా చూస్తూ సాక్షాత్తూ దక్షిణామూర్తిగా కనపడ్డారు స్వామి ఆ సమయంలో. ఆ తర్వాత చుట్టూ ఉన్న పరిసరాలను చూసాను. స్వామికి కొంచెం వెనక పడమర దిక్కుని చూస్తూ మహా గణాధిపతి సింహాసనారూఢుడై ఉన్నాడు.


అమ్మవారి కళలన్నింటినీ నింపుకుని మహా సుందరంగా కనపడ్డాడు. పదకొండు, పన్నెండు ఏళ్ళ పిల్లలు కొంతమంది చాలీసా చదువుతూ ప్రదక్షిణలు చేస్తున్నారు, కొంతమంది పూలు కోస్తున్నారు. కొంతమంది పూజా సంభారాలు ఒక పళ్ళెంలో సమకూరుస్తున్నారు. ఒకరు అభిషేకానికి బిందెలతో నీరు తెచ్చారు. పిల్లలు కాషాయవస్త్రాలలో మెడలో రుద్రాక్షలు వేసుకుని ఎంత ముద్దుగా ఉన్నారో. అప్పటికి సమయం అటూ ఇటుగా ఏడవుతోంది. వెంటనే మాస్టరుగారు స్నానాదికాలు త్వరగా పూర్తిచేసుకుని రమ్మన్నారు. అన్నీ పూర్తి చేసుకుని ప్రదక్షిణలు చేసి మాస్టరుగారిచ్చిన కాషాయవస్త్రం కట్టుకుని స్వామి ముందు కూర్చున్నాను. అప్పటికి ఇంకా నా స్నేహితుడు రాలేదు. నిలబడితే ఒకమాదిరి హైటుగా కనపడుతున్న స్వామి, కూర్చున్నాక ఇంకా ఎత్తుగా, లంకను దాటడానికి ఉద్యుక్తుడైనప్పుడు ఇంతే ఎత్తుగా పెరిగారేమో అనిపించేలా కనపడ్డారు. ఆచమనం చేసి పూజ మొదలుపెట్టాము. నాచేతే అభిషేకం చేపించారు మాస్టరుగారు. నా చేతులతో ఆ స్వామికి అభిషేకం, అసలు కలలో కూడా అనుకోలేదు.

అభిషేకజలాలు స్వామిని ఆపాదమస్తకమూ తడుపుతూ ఉంటే కిరీటం మీదుగా, పింగళాక్షుడైన స్వామి కనురెప్పలను తాకుతూ, సింధూర వర్ణంలో మెరుస్తున్న చెంపలను తడుముతూ, ఆ రామచంద్రస్వామి పాదపరిమళాన్ని ఆఘ్రాణించే స్వామి నాసాగ్రాన్ని అలా తాకుతూ, వేదవిదుడైన ఆ రామమూర్తిని నిరంతరం కీర్తించే పెదవులమీదుగా , ఆ రామనామాన్ని నింపుకున్న కంఠం మీదుగా జాలువారుతూ, గుండెల్లో ఉన్న రాముడికి ఆనంద స్నానం చేస్తూ, సంజీవని పర్వతాన్ని సునాయాసంగా ఎత్తిన చేతులమీదుగా , బలిష్టమైన పిక్కలమీదుగా, స్వామి పాదాల మీదుగా అలా నేలని చేరిపోతున్న దృశ్యం తలచుకుంటే ఇప్పటికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇలాంటి ఆనందం ఎన్ని కోట్లు పెడితే దొరుకుతుంది చెప్పండి? తర్వాత శుభ్రమైన వస్త్రంతో స్వామిని శుభ్రపరిచి, పూలు సమర్పించాము. ఇంతలో నా స్నేహితుడు వచ్చాడు. తనని స్నానం చేసి రమ్మని మేము మళ్ళీ పూజలో పడ్డాము. దీపం వెలిగించి ధూపం వేసాము. తర్వాత గోత్రనామాలు పంపిన వారి పేర్లన్నీ అనుసంధానం చేసి, తర్వాత అష్టోత్తరం చదివాము.

