Friday, December 17, 2010

ఆవును చూడరా,బొల్లావును చూడరా!


కాటమరాజుని కరుణించినాతల్లి!
కష్టాలు కడతేర్చు ఓ కల్పవల్లీ!!

అన్న అయితమరాజుని ఆదుకొనియెడి తల్లి!
అపురూపగని వమ్మ ఆనందవల్లీ!!

సాగిలపడి నీకు దండాలు పెట్టేము!
బొల్లావువై నీవుండ మాకేటి బెంగ!!

హారతూలిచ్చేము,పూజలూ చేసేము!
దయతోడ మమ్ములను చూడమ్మ చల్లంగ!!

చెనికల వారిల్ల వెలసియున్నావమ్మ!
చేటురాకుండాను కాపాడవమ్మ!!

మాతల్లితండ్రులను గాచితివి కరుణతోడ!
నీ బిడ్డలమమ్మ చూడమ్మ దయతోడ!!

నిన్ను కొలిచేటికి చేరినామమ్మ!
తప్పులెంచక మమ్ము కరుణించవమ్మ!!

నీ పూజలు చేసేము,నియతి తప్పకుండానూ
నీ సేవలూ చేసేము, నియమమ్ముగానూ
నీ పాదాలు పట్టేము, నమ్మకముగానూ
నిన్ను కొలుచుకు బతికేము, నీవే మా దిక్కంటూ......

యాదవుల వంశ చరిత్రలో బొల్లావుది ఒక విశిష్ట స్థానం. ఆ ఆవు పాలతో తయారు చేసిన పదార్ధం ఎప్పటికీ చెడిపోదు.
ఆ ఆవు పరాక్రమం ముందు ఎంతటి వారైనా నిలవలేరు, కాబట్టే

ద్వాపరమందు కృష్ణునిగ దానవవైరి జనించి తెల్పె పెన్
పాపము పెచ్చుమీరి క్షితిభారము మిక్కుటమైన ధర్మ సం
స్థాపన చేయగా తరచు తానె జనింతునటంచు ,కాన మా
గోపకులాన నొక గోవుయై పుట్టె లోకులు బొల్లియావనన్!

అంటూ కాటమరాజు కీర్తించాడు.
ఇప్పటికీ ఎప్పుడు కొలుపులు చేసినా బొల్లావులను తీసుకెళ్ళి స్నానం చేయించి పూజలు చేయించి మిగతా కార్యక్రమాలు మొదలుపెడతారు.
శివకాళ్ళందరూ బొల్లావు మూర్తులని, వృషభమూర్తులని తీసుకుని ఆనంద పరవశంతో నృత్యం చేస్తుంటే సాక్షాత్తూ విష్ణుమూర్తి ముందు పరమశివుడు తాండవం చేస్తున్నట్టుంటుంది.

అలా ఒకనాడు బస్సులో కూర్చుని, ఆరుద్ర గారు రాసిన కాటమరాజు కధ నాటకం నెమరువేసుకుంటుండగా మనసులో మెదలిన పాట ఇది. అప్పుడో చరణం, అప్పుడో చరణం కూడుకుంటూ ఇలా రాసాను. మొన్న కొలుపుల్లో పాడదామనుకున్నాను, కానీ నేను రాసుకున్నట్టు కానీ,రాయగలననీ కానీ మా నాన్నగారికి, మా అన్నయ్యకి తప్ప ఎవరికీ తెలియదు. వాళ్ళిద్దరూ రాలేదు. అంచేత నేనే మనసా ఆ బొల్లావు మూర్తి దగ్గర కూర్చుని పాడుకున్నాను. ఇంకెవరైనా కాటమరాజు మీద, బొల్లావు మీద ఆసక్తి కలవారు ఉంటారేమో ,వారికి నచ్చుతుందేమో అని ఇక్కడ ప్రచురిస్తున్నాను.

Friday, November 26, 2010

ధార్మిక వివక్ష! - మొహమ్మద్ ఇర్ఫాన్

గల్ఫ్‌లోని అన్ని దేశాలు పూర్తిగా ఇస్లామిక్ రాజ్యా లు కాగా అందులో కొన్ని కఠోర మత నిబంధనలు పాటిస్తుండ గా మరికొన్ని ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. ఇస్లామిక్ దేశమైనప్పటికీ మొత్తం గల్ఫ్‌లో కువైట్ ఒక అభ్యుదయ భావాలు కలిగిన దేశంగా పేరొందినా ఈ దీపావళి సందర్భం గా కువైట్ పోలీసులు ప్రవర్తించిన అమానుష చర్య అనేక ప్రశ్నలను సంధించింది.

ఒమాన్‌లోని, యుఎఇ(దుబాయి)లోని మందిరాలు మినహా గల్ఫ్‌లో ఎక్కడ కూడా హిందువుల ఆలయాలు లేవు. ఒక గుజరాతీయ సింధీ వ్యక్తి నిర్వహణలో ఉన్న దుబాయిలోని ఇరుకయిన మందిరాన్ని విస్తరించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇక విశాల సౌదీ అరేబియాలో కనీసం దేవుళ్ల చిత్రపటాలను కూడా తీసుకరావడం కూడా నిషే ధం. ఈ పరిస్థితులలో హిందూ ధార్మిక అభిరుచి కలిగిన కొందరు ఇళ్లలో గోప్యంగా సామూహిక ప్రార్థనలు జరుపుకోవడం మినహా మరే మార్గం లేదు.

కొన్నాళ్ల క్రితం దుబాయిలోని జుమేరియాలో గణేష్ నిమజ్జనం చేయడానికి ప్రయత్నించిన కొంత మంది యువకులను దుబాయి పోలీసులు అదుపులోకి తీసుకుని హెచ్చరించి వదిలిపెట్టారు. ప్రపంచంలోని ఎత్తయిన భవనాలలో ఒకటైన బుర్జ్ అల్ ఖలీఫా పైకప్పుపై బతుకమ్మ ఆడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రయత్నించారు. ధార్మిక కారణాల వల్ల కుదరలేదు. అందుకే హిందూ పండుగలను ఒక సాంఘిక లేదా సాంస్కృతిక కార్యక్రమంగా జరుపుకోవల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో దుబాయిలో దసరాకు ముందు జరుపుకునే దాండియా ఉత్సవాలు ప్రముఖమైనవి. అయితే అందులో కేవలం సంపన్న వర్గాలు మాత్రమే పాల్గొంటారు.

