Wednesday, May 13, 2015

హనుమజ్జయంతి 2015

 
జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!
2009 లో అనుకుంటా మొదటిసారి వినుకొండకి హనుమద్రక్షాయాగానికి వెళ్ళడం జరిగింది.  అప్పటినుండి ప్రతి సంవత్సరం వెళ్తునే ఉన్నాను. అదొక అలౌకిక అనుభూతి. స్వామికి నా చేతులతో అభిషేకం చేసి అలంకరించే భాగ్యం కోటి జన్మలకైనా దొరకదు. రెండురోజులు మామూలు విషయాలకు దూరంగా హనుమద్వైభవాన్ని చూస్తూ గడిపే అదృష్టం స్వామి గత ఆరు సంవత్సరాలుగా ప్రసాదించారు. వెళ్తూనే తలస్నానాలు చేసి అమ్మవారికి, స్వామి వార్లకీ,  పూజ చేసి మహా నైవేద్యం చెయ్యడం, తర్వాత అల్పాహారం. తర్వాత సంవత్సరం స్వామి ఎలా చేపిస్తారో అని అనుకుంటూ గడపడం. సాయంత్రం, రక్షలు తయారు చెయ్యడం, యాగకుండాలు తయారు చెయ్యడం, అప్పటివరకూ గోత్రనామాలు పంపిన వారి పేర్లు నోట్ చేస్కోవడం ఇలా మొదటిరోజు అయిపోయేది. తర్వాత రోజు ఇక సందడి, పొద్దున్నే కరెంట్ పోయే లోపు 108 కలశాలు తయారు చెయ్యాలి. ఒకసారి మా నాగప్రసాద్ అనుకుంటా, మోటర్ వేస్తారు కదా నీళ్ళు వాడి శుభ్రం చేద్దాం అని మీన మేషాలు లెక్కెట్టించాడు, చివరికి పనీ పూర్తవ్వలేదు, కరెంటూ పోయింది. ఇక అప్పటికప్పుడు బోరింగ్ దగ్గరికి పోయి నీళ్ళు పట్టుకువచ్చి కలశాలు తయారుచేసాం. ఎవరో ఒకతల్లి కూడా సహాయం చేసింది. పూజాద్రవ్యాలకి ఎడమచెయ్యి తగలకూడదని ముందే మాష్టరు గారు హెచ్చరించేవారు.  తర్వాత స్వామికి అభిషేకాలు. ఇక అభిషేకాలప్పుడు చూడాలి. అంతెత్తు నిలబడ్డ స్వామికి స్నానం చేపించడమంటే మాటలా! పూజ్యగురువులు చాగంటివారు అంటారు విశ్వవ్యాపకుడైన స్వామికి మనం ఏం కైంకర్యం చెయ్యగలము అని. అది కళ్ళెదుట కనిపిస్తున్నట్టు ఉండేది. "యధా రాఘవ నిర్ముక్త శరశ్స్వసన విక్రమః, గచ్చేత్వద్గమిష్యామి లంకాం రావణపాలితాం" అని చెప్పి నిలబడ్డ స్వామి గుర్తొస్తారు ప్రతిసారి అభిషేకాలప్పుడు. ఇలా అభిషేకాలు జరుగుతున్నంతసేపూ విశాఖపట్నం నుంచి వచ్చిన బాబూరావుగారు ఏదో ఒక కీర్తన పాడుతునే ఉండేవారు. అసలే పొగిడితే పెరిగే స్వామి! అందులోనూ పాడుతున్నది MS Ramarao గారి దగ్గర సుందరకాండ నేర్చుకున్న వ్యక్తి. మామూలుగా ఉన్నప్పుడు ఆయన వయసు తెలిసేది కానీ, కీర్తన మొదలుపెట్టారంటే అలా వింటూ ఉండిపోవలనిపిస్తుంది. అలసటా, ఆయాసం ఏమీ అడ్డు వచ్చేవి కాదు. స్వామి హనుమ స్వయంగా సామగాన ధురంధరుడు, అలాంటిది  ఆయనకి భక్తుడు పాడితే ఇలానే ఉంటుంది అనిపిస్తుంది. అభిషేకాలు ఇలా జరుగుతూ ఉంటే ఎంత బాగుండో కదా అనిపిస్తూ ఉంటుంది. కానీ స్వామి కి జలుబు చేస్తుందని ఆపేసేవాళ్ళం.       
 