సామూహికంగా అంతమందిమి అష్టోత్తరం చదువుతుంటే,
ఒక నామం వింటుంటే రామదర్శనానంతరం ఆనందనిమగ్నుడై రామలక్ష్మణులను భుజాలకెత్తుకున్న స్వామి గుర్తొచ్చారు. ఒక నామం వింటే శ్రీ రామ సుగ్రీవ సంధానం చేసిన ఆయన బుద్ధికుశలత గుర్తొచ్చింది. ఒక నామం వింటే ధృతితో ఆయన చేసిన సాగరలంఘనం, మరొక నామం వింటే లక్ష్యంపై దృష్టితో ఆయన చేసిన మైనాక నిరసన, ఇంకోనామం వింటే అద్భుతమైన బుద్ధిబలం(మతి)తో ఆయన సురసను గెలిచిన విధానం, మరోనామంలో అమేయ భుజబలంతో(దాక్ష్యం) సింహికను భంజించిన విషయం, ఇలా హనుమచ్ఛరిత్ర , శ్రీమద్రామాయణమనే మాలకి రత్న సదృశుడైన హనుమ వైభవం గుర్తొచ్చి మహదానందం కలిగింది.
ఏనాడైనా కలగన్నానా, ఆ స్వామి ముందు నిలబడి ఇలా చదవగలనని? ఈ రోజుకి తీరింది ఆ ఆనందం. తర్వాత స్వామికి ఇష్టమైన అరటిపళ్ళని నివేదన చేసి చాలీసా పారాయణ చేసాను. తర్వాత గుడి ముందుకి వెళ్ళాము. వేంకటేశ్వరస్వామి, అమ్మవారు, మహా శివుడు మహా దర్జాగా ఆసీనులై ఉన్నారు. బయట దత్తాత్రేయులవారు, కుమారస్వాములవారు, అయ్యప్పస్వామి వారు ఉన్నారు. వారికి నమస్కరించుకుని లోనికి వెళ్ళాము. అమ్మ, విజయవాడ దుర్గమ్మ లా చిరునవ్వుతో, కంటిచూపుతో సమస్తలోకాలనూ పోషించే మీనాక్షీ దేవిలా, తన మేని వెలుగుతో సమస్త లోకాలను దీపింపజేస్తూ, తనతాటంకాల మహిమతో మన్మధుడిని శివుడి మీద ప్రతీకారం తీర్చుకునేలా చేసిన అమ్మ దర్శనమిచ్చింది. చక్కని పట్టుపుట్టం కట్టుకుని చేత త్రిశూలం ధరించి, దుష్టులను శిక్షిస్తూ, భక్తులను రక్షించే తల్లి ఇంద్రకీలాద్రి మీద దూరంగా కనపడిన తల్లి, నేడు ఎదురుగా రెండు ఆడుగుల దూరంలో దర్శనమిచ్చింది. ఆ పక్కన వేంకటేశ్వరస్వామి, ఈ పక్కన శంకరుడూ కనపడి నా జన్మ ధన్యం చేసారు.

అంతలో మా ఫ్రెండ్ వచ్చాడు. అమ్మవారికి దణ్ణం పెట్టుకుని యాగశాలలోకి ప్రవేశించాము. యాగం పూర్తి చేసి ప్రసాదం స్వీకరించాము. చక్కటి ఉప్మా అల్పాహారం తీసుకుని కొంచెం సేపు మాట్లాడుకున్నాము. తరువాత పిల్లలగురించి అడిగితే చెప్పారు. ఈ నలభై మంది పిల్లలకి మాస్టరుగారు దీక్షనిప్పించి వారే భోజనాదులు చూసుకుంటున్నారని తెలిసి ఆశ్చర్యపోయాను. స్కూలు చూస్తే పెద్ద స్కూలేం కాదు, అక్కడ చేరిన పిల్లలలో ఇవ్వలేని వాళ్ళ దగ్గర ఫీజులు కూడా వసూలు చెయ్యరు వారు, పైన పీఠం నిర్వహణ, వీటికయ్యే ఖర్చు ఎలాగా అని ఆశ్చర్యపోయాను. ఆయన చెప్పినమాటల్లో నాకు శరణాగతి అంటే ఏమిటో మొదటిసారి కళ్ళ ఎదుట కనిపించింది. ఏ శక్తిని నమ్ముకుని ఆయనని పదేళ్ళనుండి లాభాపేక్ష లేకుండా పిల్లలకు విద్య నేర్పిస్తున్నారో, ఏ శక్తిని నమ్ముకుని ఈ హనుమద్రక్షాయాగాన్ని మొదలుపెట్టారో, ఆ శక్తినే తలచుకుని ఈ సారి హనుమద్రక్షాయాగాన్ని మరింత నియమనిష్టలతో చెయ్యాలని నిర్ణయించుకున్నాను. అప్పుడే ఎలాగైనా సుందరకాండని చదవాలని నిర్ణయించుకున్నాను. తర్వాత మాస్టరుగారు తమదగ్గరున్న అన్నదానం చిదంబరశాస్త్రి గారి పుస్తకాలిచ్చారు. అవే మేము హిందూ ధర్మ సర్వస్వం అనే బ్లాగులో ప్రచురిస్తున్నాము.

తర్వాత భోజనాలు చేద్దామన్నారు. అప్పుడే తెంపిన అరటిఆకులో చల్లని చెట్లకింద నలభై మంది బాలస్వాములతో కలిసి భోజనం చేసాము. ఆచమనం చేసి భోజనం స్వీకరించాము. తర్వాత హనుమ వైభవం గురించి మాట్లాడుకున్నాము. పీఠం ఎలా కట్టినదీ వివరించారు. చెప్తున్నప్పుడు ఆ తల్లి మహిమలకు సాక్షిగా నిలిచిన ఆయన ఆనందం మాకు వింతగా కనపడింది. ఇంతగా భగవంతుడితో మమేకం అవ్వడం సాధ్యమా అన్న విషయం మీద మాకు ఉన్న సందేహాలు తొలిగిపోయాయి. తర్వాత ఆ పిల్లలతో ఆడుకున్నాము. ఒకపిల్లవాడుండేవాడు గణపతి అని, మరి అతని పేరు అదేనో, లేక తనని చూసి నవ్వుతాలికి అలా పిలిచేవారో తెలియదు కానీ, మనిషి గుండులా భలే ఉండేవాడు. ఏదన్నా అడిగితే వెంటనే చేసేవాడు. ఇలాగే మిగతా పిల్లలతో కలిసి పెద్ద ఆరిందాల్లా ఖోఖో ఆడాము. పదేళ్ళ పిల్లలు వాళ్ళు, ఇరవైయైదేళ్ళు మాకు. వాళ్ళతో ఎక్కడ పోటీ పడగలం? అప్పటికీ పరిగెట్టాం, అందినట్టే అంది పాదరసంలా పారిపోతున్నారు. చివరికి ఎలానో ఒకళ్ళని పట్టుకున్నాం. తరవాత మమ్మల్ని పరిగెట్టమనేసరికి కాలు బెనికేలా పడ్డాను. అంతే, గేం ఫినిష్. కూర్చుని అడే ఆటలు ఆడదామని ప్రపోజల్ పెట్టను. ఇలా ఒకగంట , రెండు గంటలు ఆడాము, ఒకరిద్దరు తప్ప అందరూ మాతో కలిసిపోయారు.