ఈ ఏడాది నుంచి హైదరాబాద్‌లోని ఒక ప్రఖ్యాత క్లబ్ యజమాని గుజరాతీ వ్యాపారస్తులతో కలిసి దాండియాను భారీ వ్యయంతో కూడిన ఉత్సవంగా మార్చారు. కువైట్‌లో కూడా ఉన్నత ఉద్యోగాలు చేసే సంప న్న ప్రవాస భారతీయులు నివసించే సాల్మీయాలోని టైటానిక్ నివాస సముదాయంలో గత కొద్ది కాలంగా దీపావళి పండుగను ఆర్భాటంగా, ఉల్లాసంగా జరుపుకుంటున్నారు. మొత్తం కువైట్‌లో ఈ ఒక్క ప్రదేశమే సురక్షితం కావడంతో రానురాను దీని ప్రాధాన్యం పెరిగి అనేక భారతీయ కుటుంబాలు టైటానిక్ నివాస సముదాయానికి వచ్చి టపాకాయలు కాల్చడం, పిల్లలతో ఆనందం పొందుతున్నారు.

ప్రతిసారి అలా సంప న్న భారతీయులు టైటానిక్ కాంప్లెక్స్‌లో టపాకాయలు కాల్చుతూ పండుగను సంబరంగా జరుపుకుంటున్నారు. దీనికి ప్రత్యేకంగా అధికారుల నుంచి అనుమతి కూడా ఉంది. రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాన్ని ముగించాలనే షరతుతో అనుమతి ఇచ్చారు. ఈ రకంగా అన్యమతస్తులు పండుగను నిర్వహించుకోవడం కొంతమంది కువైట్ జాతీయులకు మింగుడుపడలేదు. అందుకే ఈసారి దాన్ని ఎలాగై నా భగ్నం చేయాలనే పథకం రచించారు.

ఈ మేరకు అనుమతి లేకుండా బాణాసంచా పేల్చుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే సాయుధ పోలీసు బలగాలు వచ్చి దీపావళి జరుపుకుంటున్న 18 మందిని అరెస్టు చేశారు. 22 నిమిషాల గడువు ముగిసిన తర్వాత అంటే రాత్రి 9 గంటల 22 నిమిషాలకు పోలీసులు టైటానిక్ సముదాయంపై దాడి చేశారు. ఉగ్రవాదుల దాడులకు వెళ్లినట్టుగా 16 ప్రత్యేక వాహనాలలో వచ్చిన స్థానిక పోలీసులు, ప్రత్యేక బలగాలు పెద్ద తోపులాట తర్వాత భవన సముదాయంలోకి ప్రవేశించారు. అరెస్టు అయిన వారిలో అయిదుగురిని మరుసటి రోజు విడుదల చేయగా, మిగిలిన వారిని నాలుగు రోజుల తర్వాత విడుదల చేశారు. ఈ సంఘటన కువైట్‌లో పెద్ద దుమారం రేపింది.

భారతీయ ఎంబసీ తీరుపై అనేక విమర్శలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా ఎంబసీ దీనిపై నోరు విప్పలేదు. కువైట్ జనాభాలో విదేశీయులు మెజారిటీ సంఖ్యలో ఉండగా అందులో భారతీయులు అగ్రగణ్యులు కాగా, అందులో ఎక్కువ మంది హిందువులు ఉన్నారు. అయినా ప్రభుత్వ తీరు సమంజసంగా లేదు. అంతకు ముందు కువైట్‌లోని ఒక స్టేడియంలో శ్రీలంకకు చెందిన సింహాళీయులు తమ నూతన సంవత్సర వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీనికి కువైట్ ప్రభుత్వం అనుమతించింది కూడా.

సభలో శ్రీలంక రాయబారితో సహా ఆ దేశానికి చెందిన అనేకమంది ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు వేదికపై ఉండగా ఒక్కసారిగా పోలీసులు స్టేడియంలోకి ప్రవేశించి కార్యక్రమాన్ని ముగించారు. కార్యక్రమ నిర్వహణకు తమకు అనుమతి ఉందని చెప్పినా శుక్రవారం నమాజు సమయంలో లౌడు స్పీక ర్ల ద్వారా పాటలు పాడడం భావ్యం కాదంటూ మొత్తం కార్యక్రమాన్ని ముగించారు. దీంతో వేలాది మంది నిరాశతో వెనక్కి మళ్లారు. 2003లో కువైట్‌లో భారతీయ రాయబారిగా వచ్చిన స్వష్ పవన్ సింగ్ స్థానికంగా ఉన్న ఒక గురుద్వారకు వెళ్లిన కొద్ది రోజులకు అక్రమంగా అనుమతి లేకుండా దాన్ని నిర్మించారని కువైట్ అధికారులు దాన్ని కూలగొట్టారు.

ముస్లింలలో షియా వర్గానికి చెందిన బోహ్రా తెగకు చెందిన ప్రవాస భారతీయులు, పాకిస్థానీలకోసం మసీదు నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కువైట్ మంత్రి తన పదవి పోగొట్టుకోవాల్సి వచ్చింది. క్రైస్తవ మతానికి సంబంధించి కొన్ని చర్చీలు ఉన్నప్పటికీ దాన్ని విస్తరించడానికి కూడా స్థానికుల నుంచి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. మొత్తం గల్ఫ్ కూటమిలో కువైట్ ప్రగతిశీల, స్వేచ్ఛా వాతావరణం కలిగిన దేశం గా పేరొందింది.