ఇక తర్వాత పొడ లేకుండా తుడిచి సింధూరం లేపనం చేస్తుంటే చూడాలి.
 
పంచశీర్షామివోరగా అని కీర్తించబడ్డ చేతులు,
ఉరయాపాస జీమూతమివమారుతః అని కీర్తించబడ్డ వక్షస్థలం
బాహుభ్యాం స్థంభయామాస అని కీర్తించబడ్డ భుజాలు,
పరిఘసన్నిభౌ అని కీర్తించబడ్డ తొడలు,
పరమపావనమైన ఆయన పాదాలు.... ఇలా శుభ్రంగా తుడిచి పూలతో అలంకరించేవాళ్ళం.   
 
తరువాత, అంత స్వామి కి అంత గజమాల ధరింప జేసేవాళ్ళం.
 
లోపు కళ్యాణానికి శివపార్వతుల మూర్తులని శుభ్రం చేసేవాళ్ళం. పొయిన సారి అనుకుంటా నేను చాలా సీరియస్ గా  పని చేసుకుంటుంటే మైథిలి వచ్చింది. ఏం చేస్తున్నావు నాన్నా అనింది. స్వామికి స్నానం చేపిస్తున్నా అని చెప్పా. సబ్బు ఎక్కువ పుయ్యకు కళ్ళు మండుతాయి అని చెప్పి చూస్తూ కూర్చుండిపోయింది. భలే అబ్బురమనిపించింది. అందుకు కదా బెజ్జమహాదేవి కోసం పరమశివుడు పసిపిల్లాడైపోయాడు అనిపించింది. 
 
ఇక తరువాత యాగం. అన్నదానం చిదంబరశాస్త్రిగారి లాంటి హనుమదుపాసకుల ఆధ్వర్యంలో జరిగినప్పుడా యాగకీలల ఆనంద తాండవం చూడాలి. ఐదవసారి అనుకుంటా ముప్ఫైయేళ్ళు మేము కాడి మోసాము, ఇక మీ తరం ఎత్తుకోవాలి నాయనా అన్నారు. చాలా బాధనిపించింది. మధ్య నేను కార్యక్రమాలకి వెళ్ళడంలేదు, కానీ ఇక్కడికి మాత్రం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఇంతమంది యువత స్వామి కోసం చేస్తున్న పని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అన్నారు. వారు లేకుంటే ఆంధ్రలోకానికి పరాశరసంహిత ఇంత దగ్గర అయ్యుండేది కాదన్నది నిర్వివాదాంశం. వారు ఆనందించారంటే సాక్షాత్తు స్వామి ఆనందించినట్టే.
 
ఆరేళ్ళుగా జరుగుతున్న యాగమే అయినా ప్రతీసారి ఒక్కొక్కరకంగా జరిగింది.
ఒకసారి ద్వాదశకుండాలతో
ఒకసారి ఒకే కుండంలో
ఒకసారి 27 యజ్ఞ కుండాలలో 108 జంటలతో
ఒకసారి 27 యజ్ఞకుండాలలో 54 జంటలతో
ఇలా ఆయన ఇష్టం, ఎవరో ఒకరి నోట పలికిస్తాడు జరుగుతుంది.
యాగం జరుగుతున్నంతసేపూ చాలీసా పారాయణం జరుగుతూనే ఉండేది.
 
చివరగా బయలుదేరేముందు ఒక్కసారి స్వామి దగ్గరికి పోయి కూర్చునేవాడిని. నిన్నటి రోజున మన పక్కన తిరిగిన మనిషి రోజు హటాత్తుగా పెద్ద స్థితిమంతుడైపోతే ఎలా ఉంటుందో అలా అనిపించేది. నిన్న నిదానం గా స్నానం చేపించి, నిదానంగా సింధూరం పూసి, తక్కువపూలతో అలంకరణ చేసినా మా చేతుల్తో చేసాం అని తృప్తిగా ఉండేది.  అదే ఇప్పుడు చూస్తే చుట్టూ రంగు రంగుల పూలతో, పసుపు కుంకుమలతో, తమలపాకులతో, కొబ్బరికాయలతో మామిడాకులతో మా స్వామేనా అని సందేహం వచ్చేది. అప్పుడు చూడాలి నా స్వామిని శుచిస్మిత అయిన సీతమ్మలా, సర్వసత్త్వమనోహరుడైన రాముడిలా, సత్వస్వరూపమైన శివుడిలా, మంగళరూపమైన గౌరీదేవిలా, సృష్తికర్త యైన బ్రహ్మలా, జ్ఞాననిధి యైన సరస్వతిలా సర్వదేవతా స్వరూపంగా కనపడి ప్రశాంతంగా బయలుదేరేవాడిని.

