Saturday, June 26, 2010

వేయి పడగల నీడలో నేను - ౩

జై శ్రీ రామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!
చాలారోజుల తర్వాత వేయి పడగల జ్ఞాపకాల దొంతరను కౌటిల్య గారు కదిలించారు. సరే వేయి పడగలతో నా అనుబంధాన్ని గుర్తు చేసుకుందామని ఈ పోస్ట్ రాస్తున్నాను.

అసలు గ్రాంధికం మనం చదవగలమా లేదా అని ఉన్నరోజుల్లో ఈ పుస్తకం చదవడం జరిగింది. మొదట భావం కోసం చదివాను.రెండోసారి భాష కోసం చదివాను. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణంతో చదివాను. అన్నింటికన్నా నాకు చాలానచ్చినవి కళ్యాణోత్సవాలే. అందులో గోపికయై తల్లి గిరిక వెతుకుతూ చెట్టునూ పుట్టనూ అడగడం , ఆ పద్యాలు నాకెంతో ఇష్టం అప్పట్లో. అందులో ఒకగద్యం ఉండేది. అన్ని పూల చెట్లు,పళ్ళ చెట్ల పేర్లు ఉండేవి. అలాగే "పున్నాగ కానవే, పున్నాగవందితు! తిలకంబ కానవే తిలకనిటులు" అనేపద్యం చాలా బాగుండేది. భాగవతంలోనివని అప్పుడు తెలియదు కానీ ఏదో సంబరంగా ఉండేది ఆ పదాలూ అవీ చదువుతూ ఉంటే. "..సఖీజన వంచితమహం..." అనే అష్టపది కూడా ఉండేది. ఇక అసలు పద్యం "నల్లని వాడు పద్మ నయనమ్ములవాడు" అప్పటికి పాత సాహిత్యంలో పేర్లే గాని విషయం తెలియదాయె. ఆయనేమో ఎప్పుడు చెప్పినా మొదటి పాదం చెప్పి ఊరుకునేవాడు. ఇక చూస్కోండి. ఎవరినైనా అడుగుదామంటే నా సర్కిల్ లో ఎవరికీ తెలియదాయె. అలా రెండుసంవత్సరాలు గడిపేసాక బ్లాగుల పుణ్యమా అని తెలుసుకున్నాను. అసలు ఆ పదబంధాలే వింతగా ఉండేవి. అలాగే "శాస్త్ర ద్రష్టయే గాని శాస్త్ర స్రష్ట గాడు" లాంటి వాక్యాలు కొత్తగా ఉండేవి.
మూడు వందలు యేళ్ళు వేయి పడగలకింద సురక్షితం గా భూమ్యాకాశాలకూ,మంచీ చెడులకూ , మర్త్యామర్త్యాలకూ మధ్య స్థిరంగా నిలిచిన నాలుగు స్థంబాల మంటపం ,చివరికి రెండు పడగల కింద,రెండు స్థంబాలమీద నిల్చున్న స్థితికి సాక్షీభూతం గా నిల్చోబెట్టేస్తారు విశ్వనాథ గారు మనలని. మనలనే నిర్ణయించుకోమన్నట్టుండేది ఆ రెండు పడగలనన్నా స్వామి ఉపసంహరించుకోకుండా కాపాడుకోవడానికి ఏం చెయ్యాలో.
మనం చదివే ప్రతీ పుస్తకం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన మీద ప్రభావం చూపుతుందన్నది నిజం. ఏదో ఒక సిద్ధాంతం మీదనో , విషయం మీదనో అది మన మనసును ప్రభావితం చేస్తుంది. కానీ అన్ని మానవీయ సంబంధాల పట్ల పాఠకుడి దృక్కోణాన్ని మార్చగల శక్తి రామాయణం తర్వాత వేయిపడగలకుందని నా నమ్మకం. ముఖ్యంగా ప్రేమ, పెళ్ళి.
అలాగే మనం చదివే ప్రతి పుస్తకం, తర్వాత మనం ఎలాంటి సాహిత్యం చదువుతాము అనేది కూడా నిర్ణయించుకోవడానికి గీటురాయి అవుతుందని నా అభిప్రాయం. వేయి పడగలు చదివాక ఆ స్థాయి పుస్తకం కోసం చూస్తాం కానీ మామూలు పుస్తకాలు చదవాలని అనిపించదు. సహజకవి చెప్పినట్టు మందార మాధుర్యముల దేలు మధుపమ్ము పోవునే మదనములకు అన్నట్టు అయిపోతుంది.

ఇంకెందుకాలశ్యం ఎక్కడో హృదయపు అట్టడుగు పొరల్లో కూరుకుపోతున్న మీలోని పాఠకుడిని వేయి పడగలు ఊతమిచ్చి పైకి లేపండి. నా తరం లో చాలా మందికి వేయి పడగలు పేరే తప్ప కనీసం ఏముందో కూడా తెలియదు.కొంతమందికి ఎక్కడో విన్న గుర్తు. కొంతమందికి ఆ అదృష్టంకూడా లేదు. నా ఉద్దేశ్యంలో వేయి పడగల గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెయ్యి సంవత్సరాలు మనవలసిన దీపాన్ని వంద సంవత్సరాలకే కొండెక్కకుండా , ఆ దీప కాంతుల్లో జీవితాన్ని ఎలా వెలిగించుకోవచ్చో తర్వాతి తరాలకు చెప్దాం రండి.

