Sunday, November 8, 2009

తాటంకా చలనమ్ముతో

శ్రీ రామదూతం శిరసా నమామి!

సముద్రాన్ని సూర్యుడు ఎండ గట్టలేడు, కానీ అదే భానుడు పిల్లకాలువను ఆనవాలు లేకుండా అలవోకగా అంబరానికెత్తుకోగలడు. అలాగే నా ఓపిక మొత్తం నేను ఇవ్వకపోయినా ఆవిరి చేసే నా కంప్యూటర్ కి హవిస్సుగా ఆహుతి చేసి(ఈ అనంత విశ్వం లో నాకు తెలిసి ఎయిర్ కండిషన్ లో ఉంటూ జనాల జవసత్వాలను ఆవిరి చేసే సూర్య సదృశం ఈ కంప్యూటర్ ఒక్కటే ), అర్ధ ప్రధానమైన ఆ నిత్య యజ్ఞకర్మకి పూర్ణాహుతి చేసి ,ఓ శనివారం నాతో నేను (అంతే కదా మరి ) కలిసి నడుచుకుంటూ వస్తున్నాను.దారిలో పూణే గోల్ఫ్ కోర్స్ లో పెన్సిల్ కూడా సరిగ్గా పట్టుకోలేని పిల్లలు గోల్ఫ్ బాల్స్ తో కుస్తీ పడుతున్నారు(గోల్ఫ్ లో వాడే బాట్ లాంటి సాధనాన్ని ఏమంటారో నాకు తెలియదు మరి). ఓ పావుగంట చూసాను,సరే అక్కడినుండి కదిలి ముందుకు పోయాను.కొంచేపు పోయేసరికి ఇక నడవలేము అనిపించింది.వందేళ్ళు భగవంతుడి గురించిన ధ్యాస కానీ,అవసరం కానీ లేకుండా గడిపెయ్యచ్చనుకుంటాం. కానీ అలసట లేకుండా పది నిముషాలు పైబడి నడవలేము కదా.సరే ఒక ఆటో పట్టుకుని రూం కి వెళ్తూ మధ్యలో మోర్ లో వారాంతం కదా ఏమన్నా కొందామని వెళ్ళ్ళాను. (ఏంటి ఈ సోది టైటిల్ కి రాడేంటి అనుకుంటున్నారా, వస్తున్నా )

మోర్ లోనుండి బయటకి వచ్చి నడుస్తున్నాను. ఇంకొక్క నూటయాభై అడుగులు నడిస్తే మా అపార్ట్ మెంట్ ద్వారం వస్తుంది.సరే నేనేదో ఆలోచించుకుంటూ నడుస్తున్నాను.అప్పుడు ఒక అమ్మాయి సడెన్ గా ధర్మ మోక్షాలను , అర్ధ కామాలు క్రాస్ చేసినట్టు నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోయింది(:-)). అలా సడెన్ గా దాటిపోయేసరికి చివ్వున తలెత్తి చూసాను,
నలుపు ,తెలుపు పంజాబీ డ్రెస్ వేసుకుని వుంది, చాలా వేగంగా నడుస్తుంది, ఏం అవసరం లో పరిగెడుతుందో లే అనుకున్నాను. ఆమె నుండి చూపు తిప్పుకుంటుండగా ఆమె చెవి కమ్మలు కనబడ్డాయి. రెండు,మూడు చిన్న చైన్లు కిందకి వచ్చి కింద మరొక్క చాలా చిన్న లాకెట్ లాంటి దానికి కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఆ చెవి కమ్మలు ఆ అమ్మాయి నడుస్తున్న వేగానికి సెకండ్ల లోలకం కంటే ఎక్కువ వేగం తో(హై స్కూల్ ఫిజిక్స్- సెకండ్ల లోలకం అవధి-2 సెకండ్లు , తప్పైతే ఆదిలక్ష్మి గారు కరెక్ట్ చెయ్యాలి) ఆమె బుగ్గలనందుకోవాలని ప్రయత్నించి అందుకోలేక వెనక్కి వచ్చి జడకి చెప్పుకుంటున్నాయి.
అలా కదులుతున్న చెవి కమ్మలను చూడగానే నాకు అనుకోకుండా "తాటంకా చలనమ్ముతో,భుజ నటద్ధమ్మిల్ల బంధమ్ముతో......" అనే పద్యం గుర్తొచ్చింది.
గజేంద్రుడు పిలిచాడు బాగానే ఉంది,అయ్యవారు అన్నీ మరిచి పరిగెడుతున్నారు బాగానే ఉంది, కానీ మధ్యలో అమ్మవారి చీరచెంగు చేతిలో ఉన్న విషయం కూడా మర్చిపోయి పరిగెడుతున్నారు స్వామి.లక్ష్మీ దేవి మాత్రం ఏమి చేస్తుంది,ఏం చెప్తుంది? ఆగమంటే అదో అపకీర్తి- భక్తులకి , భగవంతుడికి మధ్య లక్ష్మీ దేవి అడ్డొచ్చిందంటారో ఏమో ,లోకాలను కాపాడడానికి మొగుడు విషం తాగుతుంటే ఏమీ కాదని తెలిసి తాగమన్నందుకే పార్వతీ దేవిని నిందిస్తున్నారు(మింగెడిది గరళమని, మింగెడివాడు విభుండని,మింగమనె సర్వమంగళ) హవ్వ మొగుడిని విషం తాగమంటుందా ఏ భార్య ఐనా అని. అలాంటిది ఆపి "ఏమయ్య ఎక్కడికి పరిగెడుతున్నావు పెళ్ళాన్ని కూడా మర్చిపోయి " అంటే ఇంకేమన్నా ఉందా , ఇలా అలోచిస్తూ అమ్మవారు తత్తరపాటుతో ఆ లోకేశుని అనుసరిస్తున్నప్పుడు అమ్మవారి స్థితి ని వర్ణించిన పోతనామాత్య కృత పద్యరత్నం అది.పరిగెడుతున్న వేగానికి కదులుతున్న అమ్మవారి తాటంకాలు ఎలా కదిలి ఉంటాయో ఎందుకు పోతన చెవి కమ్మలు కదిలితే అంత ప్రాముఖ్యత ఇచ్చాడో అని చాలా సార్లు అనుకున్నాను గజేంద్రమోక్షణ కధ చదివిన దగ్గరనుండి. కానీ ఆ అమ్మలగన్న యమ్మ ఇలా దృశ్యరూపంగా ఆ ఘట్టాన్ని ఆవిష్కరిస్తుందనుకోలేదు.ఎవరైనా ఆడవారి మొఖం చూసినప్పుడు చాలా తొందరగా కదులుతూ చూపునాకర్షించేవి తాటంకాలే, పరుగులు పెడుతున్న అమ్మవారిని ధ్యానంలో దర్శనం చేసిన పోతన కి కూడా ఆ తాటంకాలే కనపడి ఉంటాయి ముందు. అందుకే ఆ తాటంకా చలనమే ముందుండి ఆ పద్యాన్ని నడిపించింది.(సౌందర్య లహరిలో శంకరులు కూడా పార్వతి దేవి తాటంకాలపై ఒక పద్యం రాసినట్టు గుర్తు.)

ఆ పద్యంలో మొదటి పదమైన "తాటంకా చలనమ్ముతో" అన్న స్థితి నా కళ్ళముందు సాక్షాత్కరించినట్లైంది. ఒక్క సారి గజేంద్రుడి పటాటోపం,
సత్వరజస్తమో గుణ సదృశమైన త్రికూటాచలమూ,
మొసలి పరాక్రమమూ
(పాద ద్వందము నేలమోపి, పవనుం బంధించి ,పంచేంద్రియోన్మాదంబుం పరిమార్చి, బుద్ధిలతకున్మారాకు హత్తించి, నిష్ఖేద బ్రహ్మపదావలంబన గతిం క్రీడించు యోగీంద్రు మర్యాద -నక్రము విక్రమించె కరి పాదాక్రాంత నిర్వక్రమై),
తీసిపోని గజరాజు పరాక్రమమూ
(జవమును,జలమును,బలమును వివిధములుగ కరటి వీరతకు భువిన్, దివి మకర మీన కర్కట నివహంబులొక్కటన మిత్ర నిలయము బొందెన్),
వెయ్యి సంవత్సరాలు జరిగిన అద్వితీయమైన పోరాటమూ(సలిపె పోరొక్క వేయి సంవత్సరముల్),
చేష్టలుడిగి శరణాగతి చేసిన ఏనుగు(లావొక్కింతయు లేదు....) ,
పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడిన శ్రీ మహా విష్ణువు(సిరికించెప్పడు...,కరుణాసింధుడు శౌరి వారిచరమున్ ఖండింపగా బంపె....,పూరించెన్ హరి పాంచజన్యము...),
శాపవిముక్తుడైన గందర్వుడు హూహూ,
విష్ణువులో ఐక్యత నొందిన ఇంద్రద్యుమ్న మహారాజు,
శుక బ్రహ్మ చెప్పిన ఫలశ్రుతీ,
శ్రీ మహా విష్ణువు చేసిన అభయ ప్రదానం,
పోతన చెప్పిన ఫలశ్రుతీ --ఇలా అన్నీ కళ్ళముందు గిర్రున తిరిగాయి. తేరుకుని చూస్తే అమ్మాయి లేదు, కానీ ఆ కదులుతున్న చెవి కమ్మలు మాత్రం గుర్తుండిపోయాయి.

కొని వారమైంది ,కార్తీక మాసం సగమైపోయింది వీడింకెప్పుడు మొదలుపెడతాడో భాగవతం, ఒక పక్క కార్తీక పౌర్ణమి కూడా దాటిపోతుంది అని (ఆరోజు అయ్యవారు పరిగెత్తి గజేంద్రుడిని కాపాడినట్టు) నా చేత కార్తీక పౌర్ణమి లోపు భాగవత పఠనం మొదలుపెట్టించడానికి అంతే తత్తరపాటుతో పరిగెత్తుకొచ్చిందేమొ ఆ అమ్మ అని అనిపించింది(నాటికి రెండవరోజు కార్తీక పౌర్ణమి)

ఏమిటీ దైవలీల,
మంగళాశాసన పదైః మదాచార్య పురోగమైః!
సర్వైశ్చపూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం

Tuesday, October 27, 2009

ఇంకెన్నో రోజులు లేదులే మీ కోరిక తీరడానికి!

శ్రీ రామదూతం శిరసా
నమామి!

తెలుగు మెడలో ఈ
బోర్డ్ ఎప్పుడో పడింది.

ఈ రోజు కొత్తగా
బాధ పడడమెందుకు? మనం కోరుకున్నదేగా
జరుగుతున్నది. మన పిల్లలు తెలుగులో
మాట్లాడితే మనకే అవమానం.

"
అల
వైకుంఠపురం లో,జో అచ్యుతానంద
జోజో ముకుంద " లాంటి అచ్చతెలుగు
పదాలు, పద్యాల అందాలు ఇప్పుడు
అవసరం లేదు.
ఆకాశంలో మెరిసే
తారల గురించి కూడా ఇంగ్లిష్
లోనే చెప్పాలి,ట్వింకిల్ ట్వింకిల్
స్టార్ అంటూ.... చెప్దాం.
క్రిష్టియన్

స్కూల్లో పిల్లలు పెద్ద చదువులు(?) చదవాలి, దానికి తెలుగైతే ఏంటి, ఇంగ్లిష్ ఐతే ఏంటి అనే కదా చేర్పించాము
ఇప్పుడు ఏడవడం దేనికి?

ఎటూ మన పిల్లల్ని
వాళ్ళు తెలుగు చదవ నివ్వరు,మనమూ
చదవనివ్వము.,
పెద్దవాళ్ళకి తెలుగు

తప్ప ఇంకేది రాని కుటుంబాలు
ఇంకా కొన్ని ఉండడం చేత పిల్లలకు
, ఆ లు  అమ్మ,అత్త పదాలు వస్తున్నాయి.