 

 

 
 
 
ఇక ఈసారి, ఏడవసారి మరింత బ్రహ్మాండంగా ఏడు రోజుల కార్యక్రమంగా రూపుదిద్దుకుని శనిత్రయోదశి నాడు పూర్ణాహుతి నిర్ణయించబడింది. సముద్రం దగ్గరికి చెంబు పట్టుకెడితే చెంబుడు నీళ్ళే వస్తాయి, బిందె పట్టుకెలితే బిందెడు నీళ్ళు వస్తాయి అని పూజ్యులు చాగంటి వారు చెప్పేవారు. ఆన్సైట్ కావాలో అని ఆయన్ని వేధించి, సుందరకాండ చూపించి బ్లాక్మెయిల్ చేసి చివరికి దేశం కాని దేశం లో కూర్చుని ఇప్పుడు ఏడిస్తే ఏం లాభం అనిపిస్తుంది. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలేమో, ఏది వదులుకోవాలో తెలియక కావాల్సినదాన్ని వదులుకుని ఒక మిధ్యాప్రపంచంలో బతుకుతున్నామని తెలుసుకోడానికి నేను పెట్టిన పణం సారి జరుగుతున్న హనుమద్రక్షాయాగం. అక్కడ ఉంటే ఈపాటికి కలశాలు రెడీ చేసి ఉండేవాళ్ళం, పాటికి అభిషేకం అయిపోయేది, ఈ పాటికి భోజనాలు చేసేవాళ్ళు అందరూ, పాటికి కళ్యాణం అయిపోయేది, అని అనుకుంటూ ఉండాల్సొస్తుంది. కనీసం వచ్చే సారైనా హనుమజ్జయంతికి స్వామి పాదాల దగ్గర ఉండాలని కోరిక.
 
If anybody want to go on this Saturday(16th May2015) Pleasse contact durgeswara - 9948235641

Tuesday, February 17, 2015

అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.

శివుడెక్కడున్నాడంటూ తిరిగాను,
నీలో చూసుకున్నావా అని ఆ శివుడు అడిగేవరకూ

శివుడెవరని ఎందరెందరినో అడిగాను
నిన్ను నువ్వడగవేమని ఆ శివుడు అడిగేవరకూ

శివమంటే ఏమిటని ఎవరెవరినో అడిగాను,
నువ్వెవరని లోనుండి ఆ శివుడు అడిగేవరకూ

శివుడెలా ఉంటాడని అందరినీ అడిగాను,
ఎలా ఉండాలనుకుంటున్నావో చెప్పు అని ఆ శివుడు అడిగేవరకూ

శివుడెందుకని అందరినీ అడిగాను,
ఆలోచించు నువ్వుండగా నేనెందుకని ఆ శివుడు అడిగేవరకూ

మహా శివరాత్రి: చిన్నప్పుడు మహా శివరాత్రి అంటే జాగారం, అప్పుడు దూరదర్శన్ వాడు వేసే భక్తి సినిమాలు, ఎవడు ఎక్కువసేపు మేల్కొంటాడో అని పందాలు, పొద్దున్న లేచాక సన్నాయి నొక్కులు.
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది,
అదిగో అనంతమైన జ్ఞానలింగం ఆద్యంతాలు లేకుండా పెరిగిపోతుంది.
సాయంత్రం దాకా వెలుగునిచ్చిన సూర్యుడు, కోటి సూర్యుల పగిది వెలిగే ఆ మహా సూర్యుని ముందు దివిటీ అయినాడు.
సృష్టి చేసే బ్రహ్మ మరో సృష్టికోసం వలసిన తేజస్సును తీసుకుపోవడానికి వచ్చాడా అన్నట్టు భక్తి ప్రపత్తులతో నిలబడి ఉన్నాడు
ఈ మహా శక్తేనా బాణుడితో యుద్ధమొనరించినప్పుడు, లీలగా నేనోడినానని పలికినవాడు, ఈ మహా శక్తేనా తన భక్తుడైన రావణుడిని పరాభవించి సీత జాడ తెలిపినదని అబ్బురపడి చూచుచుండె విష్ణుమూర్తి
ఈ తేజస్సే కదా సమస్త విద్యలకూ ఆలవాలమైన డమరుకాన్ని ధరించేదని సరస్వతీదేవి ఆశ్చర్యముగా చూస్తూ నిలబడి పోయింది.