Thursday, June 24, 2010

రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

జై శ్రీరామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!

సురాసురుల మధ్య తగవు తీర్చడానికీ, సురలకు అమృతాన్ని ఇవ్వడానికి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆడిన వింత నాటకమే మోహినీ అవతారం. ఈ అవతారం మరొక ప్రయోజనం మణికంఠ స్వామి జననం. మోహినీ రూపం దాల్చిన ఆ పరంజ్యోతిని శంకరుడు అనుసరిస్తే
అదే "రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!" అయ్యింది. పరమాత్మ అనుగ్రహంతో ఒకటి రాసిన తర్వాత శంకరుడినే మోహింపజేయగల మోహినీదేవి అవతారం లోకాన్ని కదిలించదా అనిపించింది(అనిపించేది ఎవరికి, అనిపింపచేసేది ఎవరు?).అలా ఆ స్వామి రాయించినవి మిగతావి.
వీటికి చంధో బద్దత లేదు, కానీ మనో నిబద్దత ఉంది
వాక్యశుద్ధి లేకపోవచ్చు, కానీ అంతఃకరణ శుద్ధి ఉంది.
పురుషుడూ,ప్రకృతీ అన్నీ తానే అయ్యి ఆటలాడే ఆ నిర్గుణ పరబ్రహ్మ ని శబ్దం ద్వారా స్పర్శించాలనీ,దర్శించాలనీ చేసిన చిన్న ప్రయత్నం.అంతే తప్ప శారదా పుత్రుల్ని గేళి చేయడానికి మాత్రం కాదు. సలహాలిస్తే చంధస్సులు నేర్చుకొని ఆ పరమాత్మ గుణగణాలను గాన చెయ్యాలని కోరిక.

నాగారివాహన నారాయణుండు,అసు
రగణమచ్చెరువొంద,సుర రక్షణకై ముద
ముగ మోహినిగాగ,భామయైన బావనుగని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్|

గగన మండలమ్మంత కాంత మేని ఛాయ ముప్పిరిగొనంగ, సురగ
ణాంగనలంబరవీధి చేరి కన్నులింతగ చేసి లోకోత్తర సౌందర్యమున్ చూ
డగ రాగ,భువనభాండముల్ గుసగుసలాడుచుండ,భామయైన బావనుగని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్|

వజ్రముల్ విసుగెత్తి పలికె,తమకేది అంతటి వన్నె యని,
వైఢూర్యముల్ వదలక వదరుచుండె, ఇది ఎచ్చటి వెలుగని,
మౌక్తికముల్ మారు మాటాడక యుండె, మునుపెన్నడు ఇది గనమని,
నవరత్నముల్ నోరాడక యుండె, ఇక తమనెవ్వరు తలపరని,
అన్ని రత్నముల కాంతిని,
అన్ని లోకముల శాంతినపహరింపనొప్పు
వెన్నుడు మోహిని గాగ, జూచి
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

సృష్టి ధర్మముగ దివా సంధ్యా నివర్తకుండైన రవిని
వ్యష్టిపరచగ,ముల్లోకమ్ముల తిమిరమ్మును
నష్టపరచ, లోకమ్ముల దీపించుచున్న మోహిని గని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

జగత్ప్రళయమో, త్రిశంకు స్వర్గ చంద్రబింబమో యటంచు
నగరాజాధిపు యల్లుడి జటన చేరి సోముడు చాటుగ
దాగి చూడగ, చంద్రబింబ సమభాసమునొప్పు మోహిని గని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

ముక్కెరకాంతులు మూడు లోకమ్ముల ముప్పిరిగొనంగ,
ఎక్కడివీ కాంతులనుచు మూడు లోకమ్ముల జనులు మ్రాన్పడగ,
రక్కసులనుండి సుధను, మూడు లోకమ్ముల గావగ దిగిన కాంతను గని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

శుభములు దేవాళికిన్ శుభకరముగనిచ్చు విభుడు మోహిని గాగ,
శుభములు మానవాళికిచ్చు,శుభగుడు శోభనమొప్ప మోహిని గాగ,
శుభముగ సుధను,సురలకీయ ఖగరాజపతి వేగ మోహిని గాగ,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

విరిచూపుల అరివీరుల యశమును వ్యర్ధము గావించుచు,
తరగని తమకమునభినయించి తామసుల దరి జేరుచు,
కరివాహనగణమున్ అమరుల జేయ సుధనిచ్చునువిధగని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

Sunday, June 13, 2010

రామ నీల మేఘ శ్యామా కోదండరామా!

శ్రీ రామదూతం శిరసా నమామి!

భీకరమౌ శ్రీరామ బాణం

శ్రీయుతమౌ శ్రీరామపాదం

భీషణమౌ శ్రీరామ శపథం

శ్రీకరమౌ శ్రీరామ నామం