దుబాయి కంటే కూడా కువైట్‌లో స్వేచ్ఛ ఎక్కువ అని పేరున్నా, ఇస్లామేతర ధార్మిక విషయాలకు సంబంధించిన ఈ సంఘటనలు చూస్తే బాధ కలుగుతుంది. ఆర్థికంగా, మౌలిక వసతుల కల్పన విషయంలో గల్ఫ్ గణనీయమైన అభివృద్ధి సాధించింది. అయినప్పటికీ ధార్మిక విషయాలలో మాత్రం ఇంకా ఇస్లామిక్ మత ఛాందవాదం ముసుగులో ఉంది.

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Tuesday, October 5, 2010

కాలంలో ప్రయాణం (పరమాత్మతో ఒక ఉదయం)

జై శ్రీ రామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!

తెల్లవారింది.
చూడగలిగిన కన్నున్నా, చూడడానికి కావలసిన వెలుతురునివ్వడానికి ఆ పరాత్పరుడి ఆజ్ఞతో సూర్య భగవానుడు ఉదయించాడు.
రామచంద్రమూర్తిని పూర్వజన్మ సుకృతం చేత తన గర్భంలో పన్నెండు నెలలు ఉంచిన కౌసల్య లా,కృష్ణుడిని కడుపులో మోస్తున్న దేవకిలా మా వదిన ఎదురు వచ్చింది.
చిన్ని కృష్ణుడు నందవ్రజం లో కి వచ్చిన రాక్షసులని తుడిచిపెట్టి మోక్షం ఇచ్చినట్టు, మా వదిన ఇంట్లో మాలిన్యాన్ని ఊడ్చి దాని గమ్యస్థానానికి చేర్చేసింది.
భగీరధుడి తపస్సుకి మెచ్చి వస్తున్న శివ జటాజూట నిర్గమ గంగాఝరికై అమరులూ,నరులూ,మునులూ పరువెత్తినట్టు , మంజీర నీళ్ళు పట్టుకోవడానికి పరువెత్తాము.
విశ్వామిత్రుడికే కాదు, సమస్త సైన్యానికి భోజనం సమకూర్చగల కామధేనువులా మా వదిన అల్పాహారం తయారుచేసింది.
అంతం లేని దుష్టశిక్షణను అలుపెరగకుండా చేసే ఆ పరమాత్మ లా , రోజువారీ కాలకృత్యాలను తీర్చుకున్నాను.(ఆయనకి అది తప్పదు, మనకు ఇవి తప్పవు).

తన చిరునవ్వనే లోక శుభంకర ధూపంతో జన్మాంతర వాసనలను పావనం చేసే ధూర్జటికి ధూపం వేసాను.
తన కంటివెలుగనే దీపపు కాంతిలో అజ్ఞాన తిమిరాన్ని పారదోలే దక్షిణామూర్తికి దీపం పెట్టాను.
ఆయన పెడితే తినే మనలాంటి వాళ్ళలో కొంతమంది , నేను పెడతాను ఇవ్వాళ నీకు తిను అంటే తిని మురిసిపోయి , వాళ్ళని మురిపించిన కాళహస్తీశ్వరుడికి,కృష్ణ పరమాత్మ కి నైవేద్యం సమర్పించాను.
తన ఇంటికి వడిచి వస్తే, వచ్చినందుకు పొంగిపోవడం తర్వాతి మాట, ఎంత అలసిపోయావో అని భక్తులు ఆరాటపడ్డట్టు, ఎక్కడ నా దిష్టి తగులుతుందో అని నీరాజనం ఇచ్చాను.
ఆ స్వామి అనుగ్రహ ప్రసాదంగా అల్పాహారం తిని ఆఫీస్ కి బయలుదేరాను.
చెప్పులు వేసుకుంటుంటే నిశ్శబ్దంగా అవి భరతుడిననుగ్రహించిన రామపాదుకలను మనసులో పెట్టుకోమని హెచ్చరించాయి.
ద్వాపరంలో వ్యాసుడి ద్వారా పాండవులనీ, కలియుగంలో Ms.సుబ్బలక్ష్మి ద్వారా మన లాంటి వారిని అనుగ్రహించడానికి భీష్ముడి చేత ఆ స్వామి పలికించిన విష్ణు సహస్రనామం వింటూ బయలుదేరాను.
బయట అడుగుపెట్టగానే ఆకుపచ్చని పట్టుచీర కట్టుకుని, తెల్లని పూలు కొప్పున పెట్టుకుని, బిడ్డలాంటి హనుమని చూస్తున్న శుచిస్మిత అయిన సీతమ్మ లా ఒక చెట్టు ఆశీర్వదించింది.
గజేంద్రుడిలాంటి భక్తుల్ని కాపాడడానికి పరిగెత్తే ఆర్తత్రాణపరాయణుడి వేగంతో సరిసమానంగా కలిపురుషుడి అస్తిత్వాన్ని కాపాడడానికి నా తరం అంతా పరుగులు పెడుతోంది.
లింగంపల్లి బస్ స్టాప్ కి వెళ్ళేసరికి ఇక్కడ విష్ణు సహస్రం లో మణి మౌక్తిక సైకతాలతో క్షీరోధన్వత్ప్రదేశ వర్ణనం, అక్కడ మేటలు వేసినట్టు పెట్టున్న రంగురంగుల బస్సులు.
ఇక్కడ "రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే". అక్కడ నాలాంటి వాళ్ళే ఇంకో నలుగురితో సర్దుకుని ఆ ఆటోని ఆశ్రయించుకుని నేను.
ఇక్కడ "విజ్ఞానమేతత్సర్వం జనార్ధనం". అక్కడ విజ్ఞానమే సర్వం అని గచ్చిబౌలి కూడలి లో పరుగెత్తుతున్న నా బోటి అజ్ఞానులం.
ఇక్కడ "కరోమి యద్యత్ సకలం పరస్మైః నారాయణాయేతి సమర్పయామి". అక్కడ ఎవరి కోసం, ఎందుకు పని చేస్తున్నామో , దీని వల్ల ఉత్తరజన్మల్లో ఒరిగే పుణ్యం ఏమన్నా ఉంటుందో లేదో తెలియకపోయినా, సమాజంకోసం, కుటుంబం కోసం రాజీపడి swipecard కోసం చూసుకుంటున్న నా బోటి ఉన్నత విద్యా పట్టభద్రులు.
ఏ రోజుకారోజు ఈ రోజైనా ఆ అమ్మ దర్శనం అవుతుందా అని కలవరించిన రామకృష్ణులలా , ఈ రోజైనా బగ్స్ లేని డెలివరీ చెయ్యాలని అనుకుంటూ ఆఫీస్ కి పోయాను.