ఈ తేజస్సే కదా పుత్రసముడివలే నన్నూ నా స్వామిని కలిపినదని సాగర గర్భసంభూత, సలక్షణ జాత, దేవదేవ దివ్యమహిషి అప్యాయతతో అలా చూస్తూ ఉండిపోయింది.

ఇంతటి స్వామిలో, తేజస్సులో, సగభాగాన్ని కదా అని ఆ తల్లి సర్వ మంగళ మాంగళ్య, సర్వార్ధ సాధకి, గౌరి అలా రెప్పవాల్చకుండా నిలుచుందిపోయింది.

మాకోసం కదా ఇంతటి స్వామి విషాన్ని మింగి గరళ కంఠుడయ్యాడని సకల దేవగణమూ, అలా నిలిచిపోయింది

నిను సేవింపగ నాపదల్పొడమీ, నిత్యోత్సవంబబ్బనీ, జనమాత్రుండననీ, మోహంబు పైకొననీ అంటూ శివసాయుజ్యాన్ని పొందిన భక్త కోటి అంతా పరవశిస్తూ గానం చేస్తున్నారు.

అది ప్రకృతి పరమశివుడి ఆద్యంత రహితమైన అద్భుతమైన రూపాన్ని కన్నులారా చూస్తూ, చెవులారా వింటూ తానై శివుడై, శివుడే తానౌతున్న క్షణం.

అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
సూర్యుడివలె నిన్ను నువ్వు వెలిగించుకోవాలని, నలుగురికీ వెలుగునివ్వాలనీ లేదా అంటూ,
బ్రహ్మ వలె నువ్వు ఏం సృష్టించాలో చెప్పు అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నీ కోసం నేను హనుమంతుడినవ్వడానికి సిద్ధం , నువ్వు రాముడవ్వడానికి సిద్ధమేనా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
ఈ ఢమరు శబ్దమే నీలోంచి వస్తోంది విన్నావా, వినగలవా, వినడానికి సిద్ధమా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నిన్నూ నీలో ఉన్న నన్నూ కలిపేది నేనే, కలపగలిగేది నేనే, నువ్వు సిద్ధమా అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
నిన్ను నాలో సగం చేసుకోవడానికి నేను సిద్ధమే కానీ నీ మనసులో సగం కాదుకదా ఏ కొంచెమైనా ఖాళీ ఉందా ఉంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
సకలదేవగణాల రక్షణకోసం విషం మింగినవాడిని నీకోసం ఏమీ చెయ్యలేనా, కానీ నోరు తెరిచి అడగవెందుకని అంటూ,
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
శివసాయుజ్య సాధనా చతుర అశేష మునిగణమూ, అసామాన్య భక్తిగణమూ నీకు నా సులభత్వాన్ని బోధపరచడంలేదా అంటూ
అదే శివరాత్రి ఈ నీరవనిశీధిలో నన్ను ప్రశ్నిస్తోంది.
ప్రకృతి లో నువ్వు దేన్ని చూసినా నన్ను చూసినట్టే, చూస్తున్నట్టే, కానీ ఎందుకు ఒప్పుకోవడానికి సంకోచిస్తున్నావ్ అంటూ


Friday, September 12, 2014

అల బెంగళూరు నగరంలో, వైట్‌ఫీల్డ్ లో, ఆ మూల సాఫ్ట్‌వేర్ ఆఫీసులో

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

అల బెంగళూరు నగరంలో, వైట్‌ఫీల్డ్ లో, ఆ మూల సాఫ్ట్‌వేర్ ఆఫీసులో
కాంక్రీటు వనాంతర మత్స్య సరః ప్రాంత అష్ట వర్ష రివాల్వింగ్ చైరాసీన (అనగా ఎనిమిదేళ్ళనుండీ అదే కుర్చీలో ఉన్నాడు అని అర్ధం)  
కంప్యూటర్ వినోది యగు ఆ ఆపన్న ఇంజినీరు విహ్వల ఫ్రెషర్
పాహీ పాహీ యన కుయ్యాలించి సంరంభుడై