ఈ పిల్లలకు అంతకు మించి తెలుగు

రాదు ఇరవయ్యేళ్ళకైనా, అరవయ్యేళ్ళకైనా . ఇక ఆ తర్వాతి తరానికి అసలు చన్సే
ఉండదు.
సో ఇంకొక్క తరమే మిగిలింది

తెలుగుని బతికించడానికైనా, చంపడానికైనా...


ఒక హారీ పోటర్
పిల్లలకి నచ్చుతుందంటే, అంతకి
మించి పిల్లల ఊహా శక్తిని, సృజనాత్మకతని
పెంచే కధలు మనకి లేవా?
(లేవు అని
ఇప్పుడు ఎవరూ అనకపోవచ్చు, కాని
భవిష్యత్తులో లేవని చెప్పే
రోజులు కచ్చితంగా వస్తాయి.)
కానీ చెప్పాలంటే మనకి రావాలి
కదా,
మనకి తెలిసినవన్నీ చేతన్

భగత్ పుస్తకాలూ, సిడ్నీ షెల్డన్
పుస్తకాలున్నూ , ఇక మనమేం చెప్తాం.

అందుకే టీచర్స్ కి వదిలేసి మనం

మాత్రం మన పిల్లల మెరుగైన భవిష్యత్తు
కోసం (డబ్బుంటే చాలా వ్యక్తి
వికాసం అవసరం లేదా) కష్టపడుతూ
ఉంటాం (?).
ఆ టీచర్స్ ఏం చెప్తున్నారో

మనకి తెలియదు.
మన పురాణాలు
,కావ్యాల
గురించి ఉండేదే ఒక తెలుగు పుస్తకంలో , అలాంటి తెలుగు ఒక క్రిష్టియన్
టిచర్ చెప్తే ఎలా ఉంటుందో అనుభవించి
బాధ పడాలే కాని చెప్పేది కాదు.

పార్వతీ కళ్యాణం చెప్పినా అదే

తంతు, శ్రీ కృష్ణుని బాల్య క్రీడలు
చెప్పినా అంతే. ఇవన్నీ మనకవసరం
లేదు.
ఇంకేం జరుగుతుంది ఇది

కాక. మనమలక్ష్యం చేసి చంపేసిన
తెలుగుకి వాళ్ళు ఇప్పుడు సమాధి
కడుతున్నారు...


తెలుగు బతకాలంటే
ఏం చెయ్యాలో అందరికీ తెలుసు, ఇలా చెయ్యండి, అలా చెయ్యండి
అని చెప్పల్సిన అవసరం లేదు అని
నా అభిప్రాయం.
ఇప్పుడు పెద్ద

పెద్ద ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు
చాలా మంది తెలుగు వాళ్ళు(తెలుగు
మీడియం) కారా?

Friday, October 9, 2009

నేనూ ఒక పద్యం రాసానోచ్.

శ్రీ రామదూతం శిరసా నమామి.
గజేంద్ర మోక్షం చదివిన తర్వాత నాకు కూడా ఆంజనేయస్వామి మీద ఒక పద్యం రాయలనిపించింది. మత్తేభమో, శార్దూలమో, చంపకమో, ఉత్పలమో కొడదాం అనుకున్నా
*ఫర్ క్విక్ రిఫరెన్స్
ఉత్పలమాల-భ ర న భ భ ర వ
చంపకమాల-న జ భ జ జ జ ర
మత్తేభం-స భ ర న మ య వ
శార్దూలం- మ స జ స త త గ (ఆటవెలది,తేటగీతి, కందం- పేర్లు మాత్రమే తెలుసు చందస్సు తెలియదు.). *

సరే కాన్సెప్ట్ కావాలి కదా... తీవ్రంగా బ్రైన్ ని ఆ భగవంతుడి గుణగణాల మీద కేంద్రీకరించి అలోచించాక నాకు తట్టిన మొదటి అలోచన ఆ రామదూత కు పెద తండ్రి అయిన యముడి విషయం. తదుపరి గుర్తొచ్చింది ఎవరినైనా ముంచగలిగిన సంసారమనే మృత్యుసాగరాన్ని అవలీలగా దాటిన విషయం. దాంతో దీన్నే పద్యంగా రాద్దాం అనుకున్నా. కాని ఇక్కడ ఒక చిక్కు వచ్చింది.యముడు హనుమ కి పెద నాన్న అయినది ద్వాపరంలో, కానీ సాగరాన్ని దాటింది త్రేతాయుగం లో. దానితో ఎలా రాయడమా అని తెగ అలోచించాను. ఏమీ తోచలేదు. నేనేమన్నా సహజ పాండితీ ప్రకర్ష ఉన్న పొతన్ననా, మామూలు పదాలతోనే పెద్ద పెద్ద పద్యాలు రాసెయ్యడానికి(జో జో కమలదలేక్షణ, జో జో మృగరాజ నయన జో జో-దశమ స్కంధం), లేకపోతె అజ్జాడ గారిలాగా సమయ స్పూర్తి ఉన్నవాడినా,(రాజుతో పేకాట ఆడుతూ రాజుకు మూడు ఆసులు , తనకు మూడు రాజులు వస్తే, పెద్ద పందెం పెట్టేసి ఆనక "ఏ ధైర్యం తో అంత పందెం పెట్టావంటే" రాజుల మీద నమ్మకంతో అని ఎస్కేప్ అయినట్టు అవ్వడానికి)
అందుచేత చివరికి నేను కూడా అర్జునుని బాణాన్నే నమ్ముకుని - పద్యం తెలిసిన వాళ్ళకి కవిత అని, తెలియని మా అశోక్, శశాంక్, అభి, కిరణ్(కిరణ్ కి కొంచెం తెలుసనుకుంటా),రెక్కల పక్షి(వింగ్ బర్డ్-వెంకట్)కి ఏ కందమో, ఆటవెలదో, తేటగీతో అని చెప్పెయ్యచ్చులే అని ఒక పద్యం రాసేసా.
ఇదుగో ---
సర్వతముడవు,సర్వోత్తముడవు
సర్వాత్ముడవు,సర్వము నీవై యుండన్
సర్వకాలములందు నమస్కరింతు
సర్వం సహా చక్రవర్తికి సరసీరుహాళికిన్
ఏంటి ఎక్కడో చదివినట్టు ఉందా (1-విశ్వకరు,విశ్వదూరుని,విశ్వాత్ము,విశ్వవేద్యు విశ్వునవిశ్వున్ శాశ్వతనజు బ్రహ్మ ప్రభు నీశ్వరునిన్ బరమ పురుషు నే సేవింతున్ 2-లోకంబులు లోకేశులు లోకస్ధులు దెగిన దుది నలోకంబగు పెంజీకటికవ్వలనెవ్వడేకాకృతి వెలుగుచునుండునాతని సేవింతున్ ... ఇలా ), ఒక వేళ మీరెక్కడన్న చదివినా అది నా తప్పు కాదు. ఎందుకంటే ఇది నా సొంతం......(ఏంటీ స్వామి నవ్వుతున్నావా నా సొంతమన్నానని-అంతేలే ఎందుకు నవ్వవు, గ్రామర్ పెద్దగా తెలియని నాకు ఒక పద్యం రాయాలని కోరిక కలిగించి చివరికి నేను రాయలేకపోతే నిరుత్సాహ పడకూడదని ఒక చిన్న పద్యం రాసేలా చేస్తే ఇప్పుడు నేను ఈ పద్యం నాదే అంటే నవ్వు రాదా).
నాది అని అన్నందుకు క్షమించు స్వామీ కానీ అలా అనడానికి కారణం ఉంది, అలా అనుకోకపోతే నీకు నైవేద్యంగా సమర్పిన్చుకోలేనన్న చిన్న ఆలోచన . అందుకే ఈ చిన్న ధిక్కారం.
కూర్చె భాగవతమొకరు నిను సేవించి కైవల్యమొంద,
తీర్చుకొనుటకు జన్మ జన్మంబుల కర్మ పాశములు కొంద
రర్చించె శతకములతో,అల్ప జ్ఞాన వశమున నే
కూర్చిన ఈ పదమాలనర్చించనిమ్ము నీ పాద పద్మంబుల
నా మొదటి పద్యం(సర్వతముడవు...) ఆ శ్రీ రామదూతకి అంకితమిస్తూ.......
శ్రీ రామదూతం శిరసా నమామి....
మంగళాశాసన పదైః మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం

Tuesday, May 19, 2009

హనుమత్ రక్షా యాగం పూర్ణాహుతి .





రవ్వవరం లో రెండు ఎకరాల సువిశాల క్షేత్రంలో నిర్మింప బడ్డ శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠం లో హనుమత్ రక్షా యాగం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ యాగం ఇప్పుడు పూర్ణాహుతి దశకు చేరుకుంది. ఎక్కడెక్కడనుండో మీ సంకల్పాలను మాష్టరుగారు ఆ స్వామికి నివేదించి, రోజూ మన గోత్ర నామాలతో క్రమం తప్పకుండా పూజ ను నిర్వహిస్తూ వచ్చారు.ఆ స్వామి అనుగ్రహం చేత నేను రవ్వవరం లో వేంచేసి యున్న ఆ జగన్మాత ని, క్షేత్ర పాలకుడైన ఆ వాయునందనుడిని దర్శనం చేసుకోగలిగాను.ఎన్నో రకాలుగా పరీక్షలు పెట్టి ఆ స్వామి రవ్వవరం వెళ్ళడానికి నాకు అనుమతినిచ్చారు. పీఠం, యాగం అనగానే నేను ఏదో అనుకున్నాను. కానీ అక్కడకు వెళ్ళిన తర్వాత నా అభిప్రాయం మార్చుకున్నాను. చక్కటి ప్రదేశం, చూడగానే ప్రశాంతత మూర్తీభవించినట్లుండే పరిసర ప్రాంతాలు, పల్లెటురి ఆప్యాయతలు, అక్కడ దీక్ష తీసుకున్న బాల స్వాములు, అంతా కలిసి నా అనుభవాన్ని ఆనంద మయం చేసారు.వెళ్ళగానే స్నానాదికాలు పూర్తి గావించి స్వామికి పూజ చేసాము. తర్వాత యాగం లో పాల్గొన్నాము. ఆ తర్వాత ఆ పీటం గురించి , పూర్వ చరిత్ర గురించి చెప్పారు. ఆ తర్వాత బాలస్వాములతో మాటలు మొదలుపెట్టాం. మొదట కొంచెం దూరంగా మసలినా తర్వాత దగ్గరయ్యారు. దానికి తోడు నాతో పాటు నాగప్రసాద్ ఉండనే ఉన్నాడయ్యే. వాడుంటే పిల్లలు చాలా తొందరగా దగ్గరికి వస్తారు. అలా వాళ్ళు బాగా కలిసిపోయారు.వాళ్ళ మాటలు వింటూ ఉండగానే సాయంత్రం అయ్యింది.సరే పిల్లలందరినీ రమ్మనమని చెప్పి ఆటలాడాము.ఖో ఖో ఆడి కాలు బెనికించుకున్నాను. ఆ తర్వాత నాగప్రసాద్ పరిగెత్తకుండా ఆడే ఆటలు ఆడించడంతో ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ, భజన జరిగింది. మాష్టరు గారి తాళజ్ఙానం అబ్బురపరిచింది.ఆదివారం రోజు ఇంకా ఆహ్లాదంగా గడిచింది. అక్కడున్న చెట్టూ,చేమా కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించాయి. దగ్గరిలో ఒక కొండ మీద కొండగురునాధ స్వామి ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళాము. మాకు తోడుగా కొంతమంది బాలస్వాములు వచ్చారు. ట్రెక్కింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి రవ్వవరం ఆ చుట్టుపట్ల ఉన్న కొండలు కోరిక తీరుస్తాయి.ఆ తర్వాత ఊళ్ళో వెలిసిన వేణుగోపాల స్వామిని, శివున్ని దర్శించుకుందామనుకుంటే సమయాభావం చేత కుదరలేదు.
కుదిరితే మీరు కూడా పూర్ణాహుతి కి వెళ్ళడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుంది. ఏర్పాట్లు మాత్రం భారీ ఎత్తున జరుగుతున్నాయి. వెళ్తే ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వెళ్ళాలి అనిపిస్తుంది. ప్రయత్నించండి. ౫౪ (54) రోజుల పాటు అఖండంగా జరిగిన ఈ దీక్షా కార్యక్రమాన్ని చివరి రోజైనా దగ్గరనుండి చూడాలనుకుంటే,చూడాలనుకుంటే ఏంటి పాల్గొనాలనుకుంటే మరెందుకు ఆలస్యం, వెంటనే irctc నో,RTC నో అడిగి వినుకొండ కి టికెట్ తీసుకోండి. ఆ స్వామి అనుగ్రహాన్ని పొందండి.




