Tuesday, October 5, 2010

కాలంలో ప్రయాణం (పరమాత్మతో ఒక ఉదయం)

జై శ్రీ రామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!

తెల్లవారింది.
చూడగలిగిన కన్నున్నా, చూడడానికి కావలసిన వెలుతురునివ్వడానికి ఆ పరాత్పరుడి ఆజ్ఞతో సూర్య భగవానుడు ఉదయించాడు.
రామచంద్రమూర్తిని పూర్వజన్మ సుకృతం చేత తన గర్భంలో పన్నెండు నెలలు ఉంచిన కౌసల్య లా,కృష్ణుడిని కడుపులో మోస్తున్న దేవకిలా మా వదిన ఎదురు వచ్చింది.
చిన్ని కృష్ణుడు నందవ్రజం లో కి వచ్చిన రాక్షసులని తుడిచిపెట్టి మోక్షం ఇచ్చినట్టు, మా వదిన ఇంట్లో మాలిన్యాన్ని ఊడ్చి దాని గమ్యస్థానానికి చేర్చేసింది.
భగీరధుడి తపస్సుకి మెచ్చి వస్తున్న శివ జటాజూట నిర్గమ గంగాఝరికై అమరులూ,నరులూ,మునులూ పరువెత్తినట్టు , మంజీర నీళ్ళు పట్టుకోవడానికి పరువెత్తాము.
విశ్వామిత్రుడికే కాదు, సమస్త సైన్యానికి భోజనం సమకూర్చగల కామధేనువులా మా వదిన అల్పాహారం తయారుచేసింది.
అంతం లేని దుష్టశిక్షణను అలుపెరగకుండా చేసే ఆ పరమాత్మ లా , రోజువారీ కాలకృత్యాలను తీర్చుకున్నాను.(ఆయనకి అది తప్పదు, మనకు ఇవి తప్పవు).

తన చిరునవ్వనే లోక శుభంకర ధూపంతో జన్మాంతర వాసనలను పావనం చేసే ధూర్జటికి ధూపం వేసాను.
తన కంటివెలుగనే దీపపు కాంతిలో అజ్ఞాన తిమిరాన్ని పారదోలే దక్షిణామూర్తికి దీపం పెట్టాను.
ఆయన పెడితే తినే మనలాంటి వాళ్ళలో కొంతమంది , నేను పెడతాను ఇవ్వాళ నీకు తిను అంటే తిని మురిసిపోయి , వాళ్ళని మురిపించిన కాళహస్తీశ్వరుడికి,కృష్ణ పరమాత్మ కి నైవేద్యం సమర్పించాను.
తన ఇంటికి వడిచి వస్తే, వచ్చినందుకు పొంగిపోవడం తర్వాతి మాట, ఎంత అలసిపోయావో అని భక్తులు ఆరాటపడ్డట్టు, ఎక్కడ నా దిష్టి తగులుతుందో అని నీరాజనం ఇచ్చాను.
ఆ స్వామి అనుగ్రహ ప్రసాదంగా అల్పాహారం తిని ఆఫీస్ కి బయలుదేరాను.
చెప్పులు వేసుకుంటుంటే నిశ్శబ్దంగా అవి భరతుడిననుగ్రహించిన రామపాదుకలను మనసులో పెట్టుకోమని హెచ్చరించాయి.
ద్వాపరంలో వ్యాసుడి ద్వారా పాండవులనీ, కలియుగంలో Ms.సుబ్బలక్ష్మి ద్వారా మన లాంటి వారిని అనుగ్రహించడానికి భీష్ముడి చేత ఆ స్వామి పలికించిన విష్ణు సహస్రనామం వింటూ బయలుదేరాను.
బయట అడుగుపెట్టగానే ఆకుపచ్చని పట్టుచీర కట్టుకుని, తెల్లని పూలు కొప్పున పెట్టుకుని, బిడ్డలాంటి హనుమని చూస్తున్న శుచిస్మిత అయిన సీతమ్మ లా ఒక చెట్టు ఆశీర్వదించింది.
గజేంద్రుడిలాంటి భక్తుల్ని కాపాడడానికి పరిగెత్తే ఆర్తత్రాణపరాయణుడి వేగంతో సరిసమానంగా కలిపురుషుడి అస్తిత్వాన్ని కాపాడడానికి నా తరం అంతా పరుగులు పెడుతోంది.
లింగంపల్లి బస్ స్టాప్ కి వెళ్ళేసరికి ఇక్కడ విష్ణు సహస్రం లో మణి మౌక్తిక సైకతాలతో క్షీరోధన్వత్ప్రదేశ వర్ణనం, అక్కడ మేటలు వేసినట్టు పెట్టున్న రంగురంగుల బస్సులు.
ఇక్కడ "రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే". అక్కడ నాలాంటి వాళ్ళే ఇంకో నలుగురితో సర్దుకుని ఆ ఆటోని ఆశ్రయించుకుని నేను.
ఇక్కడ "విజ్ఞానమేతత్సర్వం జనార్ధనం". అక్కడ విజ్ఞానమే సర్వం అని గచ్చిబౌలి కూడలి లో పరుగెత్తుతున్న నా బోటి అజ్ఞానులం.
ఇక్కడ "కరోమి యద్యత్ సకలం పరస్మైః నారాయణాయేతి సమర్పయామి". అక్కడ ఎవరి కోసం, ఎందుకు పని చేస్తున్నామో , దీని వల్ల ఉత్తరజన్మల్లో ఒరిగే పుణ్యం ఏమన్నా ఉంటుందో లేదో తెలియకపోయినా, సమాజంకోసం, కుటుంబం కోసం రాజీపడి swipecard కోసం చూసుకుంటున్న నా బోటి ఉన్నత విద్యా పట్టభద్రులు.
ఏ రోజుకారోజు ఈ రోజైనా ఆ అమ్మ దర్శనం అవుతుందా అని కలవరించిన రామకృష్ణులలా , ఈ రోజైనా బగ్స్ లేని డెలివరీ చెయ్యాలని అనుకుంటూ ఆఫీస్ కి పోయాను.

