Saturday, September 15, 2012

మరువబోకు మానవుడా మమత వీడరా

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
రామాయణంలో చాలాసార్లు, వాల్మీకి మహర్షులు జంతువులతో పోలిక చెప్పారు.సింహ మధ్య అనీ, శార్దూల విక్రముడనీ ఇలా. కొన్ని విచిత్రమైన పోలికలు ఈ రోజు.
సుందరకాండలో స్వామి లంకాప్రవేశం చేసేముందు తన శరీరప్రమాణాన్ని చాలా తగ్గించారు. ఎంత అంటే పిల్లిపిల్ల అంతగా తగ్గించారు. ఇంతవరకూ చెప్పి ఊరుకోలేదు మహర్షి. "భభూవాద్భుత దర్శనః" అని విడిచిపెట్టారు. దర్శన సామర్ధ్యం చాలాబాగా ఉన్న పిల్లి ప్రమాణానికి తన శరీరాన్ని తగ్గించారు అని చెప్పి మెలిక పెట్టారు. ఇంతేనా ఈ మాటకర్ధం? కాదన్నారు పెద్దలు. గురువుగారు చాలాసార్లు చెప్తూ ఉండేవారు, రామాయణాన్ని రకరకాల కోణాల్లోనుండి అర్ధం చేసుకోవచ్చు అని. అప్పలాచార్య స్వామి వారు కూడా రామాయణాన్ని కావ్యంగా, కధగా, తత్వశాస్త్రంగా మూడురకాలుగా చూడవచ్చు, చూడాలి అని చెప్పేవారు.
 అలా చూస్తే, అప్పుడు అద్భుతం అనేమాట కీలకమౌతుంది. అధ్బుతం అనేమాటకి  భగవంతుడు అని అర్ధం ఉన్నదని శ్రీభాష్యం వారు ఒకసారి చెప్పారు. అలాంటి అధ్బుతమైన దాన్ని దర్శించడానికి వెళ్తున్నాడు అని చెప్పకనే చెప్తున్నారు. ఇక అలాంటి అద్భుతాన్ని చూడడం సాధ్యమయ్యేది, మనలని మనం తగ్గించుకున్నప్పుడే. నేను అనే భావనని తగ్గించుకుంటేనే. నిన్ను నువ్వు తగ్గించుకుంటే తరుగు లేని అద్భుతాన్ని దర్శించడానికి అర్హతని సంపాదించుకున్నట్టే అని సుందరకాండ సందేశం.

బైబిల్ లో ఒకమాట ఉంటుంది, "తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గించబడును"  ఇదే స్వామి సుందరకాండలో చేసి చూపించారు, వాల్మీకి రాసి చూపించారు. ఆత్మ దర్శనానికి వెళ్ళేవాడు దేహాభిమానాన్ని ఎంత తగ్గించుకోవాలో చెప్పే శ్లోకం ఇది.
సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః!
పృషదంశక మాత్రస్సన్ భభూవాద్భుత దర్శనః!!
ఇక రాత్రి అనేదాని గురించి గీతాచార్యులు చెప్పేవారు ఉన్నారు. మాములు వారికి పగలు, జ్ఞానికి రాత్రి, మాములు వారికి రాత్రి జ్ఞానికి పగలు. బాహ్యార్ధంగా చూస్తే మామూలు జనాలు నిద్రించేటప్పుడు జ్ఞాని మేల్కొని ఉంటాడు అని అర్ధం వస్తుంది. కానీ అంతరార్ధం కోసం పెద్దలు చెప్పిన వ్యాఖ్యానాలు చూస్తే మరో విషయం తెలుస్తుంది. మామూలు మనిషి పగటిపూట వేటిని చూసి ఆనందపడతాడో వాటిని జ్ఞాని పట్టించుకోడు, మామూలు మనిషి పట్టించుకోని భగవంతుని మాత్రం జ్ఞాని ఎప్పుడూ దర్శిస్తూ ఉంటాడు.
ఇలా చాలా ఉన్నాయి. అసలు ప్రకృతిలో ప్రతి వస్తువు, ప్రతి జంతువు ఏదో ఒక సందేశాన్ని ఇస్తూనే ఉంటుంది. మనం తెలుసుకోగలమో లేదో అని ఋషులు సరళం గా వాటిని కావ్యాలుగా, పురాణాలుగా, ఇతిహాసాలుగా ఇచ్చారు. ఇవి కూడా అర్ధం చేసుకోలేకపోతే అని రామనామాన్ని ఇచ్చారు. రామ రామ రామ అని జపిస్తుంటే ప్రకృతి మాయ పొరలు పొరలుగా విడిపోతుంది. అన్నీ వాటంతటే అవే ద్యోతకమవుతాయి. జ్ఞాని ప్రయత్నపూర్వకంగా తెలుసుకుంటే, భక్తుడు అప్రయత్నంగా, భగవంతుని విభూతిగా దేన్నైనా అర్ధం చేసుకోగలడు.  ఉదాహరణకి ఒక చీమ చూడండి. ఎన్ని సార్లు కిందపడ్డా తన గమ్యం చేరేవరకూ వదలదు. పొద్దున్నుండీ, సాయంత్రం దాకా అయినా ప్రయత్నిస్తూనే ఉంటుంది. తనకేదన్నా దొరికితే అందరికీ చెప్పి అందరినీ తీసుకొస్తుంది. మొత్తం నాకే అని ఊరుకోదు. సద్గురువులు కూడా అంతే. తాము కష్టపడి సాధించిన జ్ఞానాన్ని దాచుకోరు. అర్హుడైన శిష్యుడు దొరికితే ఆ అమృతవాణి  గంగా ప్రవాహంలా వెలివడి లోకాన్ని ఉద్ధరిస్తుంది. 
ఒక శక్తి ప్రయోగం నేర్చుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. కానీ ఒక పదిలక్షలసార్లు రామనామజపం చేస్తే ఏ శక్తి నైనా ఎదుర్కోవచ్చు. రామనామం, మనసుని ప్రశాంతం చేస్తుంది. తమస్సుతో నిండి ఉండే మనస్సనే నది, స్వచ్చంగా ఎలా వాల్మీకి కి దర్శనమిచ్చిందో అలా మన మనస్సే మనకు అద్దమై మనమేంటో చూపిస్తుంది. లోకమేంటో చూపిస్తుంది. లోకంలో సాధించాల్సింది ఏమిటో చూపిస్తుంది. ఎలా సాధించాలో చూపిస్తుంది.ఏది అడ్డమో చూపిస్తుంది. నిజానికి పంచాంగ చూడటంలో కూడా అర్ధం ఇదేనని పెద్దలు చెప్పారు. నేనెవరిని, ఎవరికి చెందినవాడిని, ఏమి సాధించాలి, ఎలా సాధించాలి, ఏమిటి అడ్డు అనే ఐదింటిని గురించి నిత్యం ఆలోచించమని పంచాంగం చెప్తుందట. మనం కూడా ఆ ఆలోచనని పెంచుకుని రామనామాన్ని మనసులో నింపుకుని జీవన్ముక్తులౌదాము.