దూర ప్రాంతములో ఉండి ఇక్కడకు రాలేని పరిస్థితిలో ఉన్న వారి కోసం స్వామి వారి రక్షలను (ఉచితంగానే) పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. పోస్టల్ ఖర్చులు మాత్రం పంపించవలసి ఉంటుంది. ఇతర వివరాల కోసం ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలవరకు ఈ ఫోన్ లలో సంప్రదించండి. అందుబాటులో ఉంటాము.Phone numbers: 09948235641, 09940050078, 08646211717.




marinni ఫోటో లు తదుపరి టపాలో ................

Saturday, May 2, 2009

విజయేంద్ర జాతక కధలు-"మిత్రుడు"

బుద్ధుడి జాతక కధలు అని అప్పుడప్పుడూ మీరు వినే వుంటారు. ఇది మన విజయేంద్రుడి కలం నుండి జాలువారిన జాతక కధ. పోస్టర్ చూసిన తర్వాత ఫస్ట్ అనిపించింది ఏంటంటే శివలెంక కృష్ణప్రసాద్ కి ఈ సినిమా కొంచెం డబ్బులు మిగులుస్తుంది అని. టైటిలే కొంచెం మార్చి ఏ మూడు ముళ్ళ బంధం అనో ఏడడుగుల సంబంధం అనో పెట్టుంటే బాగుండు అనిపించింది. బహుశా విదేశంలో జరిగిన పెళ్ళికి అంత పవర్ ఉండదనుకున్నారేమో అందుకే టైటిల్ అవి తట్టినట్టు లేవు. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో నిజంగా నటించాడు. ఒక్క మగాడిని అని అహంకరించకుండా స్క్రిప్ట్ లో ఉన్న మిగతా నటీనటులకి కూడా కనిపించే అవకాశం ఇచ్చాడు. ఇక కొయ్యడాలు, నరకడాలు ,భారీ భారీ డవిలాగులు లేకుండా మరి మన బొబ్బిలి సింహంతో సినిమా తీసినందుకు నిజంగా దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఒక యంగ్ హీరో కి సరిపోయే కధతో ఆ కధలో బాలకృష్ణ ని పెట్టి బాలకృష్ణ ని యంగ్ గా చూపించగలిగిన(మరీ టూ మచ్ రాస్తున్నానా ,లేదు లే బాలకృష్ణ నిజంగానే యంగ్ గా ఉన్నాడు సినిమా లో) టీం నిజంగా ప్రశంసా పాత్రమే. సినిమా ఆద్యంతం ఒకే టెంపో మెయింటెయిన్ చేసాడు. టెంపో అంటే పెద్ద ఉద్దేశ్యం ఏమీ లేదండీ నాకు. బాలకృష్ణ సినిమా అంతా పాటలతో సహా ఒకేలా కనిపించాడు. మామూలుగా అయితే విజయేంద్రవర్మ క్లైమాక్స్ లాగా ప్రతీ సినిమాలోనూ పదీ ,పదిహేను రకాలుగా కనిపించేవాడు.ఇందులో అలా లేదు ఇందుకు దర్శకుడిని తప్పకుండా మెచ్చుకోవాలి. ఇక ద్రోణ తర్వాత సినిమా అయినా కూడా దర్శకుడు ప్రియమణిని కంట్రోల్ లో ఉంచాడు. అందుకు ఒక ఓ ! డైరెక్టర్ కి ,.



ఇక ఇప్పుడు విషయంలోకి (నా బొంద విషయం ఏముంది చెప్పడానికి. సినిమా చూసిన వాళ్ళకి టైటిల్ చూడగానే అర్ధం అవుతుంది. సినిమా చూడని వాళ్ళకి ఎటూ నేను స్టొరీ చెప్పబోవడం లేదు కాబట్టి అర్ధం కాదు.)సరే విషయం టూకీగా చెప్తాను అర్ధం చేసుకోగలిగినవాళ్ళు చేసుకోండి. లేదంటే సినిమా చూడండి.


ఓ యాక్సిడెంట్-కొన్ని చావులు-ఒక జాతక ( దోషం unna ) ప్రేమకధ- ఒక చావుకై ,తోడుకై వెతుకులాట (కంగారు పడద్దు చావులో తోడు అని కాదు , చావక పోతే,చావు రాకపోతే బతకాడిని తోడు అని అర్ధం) - అదీ స్టోరి .


ఒక వేల మీరీ టపా చదివి సినిమాకెల్తే మాత్రం బయటకు వచ్చాక కూడా మీకు కూడలీ,జల్లెడా నా బ్లాగూ తప్పకుండా గుర్తుంటాయి నాదీ పూచీ.



ఎనీ క్వశ్చన్స్:


-- ఈ టపాకి మీ టైటిల్ కీ సంబంధం లేదు అని నా ఆబిప్రాయం ,దీనికి మీ సమాధానం?


సమా: సర్లే పెద్ద చెప్పొచ్చావు కాదు కాదు అడగొచ్చావు తెలుగు సినిమా టైటిల్స్ కి , సినిమాలకీ ఉంటున్న సంబంధం కంటే ఎక్కువే వుంది .అయినా అడిగావు కాబట్టి నీకింకో విషయం చెప్తా. సినిమా చూసి బయటకు రాగానే సినిమా పోస్టర్ చూసి నేను అన్న మొదటి మాట ఇదే . అందుకే ఇదే టైటిల్ అంతే.

విజయేంద్ర జాతక కధలు-"మిత్రుడు"

బుద్ధుడి జాతక కధలు అని అప్పుడప్పుడూ మీరు వినే వుంటారు. ఇది మన విజయేంద్రుడి కలం నుండి జాలువారిన జాతక కధ. పోస్టర్ చూసిన తర్వాత ఫస్ట్ అనిపించింది ఏంటంటే శివలెంక కృష్ణప్రసాద్ కి ఈ సినిమా కొంచెం డబ్బులు మిగులుస్తుంది అని. టైటిలే కొంచెం మార్చి ఏ మూడు ముళ్ళ బంధం అనో ఏడడుగుల సంబంధం అనో పెట్టుంటే బాగుండు అనిపించింది. బహుశా విదేశంలో జరిగిన పెళ్ళికి అంత పవర్ ఉండదనుకున్నారేమో అందుకే టైటిల్ అవి తట్టినట్టు లేవు. ఇకపోతే బాలకృష్ణ ఈ సినిమాలో నిజంగా నటించాడు. ఒక్క మగాడిని అని అహంకరించకుండా స్క్రిప్ట్ లో ఉన్న మిగతా నటీనటులకి కూడా కనిపించే అవకాశం ఇచ్చాడు. ఇక కొయ్యడాలు, నరకడాలు ,భారీ భారీ డవిలాగులు లేకుండా మరి మన బొబ్బిలి సింహంతో సినిమా తీసినందుకు నిజంగా దర్శకుడి ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఒక యంగ్ హీరో కి సరిపోయే కధతో ఆ కధలో బాలకృష్ణ ని పెట్టి బాలకృష్ణ ని యంగ్ గా చూపించగలిగిన(మరీ టూ మచ్ రాస్తున్నానా ,లేదు లే బాలకృష్ణ నిజంగానే యంగ్ గా ఉన్నాడు సినిమా లో) టీం నిజంగా ప్రశంసా పాత్రమే. సినిమా ఆద్యంతం ఒకే టెంపో మెయింటెయిన్ చేసాడు. టెంపో అంటే పెద్ద ఉద్దేశ్యం ఏమీ లేదండీ నాకు. బాలకృష్ణ సినిమా అంతా పాటలతో సహా ఒకేలా కనిపించాడు. మామూలుగా అయితే విజయేంద్రవర్మ క్లైమాక్స్ లాగా ప్రతీ సినిమాలోనూ పదీ ,పదిహేను రకాలుగా కనిపించేవాడు.ఇందులో అలా లేదు ఇందుకు దర్శకుడిని తప్పకుండా మెచ్చుకోవాలి. ఇక ద్రోణ తర్వాత సినిమా అయినా కూడా దర్శకుడు ప్రియమణిని కంట్రోల్ లో ఉంచాడు. అందుకు ఒక ఓ ! డైరెక్టర్ కి ,.


ఇక ఇప్పుడు విషయంలోకి (నా బొంద విషయం ఏముంది చెప్పడానికి. సినిమా చూసిన వాళ్ళకి టైటిల్ చూడగానే అర్ధం అవుతుంది. సినిమా చూడని వాళ్ళకి ఎటూ నేను స్టొరీ చెప్పబోవడం లేదు కాబట్టి అర్ధం కాదు.)సరే విషయం టూకీగా చెప్తాను అర్ధం చేసుకోగలిగినవాళ్ళు చేసుకోండి. లేదంటే సినిమా చూడండి.

ఓ యాక్సిడెంట్-కొన్ని చావులు-ఒక జాతక ప్రేమకధ- ఒక చావుకై ,తోడుకై వెతుకులాట (కంగారు పడద్దు చావులో తోడు అని కాదు , చావక పోతే,చావు రాకపోతే బతకాడిని తోడు అని అర్ధం) - అదీ స్టోరి .

ఒక వేల మీరీ టపా చదివి సినిమాకెల్తే మాత్రం బయటకు వచ్చాక కూడా మీకు కూడలీ,జల్లెడా నా బ్లాగూ తప్పకుండా గుర్తుంటాయి నాదీ పూచీ.


ఎనీ క్వశ్చన్స్:

-- ఈ టపాకి మీ టైటిల్ కీ సంబంధం లేదు అని నా ఆబిప్రాయం ,దీనికి మీ సమాధానం?

సమా: సర్లే పెద్ద చెప్పొచ్చావు కాదు కాదు అడగొచ్చావు తెలుగు సినిమా టైటిల్స్ కి , సినిమాలకీ ఉంటున్న సంబంధం కంటే ఎక్కువే వుంది .అయినా అడిగావు కాబట్టి నీకింకో విషయం చెప్తా. సినిమా చూసి బయటకు రాగానే సినిమా పోస్టర్ చూసి నేను అన్న మొదటి మాట ఇదే . అందుకే ఇదే టైటిల్ అంతే.

Tuesday, April 21, 2009

రెండున్నరేళ్ళుగా అందని ద్రాక్షగా మిగిలిన ఆ స్వామి దర్శనం.