కొసరు:

మనం ఏదైనా ఒక అద్భుతాన్ని (ఒక కళారూపం కావచ్చు,ఒక మేధోజనిత ఆవిష్కరణ కావచ్చు) చూస్తే, దాని గురించీ, దాన్ని తయారుచేసిన వాడి గురించీ, అతడు/ఆమె తెలివితేటల గురించీ పది మార్లు ఆలోచిస్తాం. మరి అలాంటిది ౮౪ (84) లక్షల జీవజాతులని సృజించి, ప్రతిదానికి సక్రమంగా ఆహారం అందేలా చేసినవాడూ, కర్మ పరిపాకానుసారం శరీరాన్నిచ్చేవాడూ, లక్షణం కాబట్టి శరీరం జీర్ణమయ్యే స్థితి వచ్చినప్పుడు దశ వాయువుల సహకారంతో చాలా జాగ్రత్తగా శరీరాన్ని పంచభూతాల్లో కలిసేలా చేసేవాడూ ఒకాయన ఉన్నాడు కదా.
ఇన్ని ప్రజ్ఞా పాటవాలు ఉన్న మేధావి గురించి ఎందుకు మనం ఒక నిముషం ఆలోచించం? మనం కళని గుర్తించడానికి విముఖులమవుతున్నామా, లేక కళాకారుడిని గుర్తించడానికి విముఖులమవుతున్నామా?

గతానికి వారసులుగానూ, వర్తమానంలో వారధిగానూ, భవిష్యత్తుకి పునాదిగానూ ప్రతీ వ్యక్తీ తనను తాను గుర్తిస్తే కృతయుగం నుండీ కలియుగం వరకూ కాలంలో ప్రయాణించడం సాధ్యమే.

Saturday, October 2, 2010

వృద్ధులా, వారధులా?

జై శ్రీరామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!
జీవితమంతా గొడ్డుచాకిరీ చేసి, పిల్లలని పెంచి, కుటుంబ భాద్యతలను నెరవేర్చి నలభై,నలభయ్యైదు వచ్చేసరికి సమాజం వారికిచ్చేది ముసలాడు, ముసలిది అనే బిరుదు. అప్పటిదాకా పులి లా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఇంట్లో,బయటా దేనికి పనికి రాని వారిగా తయారవుతున్నారు(పరిగణింపబడుతున్నారు). ఏదన్నా మంచి మాటలు చెపితే వినకపోగా మాట్లాడితే పురాణం మొదలుపెడతావంటూ చిన్నవాళ్ళు విసుక్కుంటారు. కంప్యూటర్ లకే జరిగినవి గుర్తుంచుకుని ఎప్పటికప్పుడు పని చేసే సామర్ధ్యం పెంచుకోవడం నేర్పిస్తున్నాం. "Artificial Intellegence" అని పిలుచుకుని మురిసిపోతున్నాం. అలాంటిది ఒక జీవిత కాలాన్ని చూసి వాళ్ళు చూసినది, తెలుసుకున్నదీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా?