మేనేజర్ కున్ జెప్పడు, ఐడికార్డును, ఫోనును చేదోయి సంధింపడే
టీమును రా రమ్మని జీరడు, లిఫ్టును జేరడు, హస్తభూషణమౌ
మూషికమును మన్నింపడు, వివాదప్రోద్ధిత  శ్రీ మేనేజరు
లాప్‌టాపునైన వీడడు ఫ్రెషరు సందేహ నివృత్త్యోత్సాహియై   

ఇట్లు క్లైంటు జన పాలిత పరాయణుండును, నిఖిలి క్లైంటుజన హృదయారవింద సదన సంస్థితుడగు ఆ ఇంజినీరు
ఫ్రెషరు విజ్ఞాపిత నానావిధ దీనాలాపములాకర్ణించి, లాప్‌టాపు వినోదంబులం దనివి సాలించి, సంభ్రమించి, దిశలు నిరీక్షించి, ఫ్రెషరు రక్షాపరత్వంబు నంగీకరించి, లిఫ్టులోనకుద్గమించి, వేంచేయునపుడు....

తనవెంటన్ మేనేజరు, నాతని వెంట టీములీడు, దానివెంకను
హెచార్ మేనేజరు, వాని పొంతను సమస్త
పాలసీ నికాయంబును, అడ్మిన్లున్ను, హౌస్ కీపింగున్నూ రావొచ్చి
రయ్యన సాఫ్ట్‌వేరాఫీసు గలుగు వారాబాలగోపాలమున్  

కరుణాసింధువౌ ఆ ఇంజినీరు నూతనోద్యోగ జనిత అజ్ఞానమును ఖండింపగ బంపె
సత్వరితా కంపిత సాఫ్ట్‌వేర్ చక్రము, మహోద్యద్విస్ఫులింగ చ్చటా
ఆగ్రహోద్గద స్వరమునన్, బహువిధ ప్రాజెక్టుల నిర్వక్ర విచ్చిన్నకరంబగు,
పాలిత అఖిల సాఫ్ట్‌వేరు లోకమున్ తన అష్టవర్షానుభవమున్

ఇట్లు తన అనుభవమ్ముచేత ఫ్రెషర్ కున్న అపోహలు దూరము జేయుచు,
        ఇది కామధేనువు గాదు, సర్వము తనలోనిమిడ్చు కాలబిలము అనిన్నూ,          
       ఇందు సత్కార చీత్కారములు నీ ప్రతిభపై గాక వారి అవసరమ్ముపై  ఆధారపడియుండుననిన్నీ
       బాగుగా కార్యనిర్వహణ చేసిన పదోన్నతులు, ఆన్‌సైటులు  వచ్చునని భ్రమింప వద్దనీ  చెప్పుచుండ

మేనేజరొకడు మీటింగురూముకు జొచ్చెను
మేనేజరు మరియొకడు క్లైంటు పిలిచెనని జారెన్
మేనేజర్ల రూమున దిరిగెడు
మేనేజర్లందరు సియివో మరువున కరిగెన్

సరదాకి రాసిందే తప్ప పోతన వంటి వారిని అవమానించే ఉద్దేశ్యం ఏమాత్రం లేదు.


మనోహర్ చెనికల

Monday, September 1, 2014

బాపు

వారిమీద కధలు రాయడానికి రచయితని కాను, కనీసం నాలుగు ముక్కలు రాయడానికైనా నేను నేర్చుకున్న నాలుగు తెలుగు ముక్కలు వాళ్ళ దగ్గర నేర్చుకున్నవే. ఏమని రాయగలం ఆ మాటల మాంత్రికుల గురించి. వాళ్ళ స్నేహం గురించి, వాళ్ళ రామభక్తి గురించి?
రమణగారు వెళ్ళిపోయినప్పుడే భయమేసింది, ఎక్కడ స్నేహితుడికోసం ఈయనా వెళ్ళిపోతారో అని. ఈ రోజు వెళ్ళిపోయారు. ఆ రామయ్య పిలిపించేసుకున్నాడు.  వారి ఆత్మశాంతి కై ఆ రాముడిని ప్రార్ధిస్తూ

Monday, July 7, 2014

రామ నామమె చాలు, రామ చింతనే మేలు.