శ్రీ రామదూతం శిరసా నమామి
నేనుండేది లింగంపల్లిలో, ఉద్యోగం ఐఐఐటి దగ్గర. ఆటో లో పావుగంట ప్రయాణం. ఎప్పుడైనా స్నేహితులుంటే బైక్ మీద వెళ్ళేవాడిని. గుల్ మొహర్ పార్క్ దాటిన తర్వాత అలిండ్ కి ముందు ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది. కొంచెం ఎత్తులో ఉండేదేమో దారిన పోతుంటే మూల విరాట్టు స్పష్టంగా కనపడేది. 2006 ఆగస్ట్ నుండి ఆ గుడి కి వెళ్దామని ఉండేది. కాని ఎపుడూ కుదరలేదు. మధ్యలో ఆటొ దిగి మల్లీ ఇంకొక ఆటో పట్టుకొని రావాలి. దానికి తోడు షూ విప్పాలి. ఇవన్నీ పెద్ద ప్రతిబందకాలు గా అనిపించేవి. దాంతో మనసులోనే "అతులిత బలదామం "అనుకుంటూ ఉండేవాడిని. దానికి తోడు తారక మంత్రం ఉండనే ఉంది "దేవుడు అని మనసులో ఉంటే చాలు చూపించక్కరలేదు అని". అదేంటో నగా నట్రా చూపించాలి కానీ భక్తి మాత్రం ఎవరన్నా ఉంటే బయటికి రాకూడదు ఎందుకో . సీరియస్ గా అనుకునేవాడిని, బండి కొనుక్కున్నాక రోజూ వెళ్ళాలి అని అనుకునేవాడిని. కానీ కొన్నదీ లేదు వెళ్ళిందీ లేదు. కొన్నాళ్ళు మా శశాంక్ తో కలిసి బైక్ మీద ఆఫీస్ కి వచ్చాను కాని ఎప్పుడూ గుడికి వెల్దాం అని అడగలేదు. కొన్నిసార్లు ఇంటి దగ్గర తొందరగా బయలుదేరి గుడి దగ్గర దిగుదాం అనుకున్నా. కానీ అలా అనుకున్న ప్రతిసారి ఇంకా లేటయ్యేది. కొన్నాళ్ళు ఏదేమైనా ఈరోజు మర్చిపోకుండా దిగాలి అనుకునేవాడిని. ఆ రోజు ఆటోలో ఉన్నప్పుడు ఏదైనా ఫోన్ రావడమో లెదా నేనే ఎవరికైనా ఫోన్ చెయ్యాల్సి రావడమో జరిగేది.ఇంకొన్ని సార్లు ఆటోలో నిద్రపోయేవాడిని, లేచి చూస్తే ఏ యూనివర్సిటీ దగ్గరో తేలేవాడిని.
కానీ ఈ రోజు అర్ఢమైంది. స్వామి కావాలనే నన్ను అక్కడికి దూరంగా ఉంచారని. విషయం ఏంటంటే బి.టెక్ లో ఉన్నప్పుడు నేను సుందరకాండ పారాయణ పుస్తకం కొన్నాను కాని ఎప్పుడూ తెరిచిన పాపాన పోలేదు. కాలగమనంలో నాహం కర్తా హరిః కర్తా పుస్తకం చదవడం, వేయిపడగలు చదవడం జరిగింది కానీ సుందరకాండ మాత్రం తెరవలేదు. అలాగే నాతో పాటు ఉద్యోగం కోసం నా వేయి పడగలు, సుందరకాండ , భగవద్గీత హైదరాబాద్ చేరాయి. వేయి పడగలు మళ్ళీ రెండు సార్లు చదివాను కానీ సుందరకాండ మాత్రం చదవలేక పోయాను. ఇలా కాదని ఎం.స్. రామారావు గారి తెలుగు సుందరకాండ ఆడియో సంపాదించాను. కాని అదేంటో నా దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి పాటల్లో ఇప్పటివరకూ ఒక్కసారి కూడా వినకుండా ఉన్నది అదొక్కటే . దానితో ఇక సుందరకాండ గురించి మనకు తెలియడం ఈ జన్మలో జరగదేమో అనుకుంటున్న తరుణంలొ తెలుగు డివోషనల్ స్వరాంజలి బ్లాగు చూసాను . అక్కడ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి "హనుమధ్వైభవం" ప్రవచనం వినడం జరిగింది. ఆ తర్వాత సురస సైట్ గురించి తెలిసింది. అక్కడ ఉషశ్రీ గారి రామాయణం విన్నాను. దాని తర్వాత హనుమజ్జయంతి సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచ్చిన ఒక ప్రవచనం ఇంటర్నెట్లో విన్నాను. ఆ తర్వాత వారిచ్చిన రామాయణాంతర్గత సుందరకాండ ప్రవచనం అంతర్జాలంలో విన్నాను. ఏడు రోజుల ప్రవచనం, రోజుకు రెండు గంటలు చొప్పున . ఇది పూర్తి గా వినడానికి కూడా లెక్కలేనన్ని అవాంతరాలు. ఒక అవాంతరం తర్వాత మళ్ళీ కొత్తగా వినడం మొదలుపెట్టడం , మళ్ళి అనుకోని విధంగా ఇంకొక అవాంతరం రావడం ఇలా ఎంతవరకు వెళ్ళిందంటే కేవలం సముద్ర లంఘనమే ఐదారు సార్లు విన్నాను. తర్వాత అలోచించుకుంటే ఆ భగవతుడే కావాలని, ఆత్మ దర్శనానికి ఎన్ని అవరోధాలుంటాయో చెప్పడానికే అలా చేశారనిపించింది. ఒక పక్క హనుమత్ రక్షా యాగం మర్చి పోయాననే బాధ , ఇంకొక పక్క నాలుగేళ్ళుగా ప్రయత్నిస్తున్నా సుందరకాండ ఎందుకు తెలుసుకోలేక పోతున్నానే సందేహం, ఈసారి ఎలాగైనా విని తీరాలన్న పట్టుదల , పైన ఆ పవనసుతుని కృప చేత నిన్నటికి ఆ ప్రవచనం వినడం పూర్తి చేయ గలిగాను. ఆ ప్రవచనం గురించి చెప్పాలంటే ఇంకొక పది టపాలు రాయాలి అంత అధ్భుతమైన వాగ్ధాటి,ప్రఙ్ఞ,కౌశలం ఉన్న పండితులు కోటేశ్వరరావు గారు. నిన్నటికి ప్రవచనం వినడం పూర్తి అయ్యింది, చూసుకుంటే సోమవారం. నేను మొదలుపెట్టింది ఒక మంగళవారం (చాలా మంగళవారాల క్రితం) అనుకోని విధంగా మంగళవారానికి పూర్తి అవ్వడం వెనుక ఆ స్వామి నాకు ఏమైనా చెప్పదలచుకున్నారా అనిపించింది. సరే మంగళవారం, సుందరకాండ వినడం పూర్తి అయ్యింది కదా ఆంజనేయ స్వామి గుడికి వెళ్దాం అనుకున్న. అనుకోగానే గుల్ మొహర్ పార్క్ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి గుడి గుర్తొచ్చింది. సరే ఎలాగైనా మధ్యలో దిగి గుడి లోకి వెళ్ళాలి అనుకున్నా. అనుకోవడం ఐతే అనుకున్నా కానీ మనసులో భయంగానే ఉంది ఆ స్వామి అనుమతి ఉందో లేదో అని . ఎందుకంటే ఎన్నో సార్లు మనసులో గట్టిగా అనుకుని అక్కడ దిగకుండా వెళ్ళిపోయిన సందర్భాలు ఈ రెండేళ్ళలో చాలా ఉన్నాయి కదా. సరే చూద్దాం ఆ స్వామి ఏం రాసిపెట్టారో అని వేయి పడగల్లో గణాచారి పూర్వీకుడు ప్రాణాలని అప్రమత్తతకి వెలకట్టి జాగరూకతతో ఆవుని వెతకడానికి పోయినట్టు , బయలుదేరాను. ఆటో ఎక్కి బయలుదేరాను నరాలు తెగిపోయేటంత టెన్షన్ గా ఉంది- దిగుతానో దిగనో , మర్చిపోతానేమో , నిద్ర పోతానేమో, ఎవరన్నా ఫోన్ చేస్తారేమో అని . చివరికి ఎలాగో గుడి ముందు "ఇక్కడ ఆపు బాబూ" అనగలిగాను.ఇప్పటికీ నాకు డౌటే నేనన్నానో , ఆ స్వామి అన్నారో. దిగిన తర్వాత చాలాసేపు నన్ను నేనే నమ్మలేకపోయాను. ఆ తర్వాత దర్శనం చేసుకున్నాను. అప్పుదు తెలియలేదు కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం గుర్తు తెచ్చుకుంటే ఆ స్వామి "ఇందుకే నువ్వింతవరకూ ఈ గుడికి రావడం కుదరలేదు" అని చిద్విలాసంతో అన్నట్టనిపిస్తోంది. సుందరకాండ ప్రవచనాన్ని విన్నందుకు ఆ స్వామి నాకు ఇచ్చిన బహుమానం "రెండున్నరేళ్ళుగా అందని ద్రాక్షగా మిగిలిన ఆ స్వామి దర్శనం" .
ఆ స్వామి అనుగ్రహ ప్రసాదాన్ని మీతో పంచుకుందామని చేసిన చిన్న ప్రయత్నం ఇది. మొదలు పెట్టినపుడు ఇంత రాస్తానని కానీ రాయాలని కానీ అనుకోలేదు. కానీ ఆ అంజనీ సుతుడు తోడుండి రాయిస్తుంటే రాయగలిగాను.

Friday, April 17, 2009

ఎవరు వేసారు వోటు ?

ఒక విడత ఓటింగ్ అయిపోయింది. కానీ ఎంతమంది ఓటేసారు?సెలవు లేదో లేదో అని గోలెట్టేసారు. ఇచ్చారు. కానీ ఏం లాభం. చదువుకోని వాళ్ళు చాలావరకు ఓటేసారు. పడని 35% ఓట్లలో 99% చదువుకున్న వాళ్ళవే అని నా నమ్మకం. చదువుకుంటే కాకరకాయ కీకరకాయ అయినట్టు ఉంది.

మొత్తం జనాభాలో 60% కి ఓటుహక్కు ఉందనుకుంటే , అందులో 60% జనాభా ఓటుహక్కును వినియోగించుకుంటే ఎంతమంది ఓటేసినట్టు? (36%) అంటే వందకి 36 మంది మీద ఆధారపడిన ఈ దేశ భవిష్యత్తు ని విమర్శించడానికి మాత్రం అందరూ ముందే. ఎందుకీ దుస్ధితి. దీనికి కారణం ఎవరు? నిరక్షరాస్యులా, నిస్సందేహంగా కాదు. అక్షరాస్యులమని, ఆధునికులమని చెప్పుకునే వాళ్ళే.

Wednesday, April 15, 2009

ఎందుకు లోక్ సత్తా?

Hi,
At least after seeing below comments from all the party leaders, we should decide to VOTE for LOKSATTA.
Not only us, we should also mobilise our friends,relatives or even unknown persons.
Let us decide how we want our state and then country. Let us have good future.
I hope you all agree and farward this mail and also mobile people at home, neighbour hood, friends and relatives .
Let us all unite for Independence form this murky politics and Give correct value to our VOTE.


1.

ప్రజా రాజ్యం పార్టీ ని విమర్శించే నైతిక హక్కు కేవలం ఒక లోక్ సత్తా పార్టీ కి మాత్రమే వుంది - పవన్ కళ్యాణ్, యువ రాజ్యం అధ్యక్షుడు.

నేను పార్టీ నిర్ణయాల మేరకే మాట్లాడాలి, నిజం మాట్లాడే హక్కు నాకు లేదు , ఇనుప చట్రం లో బందీ ని నేను. జయ ప్రకాష్ నారాయణ అలా కాదు, స్వేత్చా జీవి. నిజం నిర్భయంగా గా చెప్పగలడు - కే రోశయ్య, ఆర్ధిక మంత్రివర్యులు,

కాంగ్రెస్ పార్టీనోట్లకు వోట్లు అమ్మే ఈ రోజుల్లో జయ ప్రకాష్ నారాయణ వంటి ఆణిముత్యం కూడా గెలిచే పరిస్తితి లేదు - బండారు దత్తాత్రేయ, మాజీ మంత్రి, బి జే పి

పార్టీలు మెచ్చిన పార్టీ, ప్రత్యర్డులు మెచ్చిన నాయకుడు... కొత్త తరం రాజకీయల్ని ఆహ్వానిద్దాం , లోక్ సత్తా కి వోటు వేద్దాం.

2. గత సంవత్సరం హైదరాబాద్ లో వరదలు వచినప్పుడు ఒక నలభై ఏళ్ళ మహిళ మ్యాన్ హోల్ లో పడి మరణించిన సంఘటన గుర్తు వుందా ?

పంజా గుట్ట ఫ్లై ఓవర్ కూలి నలుగురి నిర్దాక్షిణ్య మృతి గుర్తు వుందా ?

గోకుల్ చాట్ బాంబు పేలుళ్లు ?

సత్యం కంప్యూటర్స్ వుదంతం ?

పాత బస్తి అల్లర్లు ?

మీ ఇంటి ఎదురు రోడ్ మీద గుంటలు ?

50 మంది ఎక్కాల్సిన బస్సు లో 200 మంది అత్యంత ప్రమాదకర ప్రయాణాలు ?