మా తాత గారు వ్యాపారాలు చేస్తూ దాదాపుగా దేశంలోని సగం రాష్ట్రాలు తిరిగారు,బ్రాహ్మణుడు కాకపోయినా ఆసక్తి కొద్దీ జాతకాలు చూడడం,ముహూర్తాలు చూడడం నేర్చుకున్నారు. ఆయన ముహూర్తం పెట్టారంటే మా వరికుంటపాడు మండలం లో ఏ అయ్యవారయినా ఒప్పుకుని తీరేవారు. ఆయన పెట్టినంత మంచి ముహూర్తం మేము కూడా పెట్టలేమనేవారు. మా మేనత్త ఊరు కొత్తపేట అయ్యోరు అంజయ్యగారైతే మా కుటుంబం లో జరిగే శుభకార్యాలకి ఆయన పెట్టిన ముహూర్తం కళ్ళు మూసుకుని ok చేసేవారు. ఆఖరికి కొత్త gas stove కొనుక్కున్నా ఎవరిపేరు తో బాగుందో ఆయన్నే అడిగేవాళ్ళు. "ఎప్పటికయినా నీకొక్కడికి మాత్రం ఇవన్నీ నేర్పిస్తాన్రా,నేను నేర్పకపోయినా నువ్వు నేర్చుకుంటావు" అనేవారు. కానీ నా చదువులు నన్ను దూరంగా తీసుకెళ్ళాయి, ఎంత దూరంగా అంటే ఆయన శరీరాన్ని వదిలి పెట్టి వెళ్ళినప్పుడు చూడడానికి కూడా కుదరనంత. అలాంటివాడు నలుగురు కొడుకులూ,ముగ్గురు కూతుళ్ళూ ఉన్నా ఎవరింట్లోనూ ఉంచుకోలేదు. ఒక కొడుక్కి పేరూ, ప్రేమా ఉన్నాయి కానీ ఆస్తి లేదు,ఒక కొడుకేమో మా ఇంట్లో తిని మిగతా కొడుకుల తరపున మాట్లాడతావన్నాడు. ఇంకో కొడుకేమో నాకే ముగ్గురు కూతుళ్ళున్నారు ,ఇంకా ఈయనకి ఎక్కడ పెట్టేదని ఆయన సర్దుకున్నాడు. ఇలాగే ఏవో కారణాలు చూపించి ఇంకో అయనా సర్దుకున్నాడు. మా ఇంటికి రమ్మంటే ఆయన రాలేదు. చివరి రోజుల్లో లాడ్జిలో ఉంటూ మా నాగేశ్వరపెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తింటూ గడిపేశాడు. ఎన్ని విషయాలు తెలుసో ఆయనకి, ఏం లాభం! ఆ జ్ఞానం అంతా ఎవరికీ అవసరం లేకపోయింది.అమ్మా నాన్నల పైతరం వాళ్ళు ఒకరు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పిల్లల ఆలోచనాక్రమాన్ని సరిదిద్దే కౌన్సెలర్లు ఉన్నట్టే.

ఇలాంటి మనిషే ఇంకో ఆమె మా ఇంటి పక్కన కామాక్షి ఆంటీ వాళ్ళ అమ్మగారు. ఆమె అసలు పేరు తెలియదు. నేనూ, మా అన్నయ్యా, మా వదినా అందరం "మామ్మగారూ" అనే పిలుస్తాం. ఆమెని కదిలిస్తే ఎన్నో సంగతులు. వాళ్ళ పెద్దబ్బాయో ఎవరో ఒకాయన దేవుడి పాటలు పాడే వాడట. "నిన్ను చూస్తే అచ్చం ఆ అబ్బాయిని చూస్తున్నట్టే ఉంది" అనేవారు. గజేంద్ర మోక్షం ,సుందరకాండ ఇలాంటి వాటి గురించి చెబితే పరవశించిపోయేది . వింటూ ఆవిడ పొందే ఆనందం చూస్తే "పానీయమ్ములు తాగుచున్, కుడుచుచున్,భాషించుచున్ .... మరచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా " అంటూ పోతన్న గారు వర్ణించిన ప్రహ్లాదుడు కళ్ళముందు కనిపించినట్టుండేది. వింటూ ఆవిడ జ్ఞాపకాల దొంతరలోనుండి ఆ పరాత్పరుడు ఆవిడని కాపాడిన వైనం కధలుకధలుగా, కెరటాలుగా, ప్రాణికోటిని పావనం చేసే గంగా ఝరిలా, భగవంతుడిమీద అచంచల విశ్వాసాన్ని ప్రోది చేసే అచార్యవాక్యంలా చెప్పేది. ఆవిడ ఏమీ పెద్దగా చదువుకోలేదు. కానీ భగవంతుడి అనుగ్రహాన్ని వివిధ దశల్లో చవిచూడడం చేత సుస్థిరమైన విశ్వాసం ఆమెది. విశ్వాసానికి పునాది శాస్త్రజ్ఞానం అయితే అది కొంతకాలానికి బీటలు వారచ్చు. అదే అనుభవం అయితే, అది ఎన్నటికి చెక్కు చెదరదు.
అలాంటి అనుభవజనిత విశ్వాసంతో జీవితంలోని అనేక ఒడిదుడుకులని ఎదుర్కొన్న వాళ్ళ మాటలు మనకి మార్గదర్శకం గా ఉపయోగించుకోలేమా? మా ప్రదీప్ ఎప్పుడూ చెప్తుంటాడు "reinventing the wheel" అనేది అభివృద్ధికి అసలు అవరోధం అని. నాకప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది, మనం ఇప్పుడు అదే చేస్తున్నామని.

నలుగురు పెద్దవాళ్ళతో మాట్లాడితే మన జీవితంలో కనీసం నలభై సమస్యలకు సమాధానం దొరుకుతుందని నా అభిప్రాయం. ఏమంటారు?