ఇక అక్కడినుండి వాళ్ళు చెప్పే మాటలు వినడానికి అసలు సమయమే సరిపోలేదు. ఒకపిల్లవాడు అన్నయ్యా, నాకు “ఆదిశేషా,అనంతశయనా” పాటవచ్చు, పాడతాను వీడియో తియ్యవా అని అడిగాడు, ఇలా అందరూ ఎవరికి తోచిన పాటలు వాళ్ళు పాడతాం ,రికార్డ్ చెయ్యమని కూర్చున్నారు. సరే రేపు తీరిగ్గా కూర్చుని రికార్డ్ చేస్తాలే అని సాయంకాలం పూజకి తయారయ్యాము. సాయంత్రం కూడా పూజ చేసి అమ్మవారి ముందు భజన చేసారు. మాస్టరు గారే పిల్లలందరికీ భజనలు నేర్పించి వాళ్ళచేత దసరాకి భజన చేయించేవారు. వాళ్ళ ఊళ్ళో ఈ పిల్లల భజన ని చాలా ఇష్టంగా చూస్తారట. అన్నయా ఈసారి దసరాకి మా ఊరికి రండి, దసరా చాలా బాగా చేస్తారు అని అందరూ చెప్పడమే. అలా భజన పూర్తి చేసి అమ్మకి లాలి పాడి నిద్రపుచ్చి భోజనాలు చేద్దామనుకునేసరికి కరెంట్ పోయింది. సరే అని పిల్లలకి సుందరకాండ చెప్పడం మొదలుపెట్టాను. బోరు కొడుతుందేమో అనుకున్నాను. కానీ ఎంత ఆసక్తిగా విన్నారో. నాకే ముచ్చటేసింది. స్వామి పెరిగినప్పుడు, లంకలో చిన్నవాడై వెతికినప్పుడు, అమ్మ అధిక్షేపిస్తే మేరునగసమానుడై అమ్మకి ధైర్యం చెప్పినప్పుడు కళ్ళు ఇంతింత చేసుకుని ఎంత బాగా విన్నారో. తర్వాత భోజనాలు చేసి నిద్రపోయాము. తర్వాత రోజు పిల్లలు ఇక అసలు వదలలేదు మమ్మల్ని, మామిడి చెట్లకింద కూర్చుని వాళ్ళకొచ్చిన అన్ని పాటలు పాడి మా చేత రికార్డ్ చేయించారు. ఆ పిల్లలే మా ఇద్దరినీ కొండ గురునాధస్వామి దగ్గరికి తీసుకెళ్ళి దర్శనం చేయించారు.



తర్వాత నేను వెళ్తుంటే అన్నయ్యా మళ్ళి వస్తావా అన్నయ్యా, దసరాకి తప్పకుండా రా అన్నయ్యా అని మరీ మరీ అడిగారు.

తర్వాత నేను పూణె వెళ్ళి వృత్తిలో నైపుణ్యాన్ని అలవర్చుకున్నాను. స్వామి దయవలన భాగవతం కొన్నాను. చదివాను. సుందరకాండ పారాయణం చేసాను, ఇంట్లో డబ్బు సమస్య వదిలి కొత్తగా మొదలుపెట్టిన ఇల్లు పూర్తయ్యింది. చాలా సందర్భాల్లో మాస్టరుగారు నాకు నైతికస్థైర్యానిచ్చారు.ఇదంతా ఆ స్వామి మహిమే అని నా నమ్మకం, వెనక్కి తిరిగి చూసుకుంటే నాలో అపనమ్మకాన్ని పోగొట్టడానికి ఆ స్వామి ఆడిన నాటకం ఈ యాగం అనిపిస్తుంటుంది ఇప్పుడు.
రెండవసారి కూడా వెళ్ళాను. వారిలో కొంతమంది పిల్లలు పాతవాళ్ళే. నన్ను గుర్తుపెట్టుకుని అన్నయ్యా అని అల్లుకుపోయారు. రెండురోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు. కానీ ఈసారి నేనొక్కడినే. నా స్నేహితుడు హనుమజ్జయంతికి వస్తానన్నాడు, నాకు ఆ సమయంలో సెలవు లేని కారణంగా వెళ్ళలేకపోయాను.
విచిత్రమేమిటంటే, రెండుసార్లూ కూడా నేను హనుమజ్జంయంతికి వెళ్ళలేకపోయాను, సరే పెళ్ళయ్యాక ఇద్దరము వెల్దాం అనుకున్నా. ఏమో పైన స్వామి దయ.
ప్రభుత్వం కొత్తగా స్కూళ్ళ గుర్తింపు గురించి విధించిన నియమనిబంధన ల మూలంగా ఈ విద్యాసంవత్సరం మాస్టరుగారు స్కూల్ మూసేసారు. రేపూ మేమిద్దరం వెల్తాం. కానీ అక్కడ ఆ పిల్లలు ఉంటారా, ఇంద్రజిత్తు కొట్టిన దెబ్బలకి హనుమ ఒక్కడికే దెబ్బలు తగలలేదు అని చెప్పినప్పుడు నిజమా అన్నయ్యా, అని చెప్పి ఆ స్వామి మూర్తిని తదేకంగా చూస్తూ అలా ఉండిపోయే ఆ పిల్లలు మళ్ళీ మాకు కనపడతారా? వాళ్ళ ఊరు గురించీ, కొండగురునాధస్వామి గురించీ, ఎంత బాగా చెప్పేవాళ్ళో. అన్నయ్యా మళ్ళీ వచ్చినప్పుడు మాకు సుందరకాండ మొత్తం ఒకరోజంతా చెప్పాలని అమాయకంగా అడిగే ఆ పిల్లలు లేకుంటే ఏదో వెలితిగా ఉంటుంది. ఆ స్వామినే అడగాలి.

