Thursday, May 26, 2011

శ్రీమత్సుందరకాండ

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

తప్పో ఒప్పో, నియమంగానో కాదో, మొత్తానికి జీవితంలో ఒక గొప్ప పని సాధించానన్న తృప్తి కలిగింది ఈ రోజు ఉదయం.
"సర్వం శ్రీసీతారామచంద్ర పరదేవతా పరబ్రహ్మార్పణమస్తు" అంటూ సుందరకాండ మూడవ ఆవృత్తి పూర్తి చేసి స్వామికి నివేదించుకుంటూ ఉంటే.


పోయిన సంవత్సరం అతి కష్టమ్మీద సుందరకాండ రెండు సార్లు పారాయణ చెయ్యగలిగాను. ఈ సారి ఎలాగైనా మూడు సార్లు చెయ్యాలని అనుకున్నాను. అంతలోనే వసంత నెలతప్పడం , సందేహాలమీద సందేహాలు. ఇక ఈ సంవత్సరం కుదరదేమో అని అనుకుంటు ఉండగా, మాస్టరుగారి నుండి ఆదేశం ఈసారి మరింత శక్తివంతంగా హనుమద్రక్షాయాగం జరగాలని .అందుకు అన్ని హనుమత్ స్తోత్రాలతోనూ యాగాన్ని అనుసంధానించాలని, అందులో భాగంగా నన్ను సుందరకాండ చెయ్యమని .. చెయ్యగలనో లేదో అనుకుంటునే మొదలుపెట్టాను, నాకు పారాయణ చేసే అదృష్టం ఉంటే ఆ స్వామి చూసుకుంటారు అని. మొదలుపెట్టిన పది రోజులకి విజయవాడ వెల్లాల్సి వచ్చింది. అక్కడ ఎలా చదవడం, ఇప్పటికే కొంచెం ఎగతాళి గా మాట్లాడుతున్నారు నీకెందుకురా ఇవన్నీ అని, ఇక సుందరకాండ తీసుకెళ్ళి పారాయణ చేస్తే గోల గోల అయిపోతుందని భయపడ్డాను. సరే ఏదైతే అదే అయ్యిందని తీసుకెళ్ళాను. ఇంట్లో చదవకుండా గుడికి వెళ్ళి చదువుదామనుకున్నా. కానీ హోరుమని వాన (ఎండాకాలంలో) . ఇంట్లో గొడుగుకూడా లేదు, చివరికి ఇంట్లోనే పారాయణ చేసాను. విచిత్రం మా వాళ్ళు ఒక్క మాట కూడా అనలేదు పారాయణ గురించి, పైగా చేస్తున్నంతసేపూ డిస్టర్బ్ చెయ్యకుండా సైలెంట్ గా ఉన్నారు.తర్వాత ఎప్పుడు వెల్తున్నావు వినుకొండకి, అని వివరాలు అడిగి కనుక్కొన్నారు. అప్పుడు అర్ధం అయ్యింది అర్ధం లేని నా భయాల్ని దూరం చెయ్యడానికే స్వామి ఈ గేమ్ ఆడారని.

సుందరకాండ పారాయణ చేస్తే ఏదో ఫలితాలు కలుగుతాయని అంటారు కానీ నావరకైతే సుందరకాండ పారాయణ చెయ్యగలగడమే పెద్ద ఫలం. ఎంత అనుకుంటే మాత్రం చెయ్యగలం చెప్పండి? నావరకు స్వామి సుందరకాండ ఇచ్చి ఆరు, ఏడు సంవత్సారాలయ్యింది. రోజూ దణ్ణం పెట్టుకునేవాడిని కానీ ఐదేళ్ళకి గానీ తెరిచి పారాయ చెయ్యలేకపోయాను. ఆ స్వామి అనుమతి, అనుగ్రహం కూడా ఉండాలి కదా.భాగవతంలో యశోదమ్మ , "ఏ సిద్ధాశ్రమములన్ తొక్కితిమో, ఎవ్వరికి ఏమి పెట్టితిమో" ఈ నాడు మన బిడ్డ ఈ ఉత్పాతలనుండి తప్పించుకున్నాడు అన్నట్టు, ఏ పుణ్యశేషమో మిగిలిఉండబట్టి ఇంతమంది మార్గదర్శకులైన పెద్దవాళ్ళ దగ్గర రామాయణాదుల గురించి తెలుసుకునే అదృష్టం కలిగింది. విన్నది చాలు ఇక చదువు పూర్తిగా తెలుసుంటావు అన్నట్టు , 2010 జనవరిలో ఒకనాడు శ్రీభాష్యం అప్పలాచార్యస్వామి వారి సుందరకాండ ప్రవచనం వింటుంటే ఆయన ఒక మాట అన్నారు.
"సంస్కృతం రాదని అనకండి.కర్త, కర్మ. క్రియ శబ్దస్వరూపం తెలిస్తే రామాయణం , భగవద్గీత సులభంగా అర్ధమవుతాయి, ఇంతకంటే సులభంగా ఇక ఎవ్వరు రాయలేరు, స్వామి మనల్ని అనుగ్రహించి సులభంగా తనను చేరడానికి ఇచ్చిన మందులివి రెండూ, అలాంటివాటిని సంస్కృతంలో ఉన్నాయని వంక పెట్టి వదిలెయ్యద్దు. మొదట్లో కొంచెం కష్టం గా ఉండచ్చు , కానీ పోనూ పోనూ అదే అలవాటవుతుంది ఇందులో ఎక్కడా పెద్ద పెద్ద సమాసాలుండవు." అని.
అప్పుడు అనిపించింది ఒక్కసారి ప్రయత్నించి చూద్దామని . తర్వాతి రోజే పారాయణ మొదలుపెట్టాను. ఇప్పటికి ఐదు సార్లు పారాయణ చేసాను ఈ రెండు సంవత్సరాల్లో.ఒక్కొక్కటిగా నా బలహీనతలనన్నింటినీ నాకు చూపించారు స్వామి.ఇప్పటికీ ఏదన్నా తప్పుచేస్తే ప్రమధితవ్యం, ప్రమధితవ్యం అని హెచ్చరిస్తూనే ఉన్నారు.

రేపే హనుమజ్జయంతి, ఎల్లుండి పూర్ణాహుతి . రెండు సంవత్సరాలు ఎదురుచూసాను హనుమాన్ జయంతికి పీఠంలో ఉండాలని. ఇప్పటికే పీఠంలో చాలామంది బ్రహ్మచారులున్నారు(అయ్యప్ప, స్వామి,...) ఇంకో బ్రహ్మచారి అవసరంలేదని చివరికి గృహస్తుగా అనుమతించారు స్వామి. మీరు కూడా రండి, స్వామి వారిని దర్శించుకుని స్వామి కృపకి పాత్రులవుదాము.
యాగంలో పాల్గొనాలనుకుంటే సంప్రదించాల్సిన నంబర్లు

౯౯౪౮౨౩౫౬౪౧(9948235641) -దుర్గేశ్వర గారు

1 comment:

friendfinder said...

జై శ్రీ రామ్.
భాగస్వామ్య ధన్యవాదాలు .. పోస్ట్ ధన్యవాదాలు.
cheap web designer