ఏడుగురు పట్టే ఆటో లో 15 మంది వెళ్ళడం ?

పోలీసుల బూతులు ?

మనిషి మరో సృష్టి నిర్మించే దిశ గా ప్రపంచ దేశాలు అడుగు వేస్తుంటే మనం ఎక్కడ వున్నాం ? మార్పు వద్దా ? ఆలోచించండి !!నిస్వార్థ రాజకీయాలకు నాంది పలుకుదాం, లోక్ సత్తా కి వోట్ వేద్దాం. నవ సమాజం నిర్మిద్దాం

3. నాలుగే నాలుగు సులభమైన ప్రశ్నలకు సమాధానం వ్రాయండి, బహులైచ్చిక ప్రశ్నలు :


1) మన బ్రతుకుల్ని మార్చగలిగేది ?

a) బెల్టు షాపులు, ప్రభుత్వ ఆస్తుల్ని తెగనమ్మే నాయకులూ b) సినీ నటుల ఫైట్స్ , డాన్సులు c) కలర్ టీవీలు d) స్పష్టమైన సేవా దృక్పదం, .నిజాయితీ.


2) ఎలాంటి ముఖ్య మంత్రి అయితే బావుంటుంది ?

a) ఫ్యాక్షనిస్ట్ b) తాగుబోతు c) వెన్నుపోటు దారుడు d) IAS,మేధావి.


3) గెలవటానికి మూడు కోట్లు ఖర్చు పెట్టిన నాయకుడు సేవ చేస్తాడా ?

a) చేస్తాడు b) చెప్పలేం c) చెయ్యడు d) చెయ్యడానికి ఏమైనా పిచ్చా ?


4) మీ వోటు విలువ ?

a) 500 Rs b) సారాయి c) బద్ధకం d) మీ భవిషత్తు
ఆలోచించండి. లోక్ సత్తా మార్పూ తెగలదా ? అంత కన్నా మంచి పార్టీ వుందా ?లోక్ సత్తా గెలవదు అని సందేహం వద్దే వద్దు. ఇది నిశబ్ద విప్లవం. ఏ పిలుపు లేకుండా 1500 వందల మంది వచ్చి, పది నిమిషాల్లో 5 లక్షలు విరాలు మరే పార్టీ కైనా ఇస్తారా ?ఆలోచించండి, లోక్ సత్తా కి నిస్సందేహం గా వోటు వెయ్యండి

with due credits to the original author(I received this from my friend ashok)

Monday, April 13, 2009

ఎవరికి మీ వోటు?

ఈ మధ్య కాలంలో లోక్ సత్తా గురించి ఎప్పుడు మాట్లాడినా
నువ్వు నేను తప్ప ఇంకెవరూ లోక్ సత్తా కి ఓటెయ్యరు. మనిద్దరి వల్లే లోక్ సత్తా గెలుస్తుందా అని అడుగుతున్నారు.

కానీ ఒకసారి లోక్ సత్తాని కనీసం ప్రతిపక్షానికైనా పంపగలిగితే మరికొంతమందికి స్ఫూర్తిగా ఉంటుందేమో, లేకపోతే నిజాయితీగా పనిచేద్దాం అనుకున్నవాడు కూడా ప్రజలు సినిమా వాళ్లకైనా వేస్తారు కానీ పని చేసేవాళ్ళకు మాత్రం వెయ్యరు అనుకునే ప్రమాదం ఉంది.ఒక రామా రావు గెలిస్తే ఇంకొక చిరంజీవి పుట్టుకొచ్చాడు, ఇప్పుడు చిరంజీవి గెలిస్తే ఇంకో జూనియర్ ఆర్టిస్ట్(అప్పటికి వాడు సీనియర్ అవుతాడు) మళ్ళీ వస్తానంటాడు. కానీ లోక్ సత్తా గెలిస్తే జయప్రకాష్ లాంటి అభిప్రాయాలు , ఆశయాలు ఉన్న మరి కొద్దిమంది రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే అవకాశం ఉంది.కనీసం అలా మార్చగలం అన్న స్పూర్తి అన్నా కలుగుతుంది.

మళ్ళీ ఒకసారి ఇది కేవలం
మనిద్దరి వల్లే లోక్ సత్తా గెలుస్తుందా అని అడిగేవాళ్ళ కోసం........

Thursday, April 9, 2009

లోక్ సత్తా పై నాకొచ్చిన ఒక చిన్న మెయిల్

తెలుగులోకి అనువదించి మల్ల పోస్ట్ చేస్తా, అంతవరకు bare with this english post
Please take some time to look at Lok Satta.
At some point, we have dreamt of somebody comes and changes our political system, uproot corruption in the society, utilize available resources properly and take the country forward.
We have seen many leaders but all are the branches of the same tree. There are new parties introduced recently but look at the candidates in the party. Most of them are from the other parties and many of them are jumping Jacks. They still are carrying the same attitude and commitment.
Having experienced the difficulties in offices like RTO, MRO, Register Office, Revenue, Gas agencies, Electricity office, Traffic Police, tampering in Petrol bunks, Auto meters etc, I am sure you would have cursed our fate for being led by this kind of leaders.
I am sure that you have envisaged of Some One coming and changing our system/administration/rules/leaders.
Why do our villagers need freebies, Kg Rice @ Rs.2 and free current? Why don’t the Government help them in buying that stuff?
If the Government facilitates education to one member of a family, he/she can take care of his/her family. Instead of concentrating on such long-term developments, our lazy leaders are making people lazy by offering things for free.
All I request you to do is that, Think before whom you vote. He may be of your religion/caste, he may be your favorite hero, or your favorite hero’s brother … just ignore. Choose a person who can take our state/county ahead.
Compare the leaders who have hired helicopters in canvassing with JP who is taking help of our Trains.
Compare qualification and conduct of the nominated candidates of other parties with decent, middle-class and well-qualified one’s of Lok Satta.
Compare the media coverage of party’s movements. 24/7 coverage for silly decisions, stupid statements, rude actions of other parties with a 2X3 inch section published somewhere in the corner of last pages of the News paper.
So, Wakeup! Hurry! If not media, we take the responsibility of spreading his message. Let’s show the power of IT network.
One man has courageously stood up in reframing our Society. As individual, most of us can not even dare to think that. At least, we stand at him. We help him and be a part of this revolution. Let’s keep his hopes live. If we don’t do this, his spirits may plunge which is not a good sign. The Silence of good men is more dangerous than the brutality of Bad men - Martin Luther King
We are aware of the saying “Each vote counts”. When one vote can change the results of a poll, why can’t the same one vote helps Lok Satta win? So, chuck away the thought “How can only my vote helps LS win? Anyhow LS is not going to win”. Who knows!
We don’t need to do rallies, we don’t need to canvass, and we may not need to fund them. Just convince yourself, your friends and your family in voting for Lok Satta and be a part of this moment.
I decided to convince at least 1000 people in supporting Lok Satta. Can you convince at least 10 provided you are convinced?
Please remember to look at JP’s profile on the website. http://www.loksatta.org/
Thanks for your time.

Monday, March 30, 2009

యోనెక్స్ సన్ రైజ్ ఓపెన్-౦౯(09) లో నేను

మొత్తానికి ఒక టోర్నమెంట్ కి వెళ్లాను జీవితంలో. యోనెక్స్ ఓపెన్ గచ్చిబౌలి స్టేడియం లో జరిగింది కదా.
మేము అక్కడ దిగిన కొన్ని ఫోటో లు ,

మిక్స్డ్ డబుల్స్ (ఇండియా ) దిజు తో నేను (జెండాతో ) మా స్నేహితులు మోహన్, శశాంక్
పురుషుల సింగిల్స్ (ఇండియా ) చేతన్ ఆనంద్ తో

సెమీ ఫైనలిస్ట్ చెన్ (చైనా ) తో


Wednesday, March 25, 2009

నువ్వు-నేను

నిర్వచనాలకు అందనంతగా నీవు, నిరుత్తరుడనై నేను!
నిబిడీకృత అంతస్సౌందర్యంతో నీవు, నిబిడాశ్చార్యంతో నేను!!
నిజమైన ఉషోదయం కోసం వేచి చూస్తూ నీవు,నీరవ నిశీధిలో క్షోభిస్తూ నేను!!

ధియరీ ఆఫ్ రిలేటివిటీ నా పార్శ్వంలో,(నా ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్, నా ఊహల్లో ఉండి, నాతో ఊసులు పంచుకునే నా .......
.

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అంతరాత్మ.)

అందరికీ విరోధి నామ సంవత్సర శుభాకాంక్షలు........

Wednesday, March 11, 2009

మా(ఐటి) తరపున హోళీ శుభాకాంక్షలు,

మాకు తెలిసిన రంగులివే,
అందుకే ఈ రంగులు మీ మానిటర్ ని , మీ జీవితాన్ని రంగులమయం చెయ్యాలని కోరుకుంటూ......