ఎవరాదర్శం?

నా స్నేహితుడు:
ఎవరికి వారు నిజాయితీగా ఉంటే చాలు...అవినీతి ఉండదు అంటున్నారు. అది నిజం కూడా. కానీ, చుట్టూ ఉన్న ప్రజానీకానికి నిజాయితీగా బ్రతికేందుకు కావల్సిన పరిస్థితులు ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఎవరిమీద ఉంది?

ఆ ప్రజలు ఎన్నుకున్న నాయకుని మీదనా?
లేదా ఆ సమాజం వల్ల బాగుపడి కడుపు నిండిన వాడి మీదనా?
లేక ఇద్దరి మీదనా?
వీరిద్దరూ కాక ఇంకా ఎవరైనా ఉన్నారా?
manohar chenekala -
ఎవరైనా కాదు, ఏదైనా ఉందా అని అడిగితే సరైన సమాధానం దొరుకుతుందేమో! అదే మనస్సాక్షి. ఎన్నుకోబడ్డ నాయకులకి ప్రజా ప్రతినిధులుగా ఉన్నాం. మన భాధ్యత వారికి మంచి జీవితాన్ని అందించడం అన్న భావం ఖచ్చితంగా ఉండాలి.నాయకులంటే ఎవరు? ఒకప్పుడు మనలాగే అమ్మపాలు తాగుతూ, తాతయ్యలూ , అమ్మమ్మలూ చెప్పే కధలు వింటూ పెరిగిన వారే కదా! ఆ సమయంలో ఆత్మసాక్షి అనేది ఒకటుందనీ, అది ఆస్తిక,నాస్తిక వాదానికి అందకుండా మనం తప్పు చేసినప్పుడు , ఒప్పు చేసినప్పుడు మన వెంట వుండి తన అభిప్రాయాన్ని చెప్తుందనీ , దాని నోరు నొక్కెయ్యడం ప్రాణాన్ని అమ్ముకుని శరీరాన్ని బతికించుకోవడంలాంటిదనీ అర్ధం అయ్యేలా చెప్పగలగాలి.అప్పుదు ఆ పిల్లవాడు ఏ పనైనా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాడు, సరైన నిర్ణయం తీసుకుంటాడు, లేదా తీసుకోవడం నేర్చుకుంటాడు. ఇప్పటికైనా మన పిల్లలను ఆ దిశగా తీర్చిదిద్దుకోవడం మన చేతిలోనే ఉంది.


చట్టానికి దొరకకుండా తప్పించుకోవడమ్ కొంత తెలివైన వాడికి సాధ్యమే, కానీ ఆత్మసాక్షి నుండి తప్పించుకోవడం అనేది అంత సులభంకాదు. అది అలవాటైనవాడు ఎవరికీ భయపడడు, ఎంతటివారి ముందైనా నిర్భయంగా తన అభిప్రాయాన్ని చెప్పగలుగుతాడు. నిజాయితీ ఒకరకమైన ధైర్యాన్నిస్తుంది.

ఇద్దరు స్నేహితులున్నారనుకోండి. ఒకర దగ్గ్గర చాక్లెట్లు ఉన్నాయి, ఒకరి దగ్గర గోళీలు ఉన్నాయి. ఇద్దరూ ఎక్స్చేంజ్ చేసుకున్నారనుకోండి, గోళీలున్నవాడు ఒక గోళీ దాచుకుని ఇచ్చాడు, చాక్లెట్లు ఉన్నపిల్లవాడు మొత్తం ఇచ్చేసాడనుకోండి. అప్పుడు ఎవరు మనశ్శాంతిగా ఉంటారు. తనని అవతలివాడు మోసం చేసినా మొదటివాడు నిర్భయంగా ఉంటాడు, అనుమానించడు, కానీ రెండవవాడు? తాను మోసం చేసాడు కాబట్టి, అవతలివాడు కూడా తనను మోసం చేసాడేమో అని అనుమానం ఉంటుంది, నిద్ర పట్టదు. మనశ్శాంతి ఉండదు. అది నిజాయితీ ఇచ్చే నిర్భయత్వం.Edit11:10 am