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

ఇది ఆరవ సారి హనుమద్రక్షాయాగంలో పాల్గొనడం. ప్రతీసారీ స్వామి చిత్రాతిచిత్రంగా దర్శనమిస్తూనే ఉన్నారు. ఓ మారు శింశుపా వృక్షశాఖల మాటున దాక్కుని చూస్తున్నట్టు, ఓమారు సుందరకాండ లో చెప్పినట్టు పూలతో నిండిన కొండా అన్నట్టు, ఓ మారు కొంచెం కోపంగా, ఓ మారు ప్రసన్నంగా ఇలా రకరకాలుగా కనిపించారు. ఈ సారి నా భార్యా బిడ్డలతో వచ్చేలా అనుగ్రహించారు. చిట్టి చిట్టి చేతులతో నాకూతురు స్వామికి పూర్ణాహుతి కలశాలు తీసుకుని అభిషేకం చేసింది. మూడు రోజులు సామి సామి అని స్వామి చుట్టూనే తిరిగింది. ఏ పని చెప్తే ఆ పని చేసింది. శివపార్వతుల కళ్యాణ విగ్రహాలను శుభ్రం చేస్తుంటే, నాన్నా స్నానం చేయించద్దు, సబ్బు రుద్దితే అమ్మకి కళ్ళు మంట పుడతాయి అని నాతో పాటే కూర్చుంది. పూర్ణాహుతి తర్వాత కలశాలు పైన పేరుస్తుంటే ఒక్కొక్కటి అందించింది. ప్రసాదాలు పాకింగ్ చేస్తుంటే ఒక్కొక్క పాకెట్ తీసి ఖర్జూరం పెట్టి ఇచ్చింది. ఇలా ఈ సారి చాలా ప్రత్యేకంగా జరిగింది.

ఇక ఈసారి జరిగిన సంకీర్తన అన్నింటికంటే ప్రత్యేకం. త్రినాధ శర్మ గారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుతూ ఉంటే ఏదో తెలియని ఉద్విగ్నత,
ఆ ప్రహ్లాదుడు,
ఆయన పడ్డ బాధలు,
ఆయనకోసం నానా జంగమ స్థావరాలలో నరసింహస్వరూపంతో నిండి పోయిన స్వామి.

వెతికితే ఎక్కడైనా కనిపిస్తాడని చెప్పిన ఐదేళ్ళ పిల్లవాడి నమ్మకం, 
చెటిల్లు చెటిల్లు, ఫెటిళ్ళు ఫెటిళ్ళు మని శబ్దాలతో స్థంబంలోనుంది వెలవడిన స్వామి,
ఇలా మనసంతా ఆయనే నిండిపోయినట్టనిపించింది. దానికితోడు, నాకు కులదైవం కూడా కావడం, ప్రతీ సంవత్సరం మాలకొండ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం వల్లనేమో ఆ నిమిషం అలా ఆగిపోతే బాగుండనిపించింది.
మొదటి సారి ఆ స్తోత్రం అలాగే యుగాలు పాడగలంత పెద్దదై ఉంటే బాగుండనిపించింది.

ఇక చివరి ఘట్టం, ఇరవైనాలుగు కోట్ల రామనామాన్ని భద్రాచలం చేర్చి, ఇదిగోనయ్యా నీ భక్తుల చేత నువ్వు రాయించుకున్న రామనామం అని ఆయనకి లెక్క చెప్పడం.
వెళ్ళలేకపోయాను కానీ మనసంతా అక్కడే ఉంది. ఇప్పుడు గోశాలకి వెళ్ళుంటారు, ఆవులకి కడుపునిండా భోజనం పెట్టుంటారు, ఇక సంకీర్తనతో స్వామి వారి దగ్గరికి వెళ్ళుంటారు ఇలా ఆలోచిస్తూనే ఉన్నాను ఈ రెండు రోజులు.

ఇందాకే మాస్టరు గారు ఫోన్ చేసారు. మనోహరూ, కార్యక్రమం అద్భుతంగా జరిగింది, నువ్వుకూడా ఉండి ఉంటే ఇంకా బాగుండేది అని అన్నారు. కార్యక్రమం మొత్తం ఇలా జరిగింది అని చెప్పారు.

ఎంతో సంతోషంగా ఉంది.

అందుకేనేమో పెద్దలు నెత్తీ నోరూ కొట్టుకుని చెప్పారు,
పలకండీ, పలకండీ, రామనామము, మీరు పలకమంటే పలకరేమి రామనామము అని.....


జై శ్రీరాం.