మనోహర్.చ

Tuesday, February 17, 2009

నామ రామాయణం


  1. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ్

  2. కాలాత్మక పరమేశ్వర రామ్

  3. శేషతల్ప సుఖ నిద్రిత రామ్

  4. బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ్

  5. చండకిరణకుల మండన రామ్

  6. శ్రీ మద్దశరథ నందన రామ్

  7. కౌసల్యా సుఖవర్ధన రామ్

  8. విశ్వామిత్ర ప్రియ ధన రామ్

  9. ఘోర తాటకా ఘాతక రామ్

  10. మారీచాది నిపాతక రామ్

  11. కౌశిక మఖ సంరక్షక రామ్

  12. శ్రీమదహల్యోద్ధారక రామ్

  13. గౌతమముని సంపూజిత రామ్

  14. సుర మునివర గణ సంస్తుత రామ్

  15. నావిక ధావిత మృదు పద రామ్

  16. మిథిలా పురజన మోహక రామ్

  17. విదేహ మానస రంజక రామ్

  18. త్ర్యమ్చక కార్ముక భంజక రామ్

  19. సీతార్పిత వర మాలిక రామ్

  20. కృత వైవాహిక కౌతుక రామ్

  21. భార్గవ దర్ప వినాశక రామ్

  22. శ్రీమదయోధ్యా పాలక రామ్

  23. అగణిత గుణగణ భాషిత రామ్

  24. అవనీ తనయా కామిత రామ్

  25. రాకా చంద్ర సమానన రామ్

  26. పితృ వాక్యాశ్రిత కానన రామ్

  27. ప్రియ గుహ వినివేదిత పద రామ్

  28. తత్ క్షాలిత నిజ మృదుపద రామ్

  29. భరద్వాజ ముఖానందక రామ్

  30. చిత్ర కూటాద్రి నికేతన రామ్

  31. దశరథ సంతత చింతిత రామ్

  32. కైకేయీ తనయార్థిత రామ్

  33. విరచిత నిజ పితృ కర్మక రామ్

  34. భరతార్పిత నిజ పాదుక రామ్

  35. దండక వనజన పావన రామ్

  36. దుష్ట విరాధ వినాశన రామ్

  37. శరభంగ సుతీక్షార్చిత రామ్

  38. అగస్త్యానుగ్రహ వర్ధిత రామ్

  39. గృధ్రాధిప సంసేవిత రామ్

  40. పంచవటీ తట సుస్థిత రామ్

  41. శూర్పణఖార్తి విధాయక రామ్

  42. ఖర దూషణ ముఖ సూదక రామ్

  43. సీతా ప్రియ హరిణానుగ రామ్

  44. మారీచార్తి కృదాశుగ రామ్

  45. వినష్ట సీతాన్వేషక రామ్

  46. గృధ్రాధిప గతి దాయక రామ్

  47. శబరీ దత్త ఫలాశన రామ్

  48. కబంధ బాహు చ్ఛేదన రామ్

  49. హనుమత్సేవిత నిజపద రామ్

  50. నత సుగ్రీవాభీష్టద రామ్

  51. గర్విత వాలి సంహారక రామ్

  52. వానరదూత ప్రేషక రామ్

  53. హితకర లక్ష్మణ సంయుత రామ్

  54. కపివర సంతత సంస్కృత రామ్

  55. తద్గతి విష్ణు ధ్వంసక రామ్

  56. సీతా ప్రాణాధారక రామ్

  57. దుష్ట దశాశన దూషిత రామ్

  58. శిష్ట హనూమ ద్భూషిత రామ్

  59. సీతా వేధిత కాకావన రామ్

  60. కృత చూడామణి దర్శన రామ్

  61. కపివర వచనాశ్వాసిత రామ్

  62. రావణ నిధన ప్రస్థిత రామ్

  63. వానరసైన్య సమావృత రామ్

  64. శోషిత సరిదీశార్థిత రామ్

  65. విభీషణాభయ దాయక రామ్

  66. పర్వతసేతు నిబంధక రామ్

  67. కుంభకర్ణ శిరచ్ఛేదక రామ్

  68. రాక్షససంఘ విమర్దక రామ్

  69. అహి మహి రావణ చారణ రామ్

  70. సంహృత దశముఖ రావణ రామ్

  71. విధి భవ ముఖ సుర సంస్తుత రామ్

  72. ఖస్థిత దశరథ వీక్షిత రామ్

  73. సీతాదర్శన మోదిత రామ్

  74. అభిషిక్త విభీషణ నత రామ్

  75. పుష్పక యానారోహణ రామ్

  76. భరద్వాజాభినిషేవణ రామ్

  77. భరత ప్రాణ ప్రియకర రామ్

  78. సాకేత పురీ భూషణ రామ్

  79. సకల స్వీయ సమానత రామ్

  80. రత్నలసత్పీఠాస్థిత రామ్

  81. పట్టాభిషేకాలంకృత రామ్

  82. పార్థివకుల సమ్మానిత రామ్

  83. విభీషణార్పిత రంగక రామ్

  84. కీశకులానుగ్రహకర రామ్

  85. సకలజీవ సంరక్షక రామ్

  86. సమస్త లోకాధారక రామ్

  87. అగణిత మునిగణ సంస్తుత రామ్

  88. విశ్రుత దశకంఠోద్భవ రామ్

  89. సీతాలింగన నిర్వృత రామ్

  90. నీతి సురక్షిత జనపద రామ్

  91. విపిన త్యాజిత జనకజ రామ్

  92. కారిత లవణాసురవద రామ్
  93. స్వర్గత శంభుక సంస్తుత రామ్

  94. స్వతనయ కుశలవ నందిత రామ్

  95. అశ్వమేధ క్రతు దీక్షిత రామ్

  96. కాలావేదిత సురపద రామ్

  97. అయోధ్యక జన ముక్తిద రామ్

  98. విధిముఖ విభుధానందక రామ్

  99. తేజోమయ నిజరూపక రామ్

  100. సంసృతి బంధ విమోచక రామ్

  101. ధర్మస్థాపన తత్పర రామ్

  102. భక్తిపరాయణ ముక్తిద రామ్

  103. సర్వచరాచర పాలక రామ్

  104. సర్వభయామయ వారక రామ్

  105. వైకుంఠాలయ సంస్థిత రామ్

  106. నిత్యానంద పదస్థిత రామ్

  107. రామ రామ జయ రాజా రామ్
  108. రామ రామ జయ సీతా రామ్

Monday, February 16, 2009

దశ రూపకం-౧౦ వ(పదవ -ఆఖరు) భాగం

౧౦
మందపిల్లి.
౦౭-౧౨-౩౮.
రసరాట్టుగారూ! నాన్నగారు వచ్చారు.మీరు ఏమీ అనుకోకుండా ఉంటే మీకు ఒక సంగతి రాసేసి ఇక్కడితో ఊరుకోమన్నారు.మీపేర నేను పంపిన రచన ఒక పుష్కరం క్రితం మీరే రచించిందట. అది మీరచనలలో కల్లా గొప్పదనే అప్యాయంకొద్దీ నాన్నగారు స్వహస్తంతో లిఖించి, ఆ కాగితం తనదగ్గిర అట్టేపెట్టుగున్నారట,నేను పంపిన రచన అదే అయి ఉంటుందని చెప్పారు. క్షమించండి.

ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౮ -౧౨ -౩౮
గోపీనాధానికి అనేక ఆశీర్వచనాలు.నేనూ ఊరెళ్ళి ఈ ఉదయమే వచ్చాను.లోగడ నీకు వచ్చిఉన్న జాబులన్నీ, నేను ఊళ్ళో లేకపోబట్టి మా అమ్మాయి రాసింది.జాబుల్లో ఉన్న వృత్తాంతం యావత్తూ,నువ్వు పంపించిన కాగితాల మీద రాసిఉన్నదే. ఆ రచనా, దస్తూరీకూడా మీనాన్నగారివే. అందులో వారు విమర్శనమోనాలురాసి అట్టే పెట్టుగున్నారు, అది పొరపాట్న ఇక్కడికి వచ్చింది. నా రచన అన్నావే! అది కుంభయ్యగారిచేతికి నిరుడు మీ నాన్నే ఇచ్చారు, ఙ్ఞాపకం చేసుగోమను. అయితే నీకు పెండ్లి అయిందా?.......
ఇట్లు,
రసరాట్

మినీ కధ

ఇద్దరు వ్యక్తులు స్మశానంలో మాట్లాడుకుంటున్నారు
మొదటివ్యక్తి: ఇంతకు ఇతను ఏం వదిలిపెట్టి వెళ్ళాడు తన వాళ్ళకి?
రెండవ అతను: "అంతా" .

యండమూరి "వీళ్ళనేం చేద్దాం ?" నుండి

Friday, February 13, 2009

దశ రూపకం- ౯ వ (తొమ్మిదవ) భాగం

మందపిల్లి.
౦౫ -౧౨ -౩౮ .

రసరాట్టు గారూ! క్షమించాలి. మా నాన్న గారు ఉత్తరం రాసారు. రేపో నేడో ఇక్కడికి వచ్చేస్తార్ట. ఒక పని జరిగిందట. నాలుగైదు రచనలు మానాన్నగారు తమ బోంట్లకి విడివిడిగా అభిప్రాయంకోసం పంపించారట.అందులో ఒకటి శ్రీనాధుని రచన కూడా ఉందట. కడం అభిప్రాయాలన్నీ వచ్చేశాయి. ఒక వేళ, దిక్కుమాలి ప్రాలుద్ధం,మీకు నే పంపింది అదే కావచ్చు!
ఇట్లు,
గోపి.


జవాబు
పేరారం,
౦౬ -౧౨ -౩౮
గోపీ! అదా కమామిషూ! హోరీ! చెప్పవేం మరీ! అందుకనే, కిందన మాటు నేనెంత ఏకుతూ రాసినట్టు ఉన్నా,అప్పుడు కూడా ఈ రచనలోని ఆ రసస్ఫూర్తీ, ఆ పద సౌష్ఠవమూ, ఆ భావ విశేషమూ, ఆ గుఱ్ఱపునడకా, ఆ భాషామేళవం, ఆ వగైరాలూ - అవన్నీ తొంగిచూస్తూనే ఉన్నాయి. పెద్దవాళ్ళ రచనలు అనేకం ఇతరుల చేతుల్లో పడి పాడైపోయాయి.
ఇట్లు,
రసరాట్

Thursday, February 12, 2009

దశ రూపకం - ౮(ఎనిమిదో) వ భాగం

మందపిల్లి.
03-12-38.
రసరాట్టుగారూ! శాస్త్రం చెప్పిన తరవాయిగా వచ్చింది. ఎప్పటికప్పుడు మీతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడం కట్టేద్దాం అనుకుంటూండడం,ఏదో పిల్లసమ్మేరీ వస్తూండడం జరుగుతోంది.మీరేమన్నా అనుకుంటారేమో అని ఇదవుతున్నాను కుడానూ! ఈవేళ మరో ఆయన వచ్చాడు. ఇతగాడిపేరు కేతయ్యట. ఆయనకూడా మా నాన్న గారి చేతికి అభిప్రాయం నిమిత్తం తన రచన ఇచ్చాట్ట. మా నాన్న ఊళ్ళో లేరని చెప్పేసి మెల్లిగా ఆయన్ని వొదిలించుగున్నాను. ఘంటారావురచనమీద అభిప్రాయం నిన్న మరొకరి దగ్గర్నించి నాకు వచ్చేసింది.మీదగ్గిరున్న రచన కేతయ్యదే. ఏదో ప్రసంగం వచ్చి , మీకూ తనకీ పచ్చగడ్డేస్తే భగ్గుమంటుందని కేతయ్య అన్నాడు.
ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౪-౧౨-౩౮

గోపీ! ఈ సంగతి రాశావు నయమే. ఇంకాదాచుగుని ఊరుకున్నావుకావు,చచ్చిపోదుం. నాకూ అనిపించింది,'ఏమిరా! కొన్ని లక్షణాలు ప్రశంసార్హంగా కనిపిస్తూఉన్నా, ఈ రచన మొత్తంమీద ఏడిసినట్టుందేమిటీ అని. అల్లా అనిపించడానికి కారణం ఇప్పుడు భోదపడ్డది.
ఇంత దరిద్రగొట్టురచన భూమిమీదగాని,అంగారకుడులో గాని లేదు. బుద్ధిగల వాడెవడూ ఇది చివరంటా చదవడు. అందుకనే నే చదవలేదు. ఇందులో, గాఢంగా చూస్తే, అర్ధం వ్యర్ధం,భావం అభావం,రసం నీరసం,శైలిగాలి,భాషఘోష ,రీతి కోతి, వృత్తి మిత్తి,శయ్య కొయ్య,ధార నార. కొన్ని పట్ల కవి ఏడవబోయాడు. ఆ ఏడుపు ఉచితరీతిగా-అనగా ఏడుపు ఏ రీతిగా ఊండాలో అల్లా లేదు. నన్నడిగితే నేనేనా చెబుదును. చాలా బేస్ధలాల్లో కూడా నవ్వు తెప్పించడానికి ప్రయత్నించి రచయిత చచ్చి చెడ్డాడు.నేనెంత బిగపట్టుగుని కూర్చున్నా ప్రాణంమీది కొచ్చింది గాని నవ్వు రాలేదు. సహజమైన మాటపొందికా సమయస్ఫూర్తీ ఇందులోమృగ్యం. రచననీ , రచయితనీ వేరువేరుగా పుఠాలేసినా ఈ రచన ఇంతే. నుడికారం సుడిలో పడింది, కారకం మారకం చెందింది. నాబోటి గొప్పవాళ్ళనీ కొన్ని గొప్పసంస్ధల్నీ నిరసించడం తప్ప ఇతరం ఏమీ ఇందులో లేదు. ఈ రచనలో కొంత-చిరవదాకా అసలే చదవలేకపోయాను!-చదివి నేను చాలా పాడైపోయాను. నే కాక తక్కినవాళ్లు చదివితే ఎక్కడ చెడిపోతారో అని బెంగతో తీసుగుంటున్నాను. ఇది ఎవరేనా చదివితే పెద్ధ ఒట్టు; జాగ్రత్త!

ఇట్లు,
రసరాట్

Wednesday, February 11, 2009

అహం బ్రహ్మాస్మి(నువ్వు దేవుడిని నమ్మితే దెయ్యమూ ఉంటుంది).