నా స్నేహితుడు:
సరే మనోహర్, నేను మరో విధంగా ఆలోచిస్తా... అప్పుడేమంటావు. నిజాయితీని పక్కన పెట్టి, అవతలోడికి నేను ఒక గోళీ తక్కువిచ్చినా నమ్మేశాడు..వెర్రోడు అనుకుంటా... అదే ఆలోచనలో ఉంటాను. వేరే విధంగా ఆలోచించను. నాదే పై చేయ్యి, నేను పక్కోడిని బురిడీ కొట్టించాను అని ఫీలవుతాను. నా దృష్టిలో అవతలోడు ఎప్పుడూ వేస్ట్ గాడే అనుకుంటాను అనుకో... అప్పుడేమంటావ్... ఈ ప్రపంచంలో మనస్సాక్షికి ఈ విధంగా కూడా సమాధానం చెప్పుకోవడం సాధ్యమే.


సరే, నేను తర్వాతి తరానికి ఈ విధంగా బోధిస్తాను. రావణుడు ఉన్నన్నాళ్ళూ లైఫ్‍ని ఎంజాయ్ చేసుకోని, ఒక్క రామబాణంతో పెద్దగా కష్టంలేకుండా చచ్చాడు. అదే రాముడైతే నిజాయితీ కోసం అడవులకెళ్ళి ఎన్నో కష్టాలు పడ్డాడు అంటాను. మరి, తర్వాతి తరం ఏ ఆలోచనలో పెరుగుతుంది చెప్పు.