కొసరు:

మనం ఏదైనా ఒక అద్భుతాన్ని (ఒక కళారూపం కావచ్చు,ఒక మేధోజనిత ఆవిష్కరణ కావచ్చు) చూస్తే, దాని గురించీ, దాన్ని తయారుచేసిన వాడి గురించీ, అతడు/ఆమె తెలివితేటల గురించీ పది మార్లు ఆలోచిస్తాం. మరి అలాంటిది ౮౪ (84) లక్షల జీవజాతులని సృజించి, ప్రతిదానికి సక్రమంగా ఆహారం అందేలా చేసినవాడూ, కర్మ పరిపాకానుసారం శరీరాన్నిచ్చేవాడూ, లక్షణం కాబట్టి శరీరం జీర్ణమయ్యే స్థితి వచ్చినప్పుడు దశ వాయువుల సహకారంతో చాలా జాగ్రత్తగా శరీరాన్ని పంచభూతాల్లో కలిసేలా చేసేవాడూ ఒకాయన ఉన్నాడు కదా.
ఇన్ని ప్రజ్ఞా పాటవాలు ఉన్న మేధావి గురించి ఎందుకు మనం ఒక నిముషం ఆలోచించం? మనం కళని గుర్తించడానికి విముఖులమవుతున్నామా, లేక కళాకారుడిని గుర్తించడానికి విముఖులమవుతున్నామా?

గతానికి వారసులుగానూ, వర్తమానంలో వారధిగానూ, భవిష్యత్తుకి పునాదిగానూ ప్రతీ వ్యక్తీ తనను తాను గుర్తిస్తే కృతయుగం నుండీ కలియుగం వరకూ కాలంలో ప్రయాణించడం సాధ్యమే.

Saturday, October 2, 2010

వృద్ధులా, వారధులా?

జై శ్రీరామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!
జీవితమంతా గొడ్డుచాకిరీ చేసి, పిల్లలని పెంచి, కుటుంబ భాద్యతలను నెరవేర్చి నలభై,నలభయ్యైదు వచ్చేసరికి సమాజం వారికిచ్చేది ముసలాడు, ముసలిది అనే బిరుదు. అప్పటిదాకా పులి లా ఉన్నవాళ్ళు ఒక్కసారిగా ఇంట్లో,బయటా దేనికి పనికి రాని వారిగా తయారవుతున్నారు(పరిగణింపబడుతున్నారు). ఏదన్నా మంచి మాటలు చెపితే వినకపోగా మాట్లాడితే పురాణం మొదలుపెడతావంటూ చిన్నవాళ్ళు విసుక్కుంటారు. కంప్యూటర్ లకే జరిగినవి గుర్తుంచుకుని ఎప్పటికప్పుడు పని చేసే సామర్ధ్యం పెంచుకోవడం నేర్పిస్తున్నాం. "Artificial Intellegence" అని పిలుచుకుని మురిసిపోతున్నాం. అలాంటిది ఒక జీవిత కాలాన్ని చూసి వాళ్ళు చూసినది, తెలుసుకున్నదీ కాలగర్భంలో కలిసిపోవాల్సిందేనా?

మా తాత గారు వ్యాపారాలు చేస్తూ దాదాపుగా దేశంలోని సగం రాష్ట్రాలు తిరిగారు,బ్రాహ్మణుడు కాకపోయినా ఆసక్తి కొద్దీ జాతకాలు చూడడం,ముహూర్తాలు చూడడం నేర్చుకున్నారు. ఆయన ముహూర్తం పెట్టారంటే మా వరికుంటపాడు మండలం లో ఏ అయ్యవారయినా ఒప్పుకుని తీరేవారు. ఆయన పెట్టినంత మంచి ముహూర్తం మేము కూడా పెట్టలేమనేవారు. మా మేనత్త ఊరు కొత్తపేట అయ్యోరు అంజయ్యగారైతే మా కుటుంబం లో జరిగే శుభకార్యాలకి ఆయన పెట్టిన ముహూర్తం కళ్ళు మూసుకుని ok చేసేవారు. ఆఖరికి కొత్త gas stove కొనుక్కున్నా ఎవరిపేరు తో బాగుందో ఆయన్నే అడిగేవాళ్ళు. "ఎప్పటికయినా నీకొక్కడికి మాత్రం ఇవన్నీ నేర్పిస్తాన్రా,నేను నేర్పకపోయినా నువ్వు నేర్చుకుంటావు" అనేవారు. కానీ నా చదువులు నన్ను దూరంగా తీసుకెళ్ళాయి, ఎంత దూరంగా అంటే ఆయన శరీరాన్ని వదిలి పెట్టి వెళ్ళినప్పుడు చూడడానికి కూడా కుదరనంత. అలాంటివాడు నలుగురు కొడుకులూ,ముగ్గురు కూతుళ్ళూ ఉన్నా ఎవరింట్లోనూ ఉంచుకోలేదు. ఒక కొడుక్కి పేరూ, ప్రేమా ఉన్నాయి కానీ ఆస్తి లేదు,ఒక కొడుకేమో మా ఇంట్లో తిని మిగతా కొడుకుల తరపున మాట్లాడతావన్నాడు. ఇంకో కొడుకేమో నాకే ముగ్గురు కూతుళ్ళున్నారు ,ఇంకా ఈయనకి ఎక్కడ పెట్టేదని ఆయన సర్దుకున్నాడు. ఇలాగే ఏవో కారణాలు చూపించి ఇంకో అయనా సర్దుకున్నాడు. మా ఇంటికి రమ్మంటే ఆయన రాలేదు. చివరి రోజుల్లో లాడ్జిలో ఉంటూ మా నాగేశ్వరపెద్దమ్మ వాళ్ళ ఇంట్లో తింటూ గడిపేశాడు. ఎన్ని విషయాలు తెలుసో ఆయనకి, ఏం లాభం! ఆ జ్ఞానం అంతా ఎవరికీ అవసరం లేకపోయింది.అమ్మా నాన్నల పైతరం వాళ్ళు ఒకరు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పిల్లల ఆలోచనాక్రమాన్ని సరిదిద్దే కౌన్సెలర్లు ఉన్నట్టే.