చూడగానే ఏ సినిమా గురించో అర్ధం అయ్యే ఉంటుంది.
ఏంటి అయ్యేది రెండూ వేరే వేరే సినిమాలకు సంబందించినవి అంటారా ఐతే మీరు గ్రేట్. నిజమే "అరుంధతి" ,"నేను దేవుడిని " ఈ రెండు సినిమాల గురించే రాద్దాం అనుకున్నాను.
జనరల్ గా నేను సమీక్షలు చదవను(అప్పుడప్పుడూ తప్ప). ఇక మా శశి ప్రతి సినిమా కి రివ్యూ చదువుతాడు . అలాగని రివ్యూలని అధారం చేసుకుని సినిమాలు చూస్తాడనుకుంటే పప్పులో కాలేసినట్టే.తను అధమం విడుదలైన ప్రతి సినిమా చూస్తాడు. అలాంటిది "నేను దేవుడిని" చూసావా అని అడిగితే సౌండ్ లేదు, ఏమంటే సినిమా చూడలేమంట, రివ్యూ రాసినతనే వాంతి చేసుకున్నాడట, నేను చూడను అన్నాడు. నిజంగానే చూడలేదు కుడా. మా వాడు చూడను అన్నాడంటే ఏదో పెద్ద కధే ఉండి ఉంటుంది అని నేను పోయిన శుక్రవారం తిన్నగా శశికళ దియేటర్ కి వెళ్ళి సెకండ్ షో చూసి వచ్చాను.
ఆ తర్వాతి ఆదివారం అంటే నిన్న అనుకోకుండా అరుంధతి కి వెళ్ళాడం జరిగింది. ఇక అప్పుడు మొదలైంది నా ఆత్మ సంఘర్షణ. అదేంటి అరుంధతి ఆహా,ఒహో అన్నారే! బ్లాగ్లోకంలో ఒక్కరు తప్ప అంతా ఆ సినిమా ని నెత్తికేంటి,బ్లాగుల కెత్తుకున్నారే! అలాంటిది నాకేంటి ఈ సినిమా పరమ దరిద్రంగా కనిపిస్తుంది. అలాగే నేను దేవుడిని బాలేదన్నారే , కానీ ఇదేమో నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకా అని ఆలోచించగా కొన్న్ని విషయలు కనిపించాయి.
1)బహుశా బాల సినిమాలో అఘోరాలంటే దైవ ప్రతిరూపాలుగా,దేహానికి ప్రాణానికి మధ్య గిజగిజలాడే ఆత్మకి మోక్షాన్ని ప్రసాదించే వాళ్ళుగా చూసి అరుంధతి లో వాళ్ళని క్షుద్రోపాసకులుగా, నీచమైన చేతబడులు, బాణామతులు చేసేవాళ్ళుగానూ చూపించడం వల్లనేమో అనిపించింది. కానీ అలోచించగా ఇంకా చాలా క(అ)నిపించాయి. నేను ఎక్కడో ఒక పుస్తకంలో అఘోరాలను గురించి చదివాను(బహుశా యండమూరి అనుకుంటా).దానిలో వాళ్ళు కాల స్వరూపులని,దేనికి కట్టుబడని వాళ్ళని రచయిత చెప్తే కామోసనుకున్నాను.
2)అరుంధతి సినిమా అంతా రక్తం,విపరీతమైన రక్తం. అదేంటో అంత రక్తం చూసినా జుగుస్స కలుగలేదు కానీ వాస్తవ జీవితాన్ని చూస్తే (చూపిస్తే) మాత్రం జుగుస్సాకరంగా ఉందనడం హాస్యాస్పదమనిపించింది(ఈమాట రాసేటప్పుడు నా మిత్రుడన్నమాట: "బట్టలు విప్పి రికార్డింగ్ దాన్స్ చేస్తే చూడగలం కానీ, బట్టలు లేని వాళ్ళు రోడ్డు పక్కన పడి ఉంటే చూడలేం కదరా ఇదీ అంతే").
మొదటినుండీ మనకు ఒక అలవాటు ఉంది అదుగో పులి అంటే ఇదిగో తోక అనే అలవాటు.చూడబోతే ఈ సినిమా విషయంలో కూడా అదే జరిగిందేమో అనిపిస్తోంది.ఒకడు ఈ సినిమా చూస్తే కళ్ళు తిరిగుతాయి అంటే ఇదో నాకు తిరుగుతున్నాయి అని పదిమంది అంటే వందమందికి అలా అనిపించడంలో అసందర్భమేముంది?
అయినా బాలకి బుద్దుండాలి ప్రజలు తాము కుందేళ్ళకోసం కొండలెక్కలేకా,పారాషూట్ లేసుకుని పాకిస్తాన్ కి వెళ్ళలేకా సినిమాలకి వస్తారు తప్ప గుడ్డివాళ్ళని,కుంటివాళ్ళని మూగవాళ్ళని చూడడానికి కాదనీ,

Friday, February 6, 2009

వేయి పడగల నీడలో నేను-2(గిరిక)

"ఒక పుస్తకంపై సమీక్ష రాయడానికి కావలసిన అర్హత ఏంటి? " ఈ ప్రశ్న ఏప్పటినుండో నా మనసుని తొలచేస్తుంది.నా వరకైతే ఆ పుస్తకాన్ని ఆమూలాగ్రంగా చదవడమే ఆ అర్హత . అలా అయితే వేయి పడగలు మీద నేను సమీక్ష రాయవచ్చు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చిన పుస్తకం అది.
వేయి పడగలు నన్ను రెండు విధాలుగా మార్చింది.ఒకటి-ఆధ్యాత్మికంగా,రెండు -వ్యక్తిగా .
వ్యక్తిగతమైన అభివృద్ధిని ఇంకొక టపాలో వివరిస్తాను.
మొదట ఆధ్యాత్మికంగా -
దైవానికి నాకు దూరం పెరుగుతోంది అని మొట్టమొదటి సారి బి.టెక్ లో ఉన్నప్పుడు అనిపించింది.ఎందుకు,ఎవరి వల్ల అని చాలా ఆలోచించాను.నా వల్లైతే కాదు అని ఒక సారి, ఏం జరిగినా నా వల్లే జరిగి ఉంటుంది అని ఒక్కొక్కసారి అనిపించేది. ఆ సమయంలోనే వేయి పడగలు చదివాను.
మహాతల్లి గిరిక నా మనసును కదిలించింది.నాకు మళ్ళీ మార్గనిర్దేశం చేసింది.అప్పుడే మహాతల్లి గిరికతో పాటు ధర్మరావు గారిని నేను కూడా గురువుగా మనసా స్ధాపించుకొన్నాను.నేను కూడా కళ్యాణోత్సవాలకోసం వేయి కన్నులతో ఎదురుచూశాను.వేయిపడగలు పుస్తకం అంతా ఒక ఎత్తు వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవాలు ఒక ఎత్తు.సుబ్బన్నపేటలో నాగేశ్వర స్వామిని మొదటసారి చూసినప్పుడు అరుంధతికి కలిగిన అనుభూతి లాంటిది కలిగింది ఆ కళ్యాణోత్సవాలు చదువుతుంటే. ఎన్ని సార్లు చదివినా జరిగిన పెళ్ళిని మళ్ళీ వీడియో లో చూస్తున్న అనుభూతే కలిగేది.పదకొండు రోజుల కళ్యాణోత్సవాలు, దశావతారాలు . ఉత్సవాలు పూర్తయ్యేసరికి స్వామి అన్ని అవతరాలను నా కళ్ళ ముందే ధరించినట్లనిపించింది. మనకు ఒక కల్పం బ్రహ్మ కు ఒక రోజు ఎలా అవుతుందో అనుభవపూర్వకంగా తెలిసింది. ఎందుకంటే సుబ్బన్నపేటలో పదకొండు రోజులు అనంతపురంలో మూడు రోజులే అయ్యాయి కదా.

గిరికాదేవి మత్స్యరూపిణి అయినపుడు ఆమెతో కలిసి స్వామి కోసం సాగరగర్భాన్ని శోధించాను. గిరికా దేవి కూర్మరూపిణి అయినపుడు స్వామి ఎక్కడ మంధర పర్వతాన్ని మోయలేక కందిపోతాడో అని ఆమెతో పాటు నేను తల్లడిల్లాను. ఇలా ప్రతి అవతారంలోనూ గిరిక తోపాటు నేను ఆ స్వామికోసం ఎదురుచూసాను.
కళ్యాణోత్సవాల ముగింపురోజున స్వామి గిరికతోపాటే నన్ను అనుగ్రహించాడు.నా చర్మచక్షువులకి ఙ్ఞాన దృష్ఠిని ప్రసాదించాడా అనిపించింది.

నేను నీకెప్పుడూ దూరంగా వెళ్ళలేదు, "యతోభావ: తతో దృష్టి:" -అన్న స్పష్టమైన సందేశం క(వి)నిపించింది.


అనుభవైక వైద్యమైన ఈ అనుభవాన్ని అక్షరరూపంలో పెట్టాలని నేను ఎంత ప్రయత్నించినా చేయలేకపోయాను.నాచేతనైనంత ప్రయత్నించాను ఏమైనా ఉంటే విఙ్ఞులు సరిదిద్దగలరు.

Thursday, February 5, 2009

దశ రూపకం -౭ వ భాగం


మందపిల్లి.
౦౧ -౧౨ -౩౮.

రసరాట్టుగారూ!
మీ పేర వ్రాయడం ఏ ముహూర్తాన్ని ప్రారంభించానో గాని సంగతి తెమిలేటట్టు కనపడదు. మరో చిక్కొచ్చింది. పొద్దున్న ఒకాయన నే ఉండగానే మా ఇంటికొచ్చారు. ఆయన పేరు ఘంటారవుట. ఆయనట తన రచన మా నాన్నగారికిచ్చింది. మీకు నేను పంపిన రచన తనదేనని ఆయన పట్టు పడుతున్నాడు. వెనక మీ ఎన్నికల్లో మీ తరఫున పని చేసింది ఈయనేట.
ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౦౨ -౧౨ -౩౮
అబ్బాయి, గోపీనాధం! అల్లా చెప్పు మరీ! అందుకనే తీవ్రంగా చూసిన మీదట ఈ రచన కడుంగడు ప్రౌఢంగా ఉంది. కొన్ని స్ఖాలిత్యాలున్నాయి. ఉంటే ఏం అన్నాను! కొన్ని స్ఖాలిత్యాలు ఉండాలి అని కూడా నేను వాదిస్తాను. లేకపోతే రచన మానుషమే అనిపించుకోదు.ఇది యధార్ధభావాలతోనూ, ఉన్నతాదర్శాలతోనూ నిండి ఉంది. రసం ఇందులో కేవలం ఆవకాయి ఊటలాగ ఊరిపోవడమే కాకుండా సముద్రపు పోటులాగ ఉబ్బి మీద పడిపోతోంది.భాష అతిమధురం.శైలి మనోహరం,వట్టివేళ్ల యొక్క చల్లదనం, వనసంతర్పణపోపుయొక్క ఘుమఘుమా, చలిమిడి యొక్క పాకం ఏకకాలంలో ఇక్కడ దొరుకుతాయి.వేయేల? ఈ రచనలోని మాటలు అన్న జిహ్వే జిహ్వ, విన్నచెవే చెవి,తస్కరించిన కవే కవి.
ఇట్లు,
రసరాట్.

దశ రూపకం - ౬వ భాగం


మందపిల్లి.
౨౯ -౧౧ -౩౮ .
రసరాట్టు గారూ! ఇంతటితో ఊరుకుందాం అంటే వీల్లేని పరిస్థితి ఏర్పడ్డది. నిన్న మా ఇంటికి నే లేనప్పుడు ఒకాయన మా నాన్నగారికోసం వచ్చారని మా అమ్మ చెప్పింది. ఆయన తాలూకు ఒక రచన మీద అభిప్రాయం తెప్పించి ఇస్తానని మా నాన్నగారు వారికి వాగ్దానం చేసి రచన పుచ్చుకున్నార్ట . ఆయన పేరు తెలియదు. చూపులకి కొత్త బియ్యేలా ఉన్నడని మా అమ్మ్మ చెప్పింది. మీకు నేను పంపింది ఆయన రచనేమో!
ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౩౦ -౧౧ -౩౮
గోపీ! అసలు నేను మొదట్లోనే అల్లా అనుకున్నాను. ఈ కవి ఇంగ్లీషు చదివినవాడు. ఇంగ్లీషులో తను చదువుకున్నదంతా మక్కికిమక్కి ఇందులో పొట్టిగ్రాఫు దింపేశాడు. ఈ సరుకు ఎక్కణ్ణించీ దిగుమతీ చేస్తున్నాడో చెప్పడు. ఆ సంగతి తెలుగు ఘటాలు ఎక్కడ కనిపెట్టొచ్చారని ఇతని ఊహ. రచనంతా ఇంగ్లీషు కంపే. ఉద్బోధన గాని ఇత్తేజన గాని ఇందులో లేవనడం సాహసం. భాష మాత్రం ఆంగ్లాంధ్రద్రావిడవంగ ధప్పళం.
ఇట్లు,
రసరాట్

Friday, January 23, 2009

దశ రూపకం-ఐదవ భాగం


మందపిల్లి.
౨౭ -౧౧ -౩౮ .
అయ్యా! రసరాట్టు గారూ! తమ జాబు అందింది. మా నాన్నగారు కవిత్వం రచించగలరని మాకు తెలియదు. ఈ రచన ఆయనది కాదేమో! అయినా నమస్కారం.
ఇట్లు,
గోపి.