ఏనాటికైనా చచ్చేవాళ్ళమే తప్పో, ఒప్పో ఏదైతేనేం ఉన్నన్నాళ్ళూ లైఫ్‍ను ఎంజాయ్ చేసుకుంటే చాలు అనే ఆలోచనలోకి ప్రజలు మారిపోతే ఎలా ఉంటో ఆలోచించుకో..12:12 pm
manohar chenekala - అదే నేననేది,
"సరే మనోహర్, నేను మరో విధంగా ఆలోచిస్తా... అప్పుడేమంటావు. నిజాయితీని పక్కన పెట్టి, అవతలోడికి నేను ఒక గోళీ తక్కువిచ్చినా నమ్మేశాడు..వెర్రోడు అనుకుంటా.. " అనుకుంటావు, కానీ అవతలివాడు నిన్ను మోసం చెయ్యలేదని నీకు నమ్మకం ఉండదు, ఎవరినీ నమ్మవు, నమ్మలేవు. నిన్నెంతో ఇష్టప్డేవాళ్ళపై కూడా నీకు అనుమానంగానే ఉంటుంది. సంబంధాలు చెడిపోయేదాకా తీసుకెల్తుంది. మనస్సాక్షికి సమధానం చెప్పడం ఆంటే, సంజాయిషీ ఇవ్వడం కాదు, నిజాన్ని బయట ఎవరికీ చెప్పకపోయినా నీకు నువ్వు చెప్పుకోవడం. ఇక రావణుడి గురించి నువ్వు చెప్పింది. నేను చెప్పిందీ అదే. మనం వాళ్ళని ఎలా పోర్ట్రైట్ చేస్తామో మన తర్వాతి తరమూ అలాగే తీసుకుంటుంది. పుడుతూనే ఎవరూ రాముడినీ కానీ , రావణుడిని కానీ ఆదర్శంగా తీసుకోరు. మనం రామారావు సినిమాలు చూపిస్తే వాడికి కచ్చితంగా నువ్వన్న ఫీలింగే కలుగుతుంది. అదే నువ్వు రామాయణాన్ని ఉపాసన చేసిన వాళ్ళ మాటలు చెప్తే వాడికి రావణుడి దౌర్భాగ్యం అర్ధమవుతుంది.
నువ్వన్నావే ఉన్నన్నాళ్ళు ఎంజాయ్ చేసాడని, కానీ రామాయణం నిజంగా అర్ధమైతే నువ్వు ఆ మాట చెప్పవు.
ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టి తాను రాక్షసుడిని కాబట్టి, ఒక స్త్రీని ఎత్తుకురావడం తనకు ధర్మమే అని సమర్ధించుకున్న వాడు ఏ రకంగా సమాజానికి ధర్మప్రాయుడవుతాడొ నువ్వే చెప్పాలి.
తన తలనే ఆహుతి చేసి బ్రహ్మను మెప్పించిన ఒక గొప్ప తపశ్శాలి, కైలాసాన్ని చెణకబోతే, ఎడమకాలి బొటనవేలితో నొక్కి అణిచివేసాడు ఈశ్వరుడు, అతని సామర్ధ్యం గురించే మాట్లాడుకోవాలి మరి.
ఒక ఆడపిల్లని అల్లరి పెట్టబోతే, "ఇష్టం లేని ఆడదాని జోలికి పోతే పోతావని" బ్రహ్మ గారిచ్చిన శాపాన్ని మరుగున పెట్టి, సీతా నీ అంత నువ్వు నన్ను ప్రేమించాలి అందుకే నేను నిన్ను బలవంతం చెయ్యట్లేదు అని కారుకూతలు కూసిన వాడి సత్యసంధత గురించే మాట్లాడుకోవాలి.
ఒక కోతి తన లంకా పట్టణలోకి వచ్చి అల్లకల్లోలం చేస్తే , ఎలాగోలా పట్టుకొచ్చి సభలో నిలబెడితే , రావణుడికి కోపం బదులు భయం వేసింది. ఇంతకుముందు వాడు చేసిన వెధవపనికి శాపమిచ్చిన నందీశ్వరుడే ఎదురుగా నిలబడ్డాడేమో అని భయపడ్డాడు. హనుమకి శత్రు స్థలం. రావణుడికి స్వస్థలం. అయినా రావణుడు భయపడ్డాడు, హనుమ చెప్పదలచుకున్నది నిర్భయంగా చెప్పారు. ఎందుకు తన ఊరైనా రావణుడు భయపడ్డాడు, ఎందుకు శత్రుస్థలమైనా హనుమ భయపడలేదు, చెప్పు?
నువ్వన్న ఆ ఎంజాయ్‍మెంట్ అనేదాని అర్ధాన్ని మార్చేస్తున్నారు, అది గమనించమంటున్నా, ఎంజాయ్‍మెంట్ అంటే ఏంటి? పక్కవాడి సొమ్ము దోచుకోవడమా, బలహీనులని చంపడమా, ఇష్టమైన వాళ్ళని ఎత్తుకొచ్చెయ్యడమా? వీటిల్లో ఏది ఎంజాయ్‍మెంట్ చెప్పు? రావణుడు చేసిన పనుల్లో ఇవి కాక వేరేమైనా ఉన్నాయా?
రాముడిలా ధర్మం కోసం రాజ్యాన్ని వదులుకున్నాడా? లేదే పైగా తమ్ముడి రాజ్యాన్ని లాక్కున్నాడు.
తనకోసం ప్రాణాలు వదిలిన జటాయువుకి, ఒక తండ్రికి కొడుకు చేసినట్టుగా కర్మకాండ చేసి ఊర్ధ్వలోకాలకు పంపాడు రాముడు. మరి రావణుడు, యుద్ధంలో చనిపోయిన సైనికుల సంఖ్య తెలిస్తే తర్వాతి రోజు యుద్ధానికి భయపడతారని వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మొసళ్ళకు ఆహారంగా వేసాడు. ధర్మం చెప్పినందుకు తమ్ముడిని చంపుతానన్నాడు.
బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి సంధ్యావందనం చేసి వేదం చదవవలసినవాడు, సీతమ్మ పట్ల కామమోహితుడై సరాసరి అశోకవనానికి వచ్చాడు రావణుడు. అడవిలో ఉన్నా, ఒకరు అడిగేవాడు లేకున్నా, పరంపరానుగంతంగా వస్తున్న ఆచార వ్యవహారాలను స్వచ్చంధంగా పాటించిన వాడు రాముడు.
ఆవేశంతో సుగ్రీవుడు రావణుడి మీదకు ద్వంద్వ యుధ్ధానికి వెల్తే, సుగ్రీవా, నీకేమైనా అయ్యుంటే ఎలా? నువ్వు చనిపోతే నేను ఎవరికోసం పోరాడటం, నా మిత్రుణ్ణి పణంగా పెట్టి నా భార్యను సాధించుకోలేను, నేను యుద్ధమే చెయ్యలేనన్నాడు రాముడు. మరి రావణుడో, వెల్తే నేను చస్తాను, నా తర్వాత నువ్వూ నీ లంకా పట్టణమూ మొత్తం సర్వనాశనమవుతుంది అని మారీచుడు చెప్పినా వినలేదు, వెల్లకపోతే ఇప్పుడే చంపేస్తాను అన్నాడు. అన్నీ వున్నా ప్రశాంతంగా నిద్రకూడా పోలేకపోయాడు, ఏమీ లేకపోయినా సత్యాన్ని, ధర్మాన్ని తప్పకుండా ప్రయాణించాడు రాముడు,


దేన్ని సుఖజీవితం అని బోధిస్తావ్? ఒక్క రామబాణంతో చచ్చాడు అని నువ్వన్నావే, లోకాలని ఏడిపించిన రావణుడు అక్షకుమారుడు చనిపోయిన రోజున ఏడిచింది నీకు తెలుసా, చేతికందొచ్చిన కొడుకు ఇంద్రజిత్ చనిపోయిన రోజున వాడికేమనిపించి ఉంటుందో నీకు తెలుసా, చచ్చిపోయే ముందు కట్టుకున్న భార్య, ఎన్నడూ తనని అధిక్షేపించకుండా అనుగమించిన భార్య వచ్చి "రావణా! నిన్ను చంపింది రాముడనుకుంటున్నావా, నిన్ను చంపింది మితిమీరిన నీ ఇంద్రియ వ్యామోహమే అని దెప్పిపొడిచిననాడు, వాడు ఎంత కుళ్ళి కుళ్ళి ఏడిచి ఉంటాడో ఊహించు, అది చెప్పి చూడు తర్వాతి తరాలకి, అప్పుడు కూడా ఎవరైనా రావణుడే మాకాదర్శం అంటే దండేసి దండం పెడతా నీకూ,వాడికి

Tuesday, April 12, 2011

హనుమద్రక్షాయాగం:



హనుమద్రక్షాయాగం: (2009) మొట్టమొదటిసారి నేను హనుమద్రక్షాయాగంలో పాల్గొనడం చాలా చిత్రంగా జరిగింది. నా స్నేహితుడొకడు చెన్నై లో ఉండేవాడు. తన బ్లాగులో హనుమద్రక్షాయాగం పోస్టర్ ఉంచాడు. చూసాను, పెద్దగా పట్టించుకోలేదు. నలభైరోజులపాటు, పదకొండు సార్లు చాలీసా పారాయణం చెయ్యాలి, ప్రదక్షిణలు చెయ్యాలి, ఇంట్లో మా వదిన ఉంటుంది, నలభై రోజులు కంటిన్యుయస్ గా అంటే కుదరదులే అని వదిలేసాను. కానీ ఎక్కడో మనసులో ఒక మూల అవమానంగా ఉండేది. స్వయంగా హనుమే అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోతున్నానన్న బాధ ఉండేది. కొన్ని రోజులు పోయాక ఒకసారి ఆ చెన్నై స్నేహితుడికి ఫోన్ చేసాను. ఎలా సాగుతుంది నీ పారాయణం అని అడిగాను. ఏదో సాగుతుంది, హాస్టల్లో కుదరదుకదా, కుదిరినప్పుడు చేస్తున్నా అన్నాడు. దానికి నేనుండి “అలా కాదురా మన్స్ఫూర్తిగా ఆ స్వామి మీద భారం వేసి చెయ్యాలి అని సంకల్పించుకోరా, ఏ అడ్డు రాదు అని చెప్పాను. నువ్వు నేను చేస్తున్నాను అనుకుంటే పూర్తి చేసే బాధ్యత కూడా నీ మీదే పెడతాడు, అలా కాకుండా సంపూర్ణంగా శరణాగతి చేసి చూడు అప్పుడు ఏ అడ్డంకీ ఉండదు”. ఇలా ఒక అరగంట మాట్లాడి ఫోన్ పెట్టేసాను, పెట్టేసాను కానీ ఆ రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. శరణాగతి గురించి తనకి చెప్పాను కానీ నాకు ఆ శరణాగతి చేసే బుద్ధి ఉందా అని ఆలోచించాను. ఒకరికి చెప్పే ముందు చేసి ఆచరించాలి కదా అని నా మనసు వెక్కిరించింది. ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకుని భగవత్కార్యం తప్పించుకుంటున్నానేమో అనిపించింది. సరే అని అప్పుడు తెల్లవారగానే దుర్గేశ్వర గారికి ఫోన్ చేసాను, “స్వామీ మరి సగం దీక్షాసమయం అయిపోయింది, ఇప్పుడు చెయ్యవచ్చా, గోత్రనామాలు పంపమంటారా” అన్నాను. “అయ్యో తప్పకుండా పంపండి, మంచి పనికి ఆలస్యంలేదు, ఇప్పుడైనా మొదలుపెట్టండి, ఏ భయాలు పెట్టుకోకుండా సర్వం ఆ స్వామి మీద పెట్టి మీరు పారాయణ చెయ్యండి, “ అన్నారు.

మొదలుపెట్టాను, పెద్ద పూజ ఏమీ చెయ్యలేదు కానీ రోజూ ధూపం వేసేవాడిని, చాలీసా పారాయణం చేసేవాడిని, అంతే, ప్రదక్షిణలు చెయ్యడం మనవల్ల కాదులే అని చెయ్యలేదు. చాలీసా మాత్రం క్రమం తప్పకుండా ఆ పదిరోజులూ చేసాను. హనుమజ్జయంతికి ఇంకా నాలుగైదు రోజులుందనగా నా స్నేహితుడు ఫోన్ చేసి పూర్ణాహుతికి వెల్దామా అని అడిగాడు, జయంతి మంగళవారం రోజు. శనివారం, ఆదివారం ఉందాములే అని నేనూ వస్తాననీ చెప్పాను, పైగా తనని కూడా కలవచ్చులే, ౨౦౦౬ (2006) లో కాలేజీ అయిపోయిన తర్వాత మూడేళ్ళపాటు మళ్ళీ కలవలేదు. మేమిద్దరము, ఇంకొక నరసరావుపేట అతను ఒకే గదిలో ఉండేవాళ్ళం. చాలా సరదాగా, సన్నిహితంగా ఉండేవాళ్ళం. నాలుగేళ్ళు ఏ పొరపొచ్చాలు లేకుండా గడిపాం. అలాంటిది కాలేజీ తర్వాత మూడు సంవత్సరాలు కలవలేదు. ఎన్నో సార్లు నేను చెన్నై వెల్దామనుకున్నా కుదరలేదు, తను హైద్రాబాద్ కి వద్దామన్నా కుదరలేదు, ఒకట్రెండు సార్లు వచ్చినా కలవడం కుదరలేదు. ఇక మళ్ళీ కలవలేమేమో అని కొద్దిగా భయం వేసింది. కానీ ఈ యాగం ఫలితమా అని ఇప్పుడు కలవబోతున్నా. కొంచెం ఆశ్చర్యమనిపించింది. చదివింది చాలీసా నే కానీ అది సుందరకాండ సదృశమని చాలామంది నమ్మకం, తులసీదాసు వారే ఈ మాట అన్నారని ఎక్కడో విన్నాను. నిజానిజాలు తెలియవు.