ఇలాంటి మనిషే ఇంకో ఆమె మా ఇంటి పక్కన కామాక్షి ఆంటీ వాళ్ళ అమ్మగారు. ఆమె అసలు పేరు తెలియదు. నేనూ, మా అన్నయ్యా, మా వదినా అందరం "మామ్మగారూ" అనే పిలుస్తాం. ఆమెని కదిలిస్తే ఎన్నో సంగతులు. వాళ్ళ పెద్దబ్బాయో ఎవరో ఒకాయన దేవుడి పాటలు పాడే వాడట. "నిన్ను చూస్తే అచ్చం ఆ అబ్బాయిని చూస్తున్నట్టే ఉంది" అనేవారు. గజేంద్ర మోక్షం ,సుందరకాండ ఇలాంటి వాటి గురించి చెబితే పరవశించిపోయేది . వింటూ ఆవిడ పొందే ఆనందం చూస్తే "పానీయమ్ములు తాగుచున్, కుడుచుచున్,భాషించుచున్ .... మరచెన్ సురారి సుతుడేతద్విశ్వమున్ భూవరా " అంటూ పోతన్న గారు వర్ణించిన ప్రహ్లాదుడు కళ్ళముందు కనిపించినట్టుండేది. వింటూ ఆవిడ జ్ఞాపకాల దొంతరలోనుండి ఆ పరాత్పరుడు ఆవిడని కాపాడిన వైనం కధలుకధలుగా, కెరటాలుగా, ప్రాణికోటిని పావనం చేసే గంగా ఝరిలా, భగవంతుడిమీద అచంచల విశ్వాసాన్ని ప్రోది చేసే అచార్యవాక్యంలా చెప్పేది. ఆవిడ ఏమీ పెద్దగా చదువుకోలేదు. కానీ భగవంతుడి అనుగ్రహాన్ని వివిధ దశల్లో చవిచూడడం చేత సుస్థిరమైన విశ్వాసం ఆమెది. విశ్వాసానికి పునాది శాస్త్రజ్ఞానం అయితే అది కొంతకాలానికి బీటలు వారచ్చు. అదే అనుభవం అయితే, అది ఎన్నటికి చెక్కు చెదరదు.
అలాంటి అనుభవజనిత విశ్వాసంతో జీవితంలోని అనేక ఒడిదుడుకులని ఎదుర్కొన్న వాళ్ళ మాటలు మనకి మార్గదర్శకం గా ఉపయోగించుకోలేమా? మా ప్రదీప్ ఎప్పుడూ చెప్తుంటాడు "reinventing the wheel" అనేది అభివృద్ధికి అసలు అవరోధం అని. నాకప్పుడప్పుడూ అనిపిస్తుంటుంది, మనం ఇప్పుడు అదే చేస్తున్నామని.

నలుగురు పెద్దవాళ్ళతో మాట్లాడితే మన జీవితంలో కనీసం నలభై సమస్యలకు సమాధానం దొరుకుతుందని నా అభిప్రాయం. ఏమంటారు?

Monday, July 26, 2010

ధర్మాత్మా సత్యసంధశ్చ vs వేణుగారి హీరోలు

జై శ్రీ రాం,
శ్రీ రామదూతం శిరసా నమామి!
-------------------------------------------
వేణు గారు వారి హీరోల గురించి రాసిన బ్లాగుకు కామెంట్ రాద్దామనుకుంటే సాంకేతిక సమస్యవల్ల ఎందుకో పోస్ట్ కాలేదు. అందువల్ల ఇక్కడ రాస్తున్నాను.నిజానికి సుందరకాండ వినడానికి మా పూజా గదికొచ్చిన రామచంద్ర మూర్తి గురించి రాద్దామనుకున్నాను. కానీ ఆ స్వామి ఈ విషయం మీద రాయించాడు.
-------------------------------------------

నిజానికి వాలి విషయంలో చాలామందికి సందేహాలు ఉన్నాయి. ఐతే ఆ సందేహం వచ్చినప్పుడు స్వయంగా రామాయణాన్ని చదివి తెలుసుకుందామనుకునేవాళ్ళు తక్కువ. దానితో ఎవరో చెప్పిన దాన్ని ఎక్కడో చదివేసి వాళ్ళ అభిప్రాయాన్ని తమ అభిప్రాయంగా నిర్ణయించేసుకుంటారు.మీరు కూడా అలాగే అనుకున్నారు. అని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు ఎలా అలోచిస్తున్నారో అలా చెప్పే పుస్తకాన్నే మీరు చదివారు. మీరు చెప్తున్న సదరు విషవృక్షం అలాంటిదే.
ఎందుకంటారా?
రామాయణంలో ప్రతీ ఘట్టమూ రాముని ఔన్నత్యాన్ని చెప్తుంది, నాకు బాగా నచ్చిన రెండు ఉదాహరణలు చెప్తాను వినండి.
ఒకటి, రామాయణ ఆవిర్భావం సందర్భం లో వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగిన ప్రశ్న.(కోన్వస్మిన్ సాంప్రతే లోకే..)
ధర్మం తప్పనివాడూ, సత్యం తప్పనివాడూ, సచ్ఛీలం కలిగిన వాడూ ఇలా అటూఇటుగా పదహారు గుణాలను చెప్పి ఇలాంటి వాడిని గురించి చెప్పమంటే, నారదుడు చెప్పింది ఆ రాముడి గురించి. అడిగింది తన నడవడికతో ఎంతటి పామరుడైనా, కౄరుడైనా మహర్షి గా మారవచ్చని నిరూపించిన వాల్మీకి. చెప్పింది బ్రహ్మ మానసపుత్రుడూ, నిరంతరహరినామ సంకీర్తనా తత్పురుషుడైన బ్రహ్మర్షి. మరి అలాంటప్పుడు నారదమహర్షి ఒక హంతకుడి గురించి, అన్నదమ్ములమధ్య వచ్చిన తగవుని తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశవాదిని గురించా చెప్తాడు? చెప్పడు గాక చెప్పడు . మరి ఎందుకు చెప్పాడు ? ఈ ప్రశ్న ఏ ఒక్కసారైనా మనలని మనం వేసుకుంటే సమాధానం ఇట్టే తెలుస్తుంది.