నా భార్యకి పండరి భజన నేర్పిన గురువులు పల్లా వెంకటేశ్వర్లు గారు పాడిన ఒక పాట.
మరువబోకు మానవుడా మమత వీడరా!(౩)
ఆ మమత వీడి రామనామ స్మరణ చేయరా!
స్వామి స్మరణ చేయరా,స్వామి స్మరణ చేయరా

రామనామ స్మరణ చేసి ఆత్మసుఖము పొందరా!
ఆత్మసుఖము కన్న మరి పుణ్యమే లేదురా!!

మానవధర్మమ్ము వదిలి దానవుడవు కాకురా!
మాయకు లోబడితె నీవు మానవుడవు కావురా!!

ఒహో!! ఉన్నదానితోనే నీవు తృప్తి పొంది సుఖపడరా!
తృప్తి లేని మానవుడా, భస్మమై పోదువురా!!

అయ్యో!! నాది నీది యనే మూఢ తత్వము విడనాడరా!
వెదకి చూడ జగతిలోన ఏది నీది కాదురా!!


మరువబోకు మానవుడా మమత వీడరా!
ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!

అయ్యో!! అప్పుడిప్పుడనగరాదు ఎప్పుడు ఏ వేళలో !
ఓ! తనువు వెళ్ళె వేళలోన దగ్గరెవ్వరుండరురా!!

అయ్యో!! ఆలుబిడ్డలన్నదమ్ములు, వెంట ఎవరు రారురా!(౨)
వదలలేక వచ్చినా వల్లకాటివరకేరా!!


మరువబోకు మానవుడా మమత వీడరా!
ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!

చుట్టు నాల్గు గోడలలో ఇమిడి ఉన్న పుట్టరా!
పుట్టలోన తాచుపాము బుసలు కొట్టుచుండురా!!

అయ్యో!! కట్టెలే చుట్టాలురా, కాష్టమే ఇల్లురా!

ఓహో!! కట్టెలే చుట్టాలురా, కాష్టమే ఇల్లురా!
 అగ్నిదేవుడే మనకు ఆత్మబంధుడురా!!

హరేరామ హరేరామ హరేరామ యనరా!
హరేరామ యనినంతనే హరియించును పాపములు!!


మరువబోకు మానవుడా మమత వీడరా!

ఆ మమత విడచి రామనామ స్మరణ చేయరా!!
స్వామి స్మరణ చేయరా,స్వామి స్మరణ చేయరా !!


సర్వం శ్రీ సీతారామ చంద్ర పరదేవతా పరబ్రహ్మార్పణ మస్తు..