సుందరకాండ చదివితే బంధు హిత సమాగమం జరుగుతుందని తెలుసు. కానీ ఇంత సద్యఃఫలితంగా కనపడుతున్న దాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కాలేదు.ఎలాగైనా యాగానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అప్పటికప్పుడు వినుకొండ కి టికెట్లు రిజర్వేషన్ చేయించుకుని బయలుదేరాను, ఏమీ ప్లానింగ్ లేదు, వెళ్ళిపోయాను. నలభై రోజులూ చేసిన వాళ్ళలో చాలామందికి యాగం లో పాల్గొనే అదృష్టం దొరకదు/నిజానికి దొరకలేదని చెప్పాలి. అలాంటిది నేను చేసినది పాక్షికంగానే ఐనా స్వామి రప్పించుకుంటున్నారు అని ఒక పక్కన ఉన్నా, మరో పక్క ఎవరూ తెలియదు అక్కడ, నేను చేస్తున్నది కరెక్టేనా ముక్కూ, ముఖం తెలియని ఒక వ్యక్తిని వెతుక్కుంటూ వెల్తున్నానపించింది (అప్పటికి మాస్టరుగారు నాకు పెద్దగా తెలియదు). అటు చెన్నై నుండి నా స్నేహితుడు కూడా బయలుదేరానని ఫోన్ చేసాడు. అంతే! ఇక ఏ సందేహం పెట్టుకోకుండా బయలుదేరమని స్వామి చెప్పినట్టనిపించింది. ఏదైతే అదే అవుతుంది పైన ఆ స్వామే ఉన్నారని బయలుదేరాను. ఆ స్వామి చెయ్యలేనిదేముంది, ఇక పీఠం గురించి నేను ఊహించింది వేరు, ఏదో చిన్న గుడి, ఒక యాగ శాల ఉంటుందేమో అనుకున్నాను.(అప్పటికి నాకు పీఠం గురించిన వివరాలు పెద్దగా తెలియవు. ) ఆ స్వామిని చూడచ్చు, నా స్నేహితుడిని కలుస్తున్నానన్న అనందంలోఉండగానే తెల్లవారుఝామున వినుకొండలో దిగాను. అక్కడినుండి ఉల్లగల్లు దరిశి బస్సు ఎక్కి రవ్వవరం అని చెప్పాను. ఏ స్టాప్ వచ్చినా ఇదేనా రవ్వవరం అని అడగడం, వాళ్ళు కాదు బాబూ, వస్తే చెప్తాములే అని అనడమూ, ఇలా ఒక అరగంట గడిచేలోపు కుడివైపు ఆంజనేయస్వామి కనపడ్డారు. మూడు నాలుగు అడుగుల మూర్తి రూపంలో ఉన్నారు.

పక్కనే ఏదో బోర్డ్ మీద రవ్వవరం అని చూసాను, వెంటనే దిగాను. సరాసరి ఆంజనేయస్వామి కనపడిన దగ్గరికి వెళ్ళాను. అడిగాను ఇక్కడ దుర్గేశ్వర గారని జగన్మాత పీఠం అని . వారుండి ఇక్కడకాదు, ముందే దిగాలి కదా అన్నారు, ఏదో అపశకునంలా అనిపించింది. వాళ్ళ తమ్ముడు ఇక్కడే ఉన్నారు వెళ్ళండి అని వాళ్ళ ఇంటికి పంపారు. ఆయన నన్ను పీఠం దగ్గరికి తీసుకువెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి నేనూహించుకున్న దానికి అక్కడ కనపడుతున్న పీఠానికి నక్కకీ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. నమ్మలేకపోయాను. పచ్చటి పంట పొలాల మధ్యలో, అడపా దడపా రోడ్డున వచ్చిపోయే వాహనాలు తప్ప మరే గోలా లేని ప్రశాంతమైన వాతావరణంలో, చుట్టూ అరటిచెట్లూ, పూలచెట్లూ, మామిడిచెట్లూ, ఇలా రకరకాల చెట్లతో చాలా అందంగా ఉంది ఆ స్థలం. ఇక హనుమ మూర్తి అయితే సాక్షాత్తూ పరాశరసంహితలో ఎలాగైతే అరటిచెట్ల మధ్యలో ఉపాసించాలన్నారో , అలాగే చుట్టూ అరటిచెట్లూ, మధ్యలో ఆకాశాన్నంటేలా ఉన్న హనుమ , పాదాల దగ్గర, అభిషేకాదులకోసం మరో చిన్న మూర్తి కొలువై ఉన్నారు. అరటి తోటలో స్వామిని ఉపాసన చెయ్యాలి అని మొదటిసారి విన్నప్పుడు , ఎవరికి కుదురుతుంది ఇల చెయ్యడం అని అనుకున్నాను. కానీ “సకలప్రాణి హృదాంతరాళముల భాస్వజ్యోతియై యుండు సూక్ష్మకళుండచ్యుతుడయ్యెడన్ విరటజా గర్భంబు దా జక్ర హస్తకుడై వైష్ణవమాయ గప్పి కురు సంతానార్ధియై యడ్డమై ప్రకటస్ఫూర్తి నడంచె ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్” అని పోతన గారిచే కీర్తించబడ్డ స్వామి కదా ఆయన, నా మనసులోని విషయం తెలుసుకొని ఇలా చూపించారేమో అని అనిపించింది.







(మిగతాది మరికొద్దిసేపట్లో)