ఇక రెండవది.
యుద్ధకాండలో లక్ష్మణస్వామి మేఘనాధున్ని సంహరించడానికి వాడిన మంత్రం.
"ధర్మాత్మా సత్యసంధశ్చ రామో ధాశరధిర్యదీ!
పౌరుషేచాప్రతిద్వంద్వం శరైనం జహి రావణిం!!
రాముడు ధశరధనందనుడూ, ధర్మాత్ముడూ, సత్యసంధుడూ, పరాక్రమంలో ఎదురులేని వాడూ అయితే ఈ బాణం మేఘనాధుణ్ణి సంహరించు గాక.
దీని తర్వాత ఇంద్రజిత్తు మరణించాడని వాల్మీకి మహర్షి రాసినదే కదా, మరి దీన్నెందుకు ఒప్పుకోరో నాకర్ధం కాదు.
ఈ రెండు విషయాలు వాలి వధ తర్వాతే జరిగాయి అన్నది గుర్తుంచుకోవాల్సిన , గమనించాల్సిన విషయం.

ఇకపోతే మీరన్న ఆ సదరు రచయితలు అన్నట్టు రాముడు అన్యాయంగా వాలిని చంపేస్తే
రాముడి పని మీద తిరుగుతున్న వానరులకి మాటసాయం చేసినంత మాత్రాన సంపాతికి కాలిపోయిన రెక్కలు ఎందుకు వచ్చాయో చెప్పరు.
రాముడి పని మీద వెల్తున్న వాడి కోసం తన రెక్కలు పోతాయని తెలిసీ మైనాకుడు ఎందుకు బయటకు వచ్చాడో చెప్పరు. రామాయణం లో ఎంతో తెలివైనదిగా,పతివ్రతగా పేరు గాంచిన తార కూడా రాముడిని పల్లెత్తు మాట ఎందుకనలేదో చెప్పరు.
నా భర్త ధర్మం తప్పని వాడైతే హనుమ తోకకు ఏమీ కాకూడదు అని సీతమ్మ అడిగితే అగ్ని హనుమను ఎందుకు దహించలేదో చెప్పరు.
పైన చెప్పిన లక్ష్మణ మూర్తి శపధం ఎందుకు విఫలం కాలేదో చెప్పరు.


కాదూ వాల్మీకి రాసినవన్నీ నమ్ముతామా , మాకు నచ్చినవీ, రామాయణంలో మాకు ఇది నచ్చలేదు అని చెప్పుకోవడానికి అనువుగా ఉండేవి మాత్రమే నమ్ముతాము అంటే చెప్పేదేమీ లేదు. వాలిని,శంభూకుడిని చంపాడు, సీతని అగ్ని ప్రవేశం చేయించాడు, అడవులకి పంపాడు ఇలాంటివి మాత్రమే నిజాలు మిగతావి కాదు అంటే ఈ వ్యాఖ్యని మీరన్నా డిలీట్ చేసెయ్యండి, లేదా నేనన్నా డిలీట్ చేసేస్తాను. ఎందుకంటే మనం ఒకరితో ఆర్గ్యుమెంట్ చేస్తున్నాము అంటే దానికొక బేస్ కావాలి. ఇక్కడ ఆ బేస్ వాల్మీకి రామాయణం నిజం అనో లేదా అబద్దం అనో కావాలి. అంతే కానీ ...................

"ఈ పుస్తకం చదివేనాటికే నాకు భక్తి విశ్వాసాలు లేకపోవటం వల్ల ఆ పుస్తకాన్ని పూర్తి సానుకూల దృష్టితో చదవగలిగాను."
కానీ రెండో వైపున తమ జీవితాలకి రామయణ రహస్యాలని సామాన్య్లులకి అందించడమే పరమావధి అని త్రికరణశుద్ధిగా భావించి యేళ్ళకేళ్ళు వేదంలో , ఉపనిషత్తులలో, గీతలో పరిశోధన చేసి ప్రవచనాలు చేసి తరించిన వాళ్ళున్నారు. వాళ్ళ పుస్తకాలు కూడా చదవండి. అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోండి.

ఎందుకంటే రేపు పొద్దున ఆ రచయిత/రచయిత్రి మనసు మారి వాల్మీకి చెప్పిందే కరెక్ట్ అన్నారనుకోండి, అప్పుడు మీరు ఎటు వైపు నిలబడతారు. అలా జరగదు అని మీరనేటట్టయితే ఒక్కసారి చలం గారిని గుర్తు చేసుకోండి. జీవితమంతా స్త్రీ స్వేచ్ఛ, నాస్తికత్వం గురించి మాట్లాడిన మనిషి అవసాన దశలో రమణాశ్రమం లో స్ఢిరపడిపోయాడు. ఎంతగా అంటే అక్కడి నుండి బయటికి రావాలంటే ప్రాణాలు గిలగిలలాడిపోయేటంతగా.