జవాబు
పేరారం,
౨౮-౧౧-౩౮
గోపీ! ఇహనేమ్మరీ! నేను అప్పుడే అనుకున్నాను. అందుకనే ఈ రచన రమ్యంగానూ గంభీరంగానూ మాత్రం ఉంది.శైలి మృదుమధురంగానూ, ప్రాయశః భయజనకంగానూ, సర్వత్రా నాతి కఠినపదభూయిష్ఠంగానూ ఉంది. కవి ఇటువంటి రచనలు ఇంకా మేట్లకొలది రాసి, బతికుండగానే అచ్చు కొట్టి, చచ్చో చెడో అందరికీ ఉచితరీతిని వాటిని అందజేసి ధన్యుడై తరించును గాక.
ఇట్లు,
రసరాట్

రిపబ్లిక్ డే శుబాకాంక్షలు


Thursday, January 22, 2009

దశ రూపకం -నాల్గవ బాగం

మందపిల్లి.
25-11-38.
ఆర్యా! మా నాన్న గారు గ్రామాంతరం వెళ్ళేటప్పుడు ఈ రచన మీద అభిప్రాయంకోసం ఇది మీ పేర పంపించమని నాతో చెప్పారు. అన్నట్టు, మీరు వారికి బాకీ ఉన్న లెఖ్ఖ గురించి వ్రాయమనికూడా అని వెళ్ళారు.

ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౨౬-౧౧-౩౮
గోపీ! అల్లా చెప్పుమరీ! అందుకనే ఈ రచన మిక్కిలి ఉత్కృష్టం. కవి కేవల ఛాందసుడు కాడు. ఒకటోరకమైన చాదస్తంలా పైకి కనిపించేది యావత్తూ ఫక్తు చేవ,గుంజు. ఇందులో అపార పాండిత్యం గంగాతరంగాలవంటి నిమ్నోన్నత భావాలలో చదువర్ని ముంచి లేవనెత్తుతుంది. పాండిత్యం ఇంత సద్వినియోగం చేసినవాళ్ళు లేరు.ప్రాచీన సంప్రదాయం ఇక్కడే నిల్చింది. మారుమూల పదాలకి ఈ రచన కాణాచి, అపురూప కారకాలకి ఈ రచన దిక్కు, పురాణేతిహాసాలకి ఈ రచన ధర్మ సత్రం. నేలబారు రోకలిబండ్లు ఎగర్లేని మహోన్నత కవితాగిరిశిఖరాలలోనే ఈ కవివాణి విహరిస్తుంది. గ్రహించే బుర్రలుండాలిగానీ, నవీన విజ్ఞానం అనబడేది కూడా చణక శాస్త్రిగారి ఈ క్రొత్త రచనలో ఉంది. నాదీ పూచీ!
ఇట్లు,
రసరాట్

Tuesday, January 13, 2009

సంక్రాంతి

ఈ భోగి మంటలు మన జీవితాలలో చీకట్లను ప్రారదోలాలని,
ఈ సంక్రాంతి మన జీవితాలను శుభమయం చెయ్యాలని,
మనస్పూర్తిగా కోరుకుంటూ...
భోగి ,మకర సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.

Monday, January 12, 2009

దశరూపకం-మూడవ బాగం.

మందపిల్లి,
౨౩-౧౧-౩౮
రసరాట్టు గారికి వందనాలు, తమ జాబు అందింది. ఆ రచన నాది కాదు. సలాం.
ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౨౪-౧౧-౩౮
గోపీ! నువ్వింకా ఏముటో అనుకున్నాను. తగ్గవాడివే.మొత్తం మీద చణక శాస్త్రుల్లుగారి అబ్బాయి ననిపిస్తున్నావ్. ఆ రచన చెయ్యడంపాటి తెలివితేటలు నీ దగ్గిర లేకపోతే పోనీ అది ఎవరు రాశారో ఆ సంగతేనా నాకు రాయవలిసి ఉంటుందనేనా నీకు ఇంగితజ్ఞానం ఉండకూడదూ ! ఇదుగో:
ఈ రచన మంచిది. భాష చక్కనిది. వస్తువు అందమైనది. రీతి కులాసాగా ఉంది. వృత్తి గౌరవము కలది. ఈ కవికి హిందూస్తానీ కూడా తెలుసు. వెల స్వల్పం. ఫలమధికం,చక్కని సైజు.
ఇట్లు,
రసరాట్.

దశరూపకం-రెండవ బాగం.

మందపిల్లి.
౨౧-౧౧-౩౮
రసరాట్టు గారికి సమస్కౄతులు-------
ఆర్యా! తమ జాబు చేరింది. క్షమించవలె. మొన్న నేను తమకు రాసిన ఉత్తరం పొరపాటు. తమకు ఆ రచన పంపినట్టు జ్ఞాపకముండి అట్లా రాసాను. ఈవేళ తీరా చాకలి తెచ్చిన కోటు తొడుక్కోగా, నా కోటు జేబులోనే ఆ రచన కూడా ఇస్త్రీ అయి ఉండిపోయింది. ఇప్పుడే వేరొక కవర్లో పెట్టి ఆ రచన మీకు పంపాను. ఆ కాగితాలు విప్పేటప్పుడు జాగ్రత్త. నామీద దయ ఉంచి మంచి అభిప్రాయం పంపండి .
ఇట్లు,
గోపి.
జవాబు
పేరారం,
౨౨-౧౧-౩౮
గోపీ! మరొకరికి పంపవలసిన ఉత్తరం నీకు వేసాను. నువ్వు కొంచెం అసాధ్యపు పిల్లకాయలా ఉన్నావు. నువ్వు కవిత్వం గూడా రాస్తావని లోగడ నేనెరగను. ఇదిగో:
ఈ కవి సుప్రసిద్ధ పండితపుత్రుడు. ఇతివృత్తం ఒక మహా పురాణంలో అసలైన పట్టు. కాని, ఈ రచనలో అనుభవం తక్కువ. ఆవేశానికి తుల్యమైన ఆరిందా లేకపోవడం సహజం గనక, లేదు. ఉంటే అడిగారూ! ఉన్న తప్పులు కుర్ర తప్పులు గనక క్షమించవచ్చు. ఈ కవికి భవిష్యంలో మంచి విలవ వస్తుంది. ఇప్పుడైనా, రచన నవనవోన్మేహం, మహామెత్తని శయ్య, పరిశుభ్రమైన ధార. పాండిత్యంలో కనబడే లోటు కూడా కాలక్రమాన్ని, అన్నీ సర్దుకున్నట్టే, సర్దుకుంటుంది. మాంచి అక్కరకొచ్చే చెయ్యి, సవ్య సాచి. భరతమాతకి ఇల్లాంటి సంతానం అవసరం.
ఇట్లు,
రసరాట్.

Friday, January 9, 2009

దశరూపకం - భమిడిపాటి కామేశ్వరరావు

భమిడిపాటి కామేశ్వరరావు గారి మనతెలుగు లోని ఒక చిత్రమైన కధ ఇది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో ఉన్న ఈ కధ ఒక వ్యక్తి మనిషిని బట్టి , స్ధాయిని బట్టి ఎలా ప్రవర్తిస్తాడో చెప్తుంది. మూల ప్రతి పిడిఎఫ్ సరిగా లేనందున పది ఎపిసోడ్లు గా దీన్ని బ్లాగ్ లో రాస్తున్నాను.
మొదటి భాగం
మందపిల్లి
౧౯-౧౧-౩౮
రస రాట్టు గారికి నమస్కారములు -------
మహాశయా! నాన్నగారు మా తోటారం భూముల మీదికి శిస్తు వాసులు వగైరాలకి వెళ్ళారు. పది రోజుల క్రితం తమ పేరట ఒక వచనరచన పంపి ఉన్నాను. మరి ఆలస్యం కానియక దానిమీద తమ సదభిప్రాయం పంపండి. తిరుగు టపాలో పంపాలి.
ఇట్లు,
గోపీనాధం.
జవాబు
పేరారం
౨౦-౧౧-౩౮
గోపినాధానికి ఆశీర్వచనాలు -----
అబ్బాయీఏదో ఆలస్యం అయ్యింది. ఏమీ అనుకోకు. నాకు మీ నాన్న గారొకటీ నువ్వొకటీ కాదు. ఇదుగో:
ఈ గ్రంథం ఆంధ్రానికి ఒక ఆస్తి. అక్కడక్కడ దీంట్లో మామూలు దోషాలు లేకపోలేదు కాని, కొన్నిపట్ల ఇది ఎంతో హృద్యంగా ఉంది. ఇటీవలి దిన్నీమాండలికమున్నూ అయిన పోతభాష వాడితే నేంపోయె , చేతభాష కుడా పాళం గానే పడింది. అతి తెలివి సంకర సమాసాలు బలే విరివిగానూ, మహా జోరుగాను, లేవని చెప్పలేం కాని, జటిలత్వం నిండుకుంది అనడానికీ వీలు లేదు. పాండిత్యంలో లోటుకీ కదలోని నీటుకీ ఉర్జీ సరిపోయింది. ఇది ఉత్తమోత్తమం అని వ్రాయజాలం కాని , దీన్నినీచ కావ్యం అని కొట్టిపారెయ్యడానికీ మనస్కరించకుండా ఉంది. మొదలు ఎట్లా ఉందో చివరంటా అంతే.
ఇట్లు
రసరాట్.
(ఇంకా ఉంది)

Wednesday, January 7, 2009

దేవుడా ఓ మంచి దేవుడా

దేవుడా ఓ మంచి దేవుడా
కాస్ట్ కటింగ్ పేరు చెప్పి
కుబేరుడి లాంటి ఐటిని కుచేలుడులాగా చేశావు
కిన్లే వాటర్ని కాస్తా కుండ నీళ్ళుగా మార్చావు
తాగడానికి డ్రింతులు తినడానికి బర్గరు లేకుండా చేశావు
సుఖమైన క్యాబ్ ప్రయాణాన్ని నిలిపివేయించావు
వీకెండ్స్ పార్టీలు లేవు, డిస్కోథెక్ లు లేవు
హౌస్ లోన్లు లేవు-పర్సనల్ లోన్లు లేవు
ఎప్పుడూ వెంటపడే బ్యాంక్ వాళ్ళు ఎటెళ్ళిపోయారో తెలియదు
ఎప్పుడు ఏం తీసేస్తారో తెలీదు
ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలీదు
ప్రశాంతమైన జీవితాన్ని ఒక ప్రశ్నలాగా మార్చావు
చివరికి ఐటి వాళ్ళకి పిల్లని ఇవ్వాలన్నా భయపడేలా చేశావు
ఈ కొత్త సంవత్సరంలోనైనా
ఉన్న పళ్ళు ఊడిపోయేలా కాకుండా
ఉన్న ఉద్యోగం నిలబడేలాగా- ఇస్తున్న జీతం ిచ్చేలాగా
మాకు కూడా పెళ్ళి అయ్యేలాగా చూస్తావని
కాస్ట్ కటింగ్ అనేది ఐటి వాళ్ళ జీవితంలో మరియు జీతంలో లేకుండా చేస్తవని ఆశిస్తున్నాను
నాకు తెలుసు నువ్వు చేస్తావని
ఎందుకంటే బేసికల్ గా యువార్ యె గాడ్, గుడ్ గాడ్

ఐటి వాళ్ళ తరపున నీకు ౨౦౦౯ నూతన సంవత్సర శుభాకాంక్షలు...

ఇది నాకు వచ్చిన ఒక మెయిల్ నుండి, ఎవరైనా ముందే రాసుంటే క్షంతవ్యుడిని