అలాగే ఒక్కసారి రామాయణాన్ని కానీ, మనసా వాచా కర్మణా రాముణ్ణే నమ్మ్ముకున్న ( గుడ్డిగా కాదు, లోకాభిరాముడని అర్ధం చేసుకుని) వాళ్ళు (శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి వారు ,చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు)రాసిన వ్యాఖ్యానాలను కానీ చదవండి.

అప్పుడు మీ నిర్ణయం మీరు తీసుకోండి. అది సహేతుకం. ఇప్పుడు కూడా నేను రాముణ్ణి సమర్ధించడానికి ఇది రాయలేదు. అలా చెప్పడం నా సిద్ధాంతానికి వ్యతిరేకం. స్వయంగా తెలుసుకోండి. అప్పుడు మీ నిర్ణయం లో ఒక రకమైన సాధికారత ఉంటుంది.

సహాయక గ్రంధాలు/ఇతరాలు
రామాయణం-- తత్వదీపిక(శ్రీ భాష్యం అప్పలాచార్య స్వామి)
రామాయణ ప్రవచనం( శ్రీ భాష్యం అప్పలాచార్యస్వామి, చాగంటి కోటేశ్వరరావు గారు)
సుందర మారుతి
శ్రీ అన్నదానం చిదంబరశాస్త్రి గారి పుస్తకాలు
-------
భారతం గురించి నాకు అంతగా అవగాహన లేదు. అందువల్ల రామాయణానికి మాత్రమే పరిమితమయ్యాను.

Saturday, June 26, 2010

వేయి పడగల నీడలో నేను - ౩

జై శ్రీ రామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!
చాలారోజుల తర్వాత వేయి పడగల జ్ఞాపకాల దొంతరను కౌటిల్య గారు కదిలించారు. సరే వేయి పడగలతో నా అనుబంధాన్ని గుర్తు చేసుకుందామని ఈ పోస్ట్ రాస్తున్నాను.

అసలు గ్రాంధికం మనం చదవగలమా లేదా అని ఉన్నరోజుల్లో ఈ పుస్తకం చదవడం జరిగింది. మొదట భావం కోసం చదివాను.రెండోసారి భాష కోసం చదివాను. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణంతో చదివాను. అన్నింటికన్నా నాకు చాలానచ్చినవి కళ్యాణోత్సవాలే. అందులో గోపికయై తల్లి గిరిక వెతుకుతూ చెట్టునూ పుట్టనూ అడగడం , ఆ పద్యాలు నాకెంతో ఇష్టం అప్పట్లో. అందులో ఒకగద్యం ఉండేది. అన్ని పూల చెట్లు,పళ్ళ చెట్ల పేర్లు ఉండేవి. అలాగే "పున్నాగ కానవే, పున్నాగవందితు! తిలకంబ కానవే తిలకనిటులు" అనేపద్యం చాలా బాగుండేది. భాగవతంలోనివని అప్పుడు తెలియదు కానీ ఏదో సంబరంగా ఉండేది ఆ పదాలూ అవీ చదువుతూ ఉంటే. "..సఖీజన వంచితమహం..." అనే అష్టపది కూడా ఉండేది. ఇక అసలు పద్యం "నల్లని వాడు పద్మ నయనమ్ములవాడు" అప్పటికి పాత సాహిత్యంలో పేర్లే గాని విషయం తెలియదాయె. ఆయనేమో ఎప్పుడు చెప్పినా మొదటి పాదం చెప్పి ఊరుకునేవాడు. ఇక చూస్కోండి. ఎవరినైనా అడుగుదామంటే నా సర్కిల్ లో ఎవరికీ తెలియదాయె. అలా రెండుసంవత్సరాలు గడిపేసాక బ్లాగుల పుణ్యమా అని తెలుసుకున్నాను. అసలు ఆ పదబంధాలే వింతగా ఉండేవి. అలాగే "శాస్త్ర ద్రష్టయే గాని శాస్త్ర స్రష్ట గాడు" లాంటి వాక్యాలు కొత్తగా ఉండేవి.
మూడు వందలు యేళ్ళు వేయి పడగలకింద సురక్షితం గా భూమ్యాకాశాలకూ,మంచీ చెడులకూ , మర్త్యామర్త్యాలకూ మధ్య స్థిరంగా నిలిచిన నాలుగు స్థంబాల మంటపం ,చివరికి రెండు పడగల కింద,రెండు స్థంబాలమీద నిల్చున్న స్థితికి సాక్షీభూతం గా నిల్చోబెట్టేస్తారు విశ్వనాథ గారు మనలని. మనలనే నిర్ణయించుకోమన్నట్టుండేది ఆ రెండు పడగలనన్నా స్వామి ఉపసంహరించుకోకుండా కాపాడుకోవడానికి ఏం చెయ్యాలో.
మనం చదివే ప్రతీ పుస్తకం ప్రత్యక్షంగానో పరోక్షంగానో మన మీద ప్రభావం చూపుతుందన్నది నిజం. ఏదో ఒక సిద్ధాంతం మీదనో , విషయం మీదనో అది మన మనసును ప్రభావితం చేస్తుంది. కానీ అన్ని మానవీయ సంబంధాల పట్ల పాఠకుడి దృక్కోణాన్ని మార్చగల శక్తి రామాయణం తర్వాత వేయిపడగలకుందని నా నమ్మకం. ముఖ్యంగా ప్రేమ, పెళ్ళి.
అలాగే మనం చదివే ప్రతి పుస్తకం, తర్వాత మనం ఎలాంటి సాహిత్యం చదువుతాము అనేది కూడా నిర్ణయించుకోవడానికి గీటురాయి అవుతుందని నా అభిప్రాయం. వేయి పడగలు చదివాక ఆ స్థాయి పుస్తకం కోసం చూస్తాం కానీ మామూలు పుస్తకాలు చదవాలని అనిపించదు. సహజకవి చెప్పినట్టు మందార మాధుర్యముల దేలు మధుపమ్ము పోవునే మదనములకు అన్నట్టు అయిపోతుంది.

ఇంకెందుకాలశ్యం ఎక్కడో హృదయపు అట్టడుగు పొరల్లో కూరుకుపోతున్న మీలోని పాఠకుడిని వేయి పడగలు ఊతమిచ్చి పైకి లేపండి. నా తరం లో చాలా మందికి వేయి పడగలు పేరే తప్ప కనీసం ఏముందో కూడా తెలియదు.కొంతమందికి ఎక్కడో విన్న గుర్తు. కొంతమందికి ఆ అదృష్టంకూడా లేదు. నా ఉద్దేశ్యంలో వేయి పడగల గురించి అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వెయ్యి సంవత్సరాలు మనవలసిన దీపాన్ని వంద సంవత్సరాలకే కొండెక్కకుండా , ఆ దీప కాంతుల్లో జీవితాన్ని ఎలా వెలిగించుకోవచ్చో తర్వాతి తరాలకు చెప్దాం రండి.

Thursday, June 24, 2010

రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

జై శ్రీరామ్,
శ్రీ రామదూతం శిరసా నమామి!

సురాసురుల మధ్య తగవు తీర్చడానికీ, సురలకు అమృతాన్ని ఇవ్వడానికి ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు ఆడిన వింత నాటకమే మోహినీ అవతారం. ఈ అవతారం మరొక ప్రయోజనం మణికంఠ స్వామి జననం. మోహినీ రూపం దాల్చిన ఆ పరంజ్యోతిని శంకరుడు అనుసరిస్తే
అదే "రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!" అయ్యింది. పరమాత్మ అనుగ్రహంతో ఒకటి రాసిన తర్వాత శంకరుడినే మోహింపజేయగల మోహినీదేవి అవతారం లోకాన్ని కదిలించదా అనిపించింది(అనిపించేది ఎవరికి, అనిపింపచేసేది ఎవరు?).అలా ఆ స్వామి రాయించినవి మిగతావి.
వీటికి చంధో బద్దత లేదు, కానీ మనో నిబద్దత ఉంది
వాక్యశుద్ధి లేకపోవచ్చు, కానీ అంతఃకరణ శుద్ధి ఉంది.
పురుషుడూ,ప్రకృతీ అన్నీ తానే అయ్యి ఆటలాడే ఆ నిర్గుణ పరబ్రహ్మ ని శబ్దం ద్వారా స్పర్శించాలనీ,దర్శించాలనీ చేసిన చిన్న ప్రయత్నం.అంతే తప్ప శారదా పుత్రుల్ని గేళి చేయడానికి మాత్రం కాదు. సలహాలిస్తే చంధస్సులు నేర్చుకొని ఆ పరమాత్మ గుణగణాలను గాన చెయ్యాలని కోరిక.

నాగారివాహన నారాయణుండు,అసు
రగణమచ్చెరువొంద,సుర రక్షణకై ముద
ముగ మోహినిగాగ,భామయైన బావనుగని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్|

గగన మండలమ్మంత కాంత మేని ఛాయ ముప్పిరిగొనంగ, సురగ
ణాంగనలంబరవీధి చేరి కన్నులింతగ చేసి లోకోత్తర సౌందర్యమున్ చూ
డగ రాగ,భువనభాండముల్ గుసగుసలాడుచుండ,భామయైన బావనుగని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్|

వజ్రముల్ విసుగెత్తి పలికె,తమకేది అంతటి వన్నె యని,
వైఢూర్యముల్ వదలక వదరుచుండె, ఇది ఎచ్చటి వెలుగని,
మౌక్తికముల్ మారు మాటాడక యుండె, మునుపెన్నడు ఇది గనమని,
నవరత్నముల్ నోరాడక యుండె, ఇక తమనెవ్వరు తలపరని,
అన్ని రత్నముల కాంతిని,
అన్ని లోకముల శాంతినపహరింపనొప్పు
వెన్నుడు మోహిని గాగ, జూచి
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

సృష్టి ధర్మముగ దివా సంధ్యా నివర్తకుండైన రవిని
వ్యష్టిపరచగ,ముల్లోకమ్ముల తిమిరమ్మును
నష్టపరచ, లోకమ్ముల దీపించుచున్న మోహిని గని
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

జగత్ప్రళయమో, త్రిశంకు స్వర్గ చంద్రబింబమో యటంచు
నగరాజాధిపు యల్లుడి జటన చేరి సోముడు చాటుగ
దాగి చూడగ, చంద్రబింబ సమభాసమునొప్పు మోహిని గని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

ముక్కెరకాంతులు మూడు లోకమ్ముల ముప్పిరిగొనంగ,
ఎక్కడివీ కాంతులనుచు మూడు లోకమ్ముల జనులు మ్రాన్పడగ,
రక్కసులనుండి సుధను, మూడు లోకమ్ముల గావగ దిగిన కాంతను గని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

శుభములు దేవాళికిన్ శుభకరముగనిచ్చు విభుడు మోహిని గాగ,
శుభములు మానవాళికిచ్చు,శుభగుడు శోభనమొప్ప మోహిని గాగ,
శుభముగ సుధను,సురలకీయ ఖగరాజపతి వేగ మోహిని గాగ,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

విరిచూపుల అరివీరుల యశమును వ్యర్ధము గావించుచు,
తరగని తమకమునభినయించి తామసుల దరి జేరుచు,
కరివాహనగణమున్ అమరుల జేయ సుధనిచ్చునువిధగని,
రంగా యనుచు లింగడు గంగవెర్రులెత్తెన్!

Sunday, June 13, 2010

రామ నీల మేఘ శ్యామా కోదండరామా!

శ్రీ రామదూతం శిరసా నమామి!

భీకరమౌ శ్రీరామ బాణం

శ్రీయుతమౌ శ్రీరామపాదం

భీషణమౌ శ్రీరామ శపథం

శ్రీకరమౌ శ్రీరామ నామం